Thursday, September 29, 2011

காக்கைச் சிறகினிலே நந்தலாலா

సుబ్రహ్మణ్య భారతి - భారతియార్ రాసిన కవితలెన్నో, వాటిలో నేను నేర్చుకున్న ఒక చిరు కవిత. 
నాకెంతో ఇష్టమయినది.
అన్నట్టు ఇది ఆనంద్ తమిళ రిమేక్, నినైతలే లో కూడా ఉంది, ఆ ఆడియో మీ కోసం




காக்கைச் சிறகினிலே நந்தலாலா - நின்றன்
கரியநிறம் தோன்றுதையே நந்தலாலா


பார்க்கும் மரங்களெல்லாம் நந்தலாலா - நின்றன்
பச்சை நிறம் தோன்றுதையே நந்தலாலா


கேட்கும் ஒலியிலெல்லாம் நந்தலாலா - நின்றன்
கீதம் இசைக்குதடா நந்தலாலா


தீக்குள் விரலை வைத்தால் நந்தலாலா - நின்னைத்
தீண்டும் இன்பம் தோன்றுதடா நந்தலாலா





ఈ పాటకి భావం సౌమ్య గారు బజ్ లో ఇచ్చారు (https://plus.google.com/111060331959395474623/posts/j766Z6R1iqy)

sowmya alamuru - ఇది కృష్ణుడి గురించి పాడుతున్న పాట:

ఓ నందలాల

కాకిరెక్కల్లోని నలుపుని చూసినప్పుడల్లా
నీ శరీరపు నీలవర్ణమే గుర్తొస్తుంది

పూదోటల్లోని పచ్చదనం చూసినప్పుడల్లా
నీ పచ్చని ఛాయ గుర్తొస్తుంది

ఏ మధుర గేయాన్నీ విన్నా
నీ అమృత గానామే గుర్తొస్తుంది

అగ్నిలో వేలు చురుక్కుమన్నప్పుడు
అతీతశక్తిగల నిన్ను తాకిన భావం కలుగుతుంది.

Monday, September 19, 2011

నా ఆలంపూర్ యాత్ర

ఈ ఆదివారం జీవని విద్యార్థులను, మన బ్లాగ్మితృలను కలవటానికి అనంతపురం వెళ్ళాలి కాబట్టీ శనివారం వేరే ఏ పనీ లేదు కాబట్టీ, అలానే తుంగభద్రలో నీరు చేరాయి కాబట్టీ, ఆలంపూర్ దారిలోనే ఉంది కాబట్టీ. అమ్మో ఇన్ని కాబట్టీ లు కాబట్టీ నేను మొన్న శనివారం ఆలంపూర్ వెళ్ళాను.
ఉదయాన్నే సికంద్రాబాద్-కర్నూల్ టౌన్ తుంగభద్రా ఎక్స్ప్రెస్ లో ప్రయాణం. రైలు బండి ఉదయం 7:30 కు సికంద్రాబాద్ లో బయల్దేరి 8 కల్లా ఫలక్నుమా కు చేరుకుంది. అక్కడి నుండీ రైలు లో దాదాపు అయిదేళ్ళనుండి సుపరిచితమయిన రూటే కాబట్టీ అలా చూస్తూ కాలేజీ రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాను.








సరిగ్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకు రైలు శ్రీ బాలబ్రహ్మేశ్వర  జోగుళాంబా హాల్ట్ స్టేషన్ కు చేరింది. ఇక్కడ నుండి ఆలంపూరు ఒక 15 కి.మీ. లు ఉంటుంది. రైల్వే స్టేషన్ నిర్మాణం ఇంకా జరుగలేదు, ప్లాట్ఫాం కూడా లేదీ స్టేషనుకి. కానీ దగ్గర్లో ఉండే దాదాపు ౨౦ గ్రామాలకు ఇదే రైల్వే స్టేషన్ లేదా మరో పదిహేను కిలోమీటర్లు ప్రయాణించి కర్నూల్ వెళ్ళి రైలు ఎక్కాలి. తుంగభద్రా పుష్కరాల సమయం నుండి, ఇక్కడ పలు రైళ్ళను ఆపుతున్నారట. రైలు ఒక రెండు నిమిషాలు స్టేషన్లో ఆపారు. అక్కడక్కడ కూర్చోడానికి ఇనప కుర్చీలు, ఒక కంట్రోల్ రూం మినహా ఇంకేమీ లేవిక్కడ. కర్నూల్ వైపుకు స్టేషన్ ను ఆనుకొని ఆలంపూర్-కర్నూల్ రహదారి కలదు, ఇది ముందుకు వెళ్ళి ఎన్.హెచ్-౭ లో కలుస్తుంది.

రోడ్-రైలు లైనులు కలుస్తాయి కాబట్టి, ఇక్కడ ఒక రైల్వే గేట్ ఒకటి ఉంది. ఈ గేటు వద్దే ఆలంపూర్ కు వెళ్ళేందుకు షేర్ ఆటోలు, ప్రైవేటు ట్యాక్సీలు, వ్యానులు ఇంకా ఆర్టీసీ బస్సులు కలవు. నేను దిగిన సమయం మధ్యాహ్న విరామ సమయం కాబోలు గంట వరకూ ఒక్క బస్సు కూడా రాలేదు. 
ఇంకా కాసేపు ఆగి ఉంటే ఆకలికి నా పని అయిపోయేది, అందుకని బలవంతంగా ఒక షేర్ ఆటోలో ఆలంపూర్ చేరాను. చేరాక తెలిసింది, ఇక్కడ వసతికి కాదు కదా తినడానికి కూడా మంచి హోటెల్స్ ఏమీ లేవట. ఒకటి రెండు చిన్నపాటి భోజన హోటల్స్ ఉన్నాయి. అందులో ఒకటి మొహమ్మదీయులది బస్శ్టాండ్ నుండి అమ్మవారి గుడి వైపు వెళుతుండగా మొదట వచ్చే గాంఢీ బొమ్మ సర్కిల్ వద్ద ఉంది. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళాక కుడి వైపుగా వెళితే మరలా ఎడమ మలుపు, అక్కడ మరో సర్కిల్, అక్కడ ఆలంపూర్ పోలీస్ స్టేషన్ ఉంది, అక్కడే ఒక హిందూ హోటల్ కూడా కలదు. అక్కడ భోజనం చేసి, గుడి వైపుకి బయల్దేరాను. బస్ స్టాండు నుండి మహా అయితే ఒక అర కిలోమీటరు ఉంటుంది ఏమో.
మొదటగా శిధిలాల్లో ఉన్నా నవబ్రహ్మేశ్వర దేవాలయాలు కనిపించాయి. ఇంకాస్త ముందుకు వెళితే ఒక పదడుగులు వేసాక, ఎడమ పక్కన మూడు శిథిలాల్లో ఉన్నా దేవాలయాలు, కుడి పక్క ఆర్కేలాజికల్ సర్వే వారి సంగ్రహాలయం, దానికి ముందు, బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం, బాలబ్రహ్మేశ్వర స్వామి దేవాలయం పక్కన మరో నాలుగు విమాన గోపురాలతో సహా ఉన్న నవబ్రహ్మేశ్వరాలయాలు. ఇంకొన్ని విమానగోపురాల్లేని ఆలయాలు, పక్కనే ఆధునిక రంగులతో రెండు గోపురాల మధ్య గల జోగుళాంబా ఆలయం.
ముందుగా జోగుళాంబా ఆలయానికి వెళ్ళాను.
ఈ ఆలయం ఉదయాన్నే తెరుస్తారట, మధ్యాహనం ఒక గంట విరామం(౧ నుండి ౨ వరకు) తరువాత సాయంత్రం ౯ వరకు తెరిచే ఉంటుందిట. నిత్యం కుంకుమార్చనలు జరుగుతూనే ఉంటాయి. నేను వెళ్ళిన సమయంలోనే కొందరు యువతులు తెచ్చుకున్నా తినుబండారాలు, చాక్లేట్లు, పర్సు మొబైల్ ఫోన్ తోసహా అన్ని తస్కరించి కోతులు నానా అల్లరి చేస్తున్నాయి. వాటిని బుజ్జగించటంలో ఆలయ పూజారి మొదలు అందరూ నిమగ్నులయిపోయారు. దాదాపు అరగంట తరువాత పూజారి వచ్చి కుంకుమార్చన చేసి, అక్షత ప్రసాదాలు ఇచ్చారు.
అమ్మవారు రౌద్ర రూపం, ఉగ్రంగా ఉంటారు. ప్రస్తుతం ఉన్నది శాంత మూర్తి అని పూజారి అంటున్నా నాకమ్మ వారు చాలా భీతికరంగా అనిపించారు. తలపై పాపిడిలో రెండు బల్లులు, తేలు, పుర్రె, గబ్బిళం, మెడలో పుర్రెల మాల, కూర్చున్నది ఒక శవం పైన, అందునా ప్రేతాసనంలో. కోరలు, నాలుక బయటకి పెట్టి, పెద్ద కళ్ళతో. కొంచెం సేపు భయం వేసింది. దృష్టి మరల్చి గడపకై చూసాను, కింద మనిషి తల, పైన ఒక పుర్రె దాని కుడి వైపు రెండు బల్లులు, ఎడమ వైపు గబ్బిళం తేలు, కిందనే కోతీ పాములు పరస్పరం సంఘర్షణ చేస్తున్న దృశ్యం. ఇక చుట్టూ చూసాను, ఆధునికంగా కట్టిన గుడి, స్థంబాలపై, అష్టాదశ శక్తి పీఠాల్లో వెలసిన అమ్మ వారి రూపలు తీర్చిదిద్దారు. అలానే ఎదురుంగా సప్తమాతృకలను, వినాయకుణ్ణి చెక్కి ఉంచారు.
సతీ దేవి తనువు చాలించాక ఆవిడ కళేబరాన్ని ఎత్తుకుని ప్రళయ నాట్యమాడుతున్న శివుడ్ని వారించటానికి శ్రీమహావిష్ణువు సుదర్శన ప్రయోగం చెయ్యగా అమ్మవారి శరీరభాగాలు భూమిపై వివిధ క్షేత్రాల్లో పడి శక్తి పీఠాలుగా మారాయని ప్రతీతి. ఇవి 51 అని కొందరు, కాదు 18  అని కొందరి వాదన. రెండు నమ్మికల ప్రకారమూ, అమ్మవారి పై దంత పంక్తి ఇక్కడ జోగుళాంబా క్షేత్రంలో తుంగ-భద్రా-కృష్ణా త్రివేణీ సంగమ క్షేత్రంలో పడిందని ప్రతీతి.
అక్షత ప్రసాదలను తీస్కొని, నేను అయ్యవారి గుడివైపు వెళ్ళాను. ఇక్కడ స్పర్శ దర్శనం ఉంది.
బాలబ్రహ్మేశ్వర ఆలయం ఆధునిక గుడిలా లేదు. దీని ప్రాచీనత్వాన్ని కాపాడి అలా ఉంచేసారు. ఈ ఆలయం ఉదయం మొదలు సాయంత్రం వరకూ తెరిచే ఉంటుందట. నేను వెళ్ళిన సమయానికి నా వద్ద నా బ్యాగ్ గట్రా ఉండటం చేత, గర్భగృహంలోకి వెళ్ళలేదు. బయట బ్యాగు పెట్టి స్పర్శ దర్శనం చేస్కుందాం అనుకునే లోపే రెండు సార్లు కోతులు నా బ్యాగుని నా చేతిలో ఉండగానే లాక్కెళ్ళటానికి ప్రయత్నించాయి. అందుకని నేను బయటి నుండే దర్శనం చేస్కుని, ప్రదక్షినం చేసాను. ఆలయ వెలుపల గోడల పై ప్రాచీన శిల్పుల అద్భుతాలు కొలువుతీరాయి. అతి ప్రాచీన వినాయకుడా అనిపించాడు విఘ్నేశ్వరుడు.
రెండు ప్రదక్షిణ మార్గాలతో ఈ ఆలయం ప్రాచీన చండా ప్రదక్షిణ కు అనుకూలంగా ఉంది.
దర్శన-తీర్థ-ప్రసాదాల తరువాత గుడి బయటకు వచ్చాను. ఈ క్షేత్ర లడ్డూ పులిహోర ప్రసాదాలు ఈ ఆలయంలోనే దొరుకుతాయి.
నేను కొనుక్కున్నా ప్రసాదాలు మర్కటార్పణం అయ్యాయి.
ఇక్కడి నుండి నేను సంగ్రహాలయానికి అలానే శిథిలాల్లో ఉన్న ఇతర దేవాలయాలను చూడటానికి ఉపక్రమించాను.





సంగ్రహాలయం చాలా చిన్నది కేవలం ౩ రూఁ రుసుము తో ఇది చూడొచ్చు. ఇక్కడ శిథిలాల్లో బయలపడిన విగ్రహాలను ఉంచారు. మహిశాసుర మర్ధినీ, శివుడు, నటరాజు, సూర్యుడు, విష్ణువు, సప్త మాతృకలు, గంధర్వులు, యక్షులు, అష్ట దిక్పాలకులు, లకులేశుడు, మునులు, ఇంకా ఎన్నో శిలాశాసనాలు, ఇక్కడ ఉన్నాయి.
నన్నిక్కడ అన్నిటికంటే ఎక్కువగా ఆకట్టుకున్నది, దక్షిణా మూర్తి, ఇంకా నటరాజ శిల్పాలు, వివిధ రకాలుగా ఉన్న మహిశాసుర మర్ధిని, విష్ణువు.























తరువాత నేను సంగ్రహాలయం బయటకు వచ్చి, తుంగభద్రా పుష్క్ర గట్టు వైపుకు వెళ్ళను. కర్నూలులో లా కాక ఇక్కడ పుష్కరాలకు నిర్మించిన మెట్లు ఇంకా యథాప్రకారం ఉన్నాయి. వరదల ప్రభావం వీటిపై లేదు. 
నీరు కూడా బాగానే ఉంది. 
అక్కడ తెప్ప పై ఇక్కడుండే మత్స్యకారులు నదీ విహారానికి తీసుకెళ్తారు. సమయాభావం వల్ల నేను వెళ్ళలేదు. ఇక్కడి నుండి ఒక ౨౦ కి.మీ. ల దూరంలో త్రివేణీ సంగమం ఉందట. అక్కడకూ వెళ్ళేందుకు సమయం సరిపోదని వెళ్ళలేదు. ఇప్పుడిక్కడొక వంతెన నిర్మాణం లో ఉంది, మరో పది పిల్లార్లు వేస్తే నిర్మాణం పూర్తవుతుందట, ఈ వంతెన ద్వారా శ్రీశైలం కు హైదరాబాద్ కు మధ్య ప్రత్యామ్నాయ మార్గం వస్తుందని ఇక్కడి మత్స్యకారులు చెప్పారు.
కాసేపయ్యాక తిరుగుప్రయాణానికి కర్నూల్ చేరుకున్నాను.






మన ప్రస్తుత సామాజిక దుఃస్థితి

ప్రశాంత్ గారి ఆంగ్ల బ్లాగు "No green grass on the other bank" సౌజన్యంతో


http://prasanthias.wordpress.com/2011/09/13/the-long-pole/ అను ఈ బ్లాగు చదివిన వెంటనే నన్ను ఎంతో ప్రభావితం చేసింది, ఇది మన తెలుగు లో కూడా ఉండాలని ఈ టపా రాస్తున్నాను.

అనగనగా ఒక సుదూరపు పల్లె లో ఒక సింహం సివంగి దంపతి నివసించేది. ఆ సింహం ఒక కృషీవలుడు, పొలంపని తప్ప మరేమీ తెలీనివాడు. సివంగి ఒకప్పుడు NREGA, తరువాత రోజుల్లో MGNREGA ద్వారా కూలి పని చేసుకునేది.
అదే గ్రామంలో ఉన్న పిల్లి షావుకారు గారి 50 ఎకరాల వరి పొలాన్ని సాగు చెయ్యడం మన సింహం గారి జీవని. ఇలా పిల్లి షావుకారు గారి వద్ద కౌలు చెయ్యటం వలన దిగుబడి లో సగభాగం షావుకారి వాటా అయ్యేది. ధాన్యం సాగులోని నష్టాలకు భరించలేక ఏ అరటో, చెఱుకో లేక పొగాకో సాగు చేద్దమనుకున్నాడు సింహం రైతు, కానీ భారత ప్రభుత్వ ధాన్యం భూమి మరియు మాగాణి రక్షణ చట్టం దీనిని అనుమతించదు. (కానీ అదే భూమిని ప్రత్యేక ఆర్థిక మండళ్ళ పేర ప్రైవేటు సంస్థలకు అప్పగించి అందులో ఎంత హానికరమయిన ఫ్యాక్టరీ ని పెట్టినా ప్రభుత్వానికి సమ్మతమే).
ఉడుత సేటు గారి వద్ద అతి ఎక్కువ మొత్తంలో అప్పు చేసినందుకు రైతు సింహం తన ఇల్లును ఉడుతకు SARFAESI Act. కింద అప్పగించాల్సి వచ్చింది.
పంచాయతీ ప్రెసిడెంటు పంది గారు రైతు సింహం కౌలు తీస్కున్న పొలంలోనే బస్టాండు, షాపింగు కాంప్లెక్సు, ఇంకా ఎయిర్పోర్ట్ ఉండాలని నిర్ణయించాడు. ఎందుకంటే ఆ పొలం చుట్టు పక్కల భూములన్నీ అప్పటికే పంది కులంలోని ఇతర పందులు కొనెయ్యటం లేదా కబ్జా చెయ్యటం చేస్సాయి.  ధాన్యం భూమి మరియు మాగాణి రక్షణ చట్టం ప్రకారం సాగు భూమి లో వాణిజ్యపరమయిన పనులు చేయరాదు, కేవలం ధాన్యం సాగుకు మాత్రమే ఆ భూమిని వాడాలి. కానీ సింహం-సివంగి తప్ప ఊరందరికీ ఎయిర్పోర్టు అవసరం కావల్సిన ఆవశ్యకత తెలిసొచ్చింది. అర్జెంటుగా ఊరికొక ఎయిర్పోర్టు కావాలి అన్నదై అందరి వాదన. ఆఖరికి ఊరి బిచ్చగాడయిన ఏనుగుకి కూడా తన సమీప భవిష్యత్తు దృష్ట్యా బస్టాండు-షాపింగ్ మాల్-ఎయిర్పోర్టు కావలని అనిపించింది. బహుళ సమ్మతి ఉంది కాబట్టి వెంటనే చట్టాన్ని రద్దు చెయ్యాలని గ్రామ పెద్దలంతా నిర్ణయం తీస్కున్నారు. టెండరు పిలిపించి ఎల్&టీ సంస్థకు చట్టాల దాగుడుమూతలు మొదలు బస్టాండు-షాపింగ్ కాంప్లెక్సు-ఎయిర్పోర్టు కట్టడం వరకూ అన్ని బాధ్యతలు అప్పగించారు. దీనిని కేవలం దోమ దళితులు మాత్రమే నిరసించారు, కానీ వారు మైనారిటీ లో ఉండటం వలన వారికి కావల్సినంత బలం లేనందున వారి మాటను ఎవరూ పట్టించుకోలేదు. పై పెచ్చు కొన్ని దోమలు చంపివేయబడ్డాయి. ఇదంతా చూస్తున్న మైనారిటీ కమిషన్ షాక్ వ్యక్తపరిచింది, ఆ షాక్ ద్వారా వచ్చిన కరెంటుని గ్రామంలోని అన్ని విద్యుద్దీపాలు వెలిగించడానికి ఉపయోగించారు గ్రామ పెద్దలు.
పోస్టుమ్యాను జెర్రి అప్పుడన్నాడు బలం-స్థాయి అన్నవి మురికి కూపాలు అవినీతి తో కూడుకున్నవి, మరియు పూర్తి బలం-పూర్తి స్థాయి పూర్తి మురికి కూపాలు పూర్తి అవినీతి తో కూడుకున్నవి. అందువల్ల ఊళ్ళో అవినీతి అనేది ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. ఊరికి వాయవ్యంలో గల చిట్టడవిలో ఉండే పెళ్ళికాని-ఎటువంటి బాంధవ్యాలు లేని గుడ్లగూబ ఈ పెరిగిపోతున్న అవినీతికి విరుద్ధంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టింది. దీక్ష వలన ఆ ఊరి దశ మారింది. దీక్షాపరమయిన మార్పులు ఆ ఊర్లో చోటు చేస్కున్నాయి. ఆ ఊరు ఇంకా ఊరులా లేదు(గుడ్లగూబ దీక్ష ను చూడటానికి వచ్చే వాళ్ళ వల్ల, ఊరికి రోడ్లొచ్చాయి, సర్వ వసతులు సమకూరాయి, మీడియా వాళ్ళ సందడి అంతా ఇంతా కాదు. ఊర్లో పిల్ల వాడు తుమ్మినా ది న్యూస్ చానళ్ళు లైవ్ కవరేజ్ ఇవ్వటం మొదలేట్టాయి, ఊరి ప్రాచుర్యాన్ని చూసి అడుగు భూమి ధర అర కోటి అయింది). గుడ్లగూబ ఈ అవినీతి నంటటినీ చూడటానికి, చూసి నిర్మూలించటానికి ఒక పేద్ద స్తూపాన్ని ఊరి నడిబొడ్డున పెట్టమని ఊరిపెద్దలను కోరింది, ఊరిపెద్దలు సరేనన్నారు. గుడ్లగూబ తిరిగి తన చిట్టడవికి చేరింది. ఈ స్తూపాన్ని సింహాలు, పులులు, దోమలు ఉండే వీధులు మాత్రమే కనపడేలా ప్రతిష్టించిన ఊరి పెద్దలయిన పందులు ఉడుతలు, ఎప్పుడు పులులు , సింహాలు, దోమలు తప్పు చేసినా అప్పుడు స్తూపానికి ఒక పేద్ద భూతద్దాన్ని పెట్టి గుడ్లగూబకు జరిగిన తప్పును పది రెట్లు పెద్దదిగా చూపేవి. ఆ విధంగా పందుల నేపధ్యంలో మొత్తం పాలనా వ్యవస్థ సాగుతోంది.
కొద్ది రోజులకి సింహం చనిపోయింది. ఇంకొన్ని రోజుల తరువాత సివంగి కూడా చనిపోయింది. చనిపోని వారంతా ఆ ఊరిలో సుఖంగా బ్రతుకు జీవనం సాగించారు. పది సంవత్సరాల తరువాత ఆడిటర్లు 25 సింహాలు అంతరించిపోయాయి అన్న నివేదిక ను సమర్పించాయి.

Friday, September 16, 2011

లోహిత్ తెలుగు మెరుగయిన ఖతి వచ్చిందోచ్!

మనకు తెలుగులో యూనికోడ్ లో అందుబాటులో ఉన్న ఖతులు చాలా తక్కువ.
గౌతమి, పోతన, వేమన, కాకుండా, అత్యధికంగా వాడుకలో ఉన్నా ఖతి లోహిత్ తెలుగు.
రెడ్ హ్యాట్ సంస్థ వారు నిర్వహిస్తున్న ఈ ఖతిలోని అక్షరాలు చాలా గుండ్రంగా స్పష్టంగా ఉంటాయి.

లోహిత్ తెలుగు ఖతి వచ్చాక రాతఖతుల లోటు తీరింది అనే చెప్పాలి.
ముఖ్యంగా డ గుణింతం, క గుణింతం చాలా చక్కగా ఉంటాయి. పాత కాలపు వ్రాతల్లా ఉండే క గుణింతం చూసి అప్పుడప్పుడు మా తాతల నాటి ద్రవిడ ప్రతులు, తెనుఁగు ప్రతులలో వంటి అక్షరాలు అని మురిసిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

పోతన లో సంయుక్త, సంశ్లేష అక్షరాలు వ్రాస్తున్నప్పుడల్లా కొంచెం ఇబ్బందిగా ఉండేది. అక్షరాలు ఒకటి మరోదాంట్లో కలిసిపోయి, వికారంగా అనిపించేది. వేమన వ్రాతఖతిగా ఉపయోగించలేము. వేమన ఖతి శీర్షికలు రాయటానికి బావుంటుంది. అన్ని మెలికలు ఉండేసరికి పెద్ద పాఠ్యాలు చదవాలంటే కొంచెం ఎబ్బెట్టుగానే ఉండేది. గౌతమి అనగానే ఎందుకో, కొన్ని అక్షరాలు మరీ యాంత్రికంగా ఉంటాయి. పైగా ఆ ఖతి స్వేచ్ఛా ఖతి కాదు. అందుకని కొంచెం బావున్నా వాడలంటే ఇబ్బందే.
అందుకని లోహిత్ తెలుగు వచ్చాక నాకు ఎంతో మేలు జరిగిందని చెప్పొచ్చు. తెలుగ్లో రాయాలన్నా, చదవాలన్నా, మరింత అందంగా అక్షరాలు కనిపిస్తుంటే ఎవరికయినా నచ్చదు మరీ?
పైగా ఎన్నో చోటల మన ఆద్య గురువులు ఈ ఖతిని వాడుతున్నారు కూడా.

ఇక లోహిత్ తెలుగు చరిత్ర తెల్సుకుందాం. లోహిత్ తెలుగు ను ప్రాయోజితం చేస్తున్న ఫెడోరా ప్రాజెక్టు లోని వికీ ప్రకారం,
౨౦౦౪ లో రెడ్ హ్యాట్ సంస్థ అయిదు భారతీయ భాషలకు జీపీఎల్ లైసెన్స్  ద్వారా స్వేచ్ఛా ఖతులను విడుదల చేసింది. సంస్కృతంలో ఎఱుపు అని అర్ధం వచ్చే లోహిత్ అన్న పేరుతో వీటిని విడుదల చేసారు. ఈనాడు అస్సామీ, బెంగాలీ, దేవనాగరీ(హిందీ, కశ్మీరీ, కొంకణీ, మైథిలీ, నేపాలి,మరాఠీ, సింధీ), గుజరాతీ, కన్నడ, మళయాళం, ఒడియా, పంజాబీ, అరవం ఇంకా తెలుగు, మొత్తం ౧౬ భారతీయ భాషలకు లోహిత్ ఖతులు అందుబాటులో ఉన్నవి.
ప్రస్తుతం ఫెడోరా ప్రాజెక్ట్ వారు ఈ ఖతుల నిర్వహణ చూస్తున్నారు. లోహిత్ ఖతులన్నీ యూనికోడ్ ౫.౧ అనుకూలం.

అయితే మిత్రులు చాలా మంది గమనించే ఉంటారు ఫస్ట్ అన్న పదం రాసినప్పుడు తలకట్టు స మీద ఉండి పొల్లు పక్కకు పోవడం లోహిత్ తెలుగులో ఉన్న అపచారం, అలానే చూస్తున్నాం, రాస్తున్నాం అన్న పదాలు రాసినప్పుడు న్నాం అన్న ద్విత్వ-సంయుక్తాక్షరం(మిశ్రాక్షరం) న, నకారప్పొల్లు, దీర్ఘం, సున్నాలుగా విడిపోతుంది, ఇదీ ఒక పెద్ద లోటే.
కానీ మొన్న ౩౦ ఆగస్టు ౨౦౧౧ నాడు లోహిత్ తెలుగు వారి అత్యాధునిక ౨.౪.౬ వెర్జన్ విడుదలయింది.
ఇందులో ఇలాంటి తప్పిదాలను సరి చేసారు.
ఇంకెందుకు ఆలస్యం వెంటనే  లోహిత్ తెలుగు ఖతిని ఇక్కడ నుండి దింపుకోండి.

సూచన :
కానీ "-" (హైఫెన్) ఈ ఖతిలో లుప్తమయింది. అలానే ఆంగ్లం లో V అక్షరం (పెద్దబడి వీ అక్షరం), ఫుల్స్టాప్, రాసి వాటికి లోహిత్ తెలుగు ఆపాదిస్తే అవీ లుప్తమవుతున్నవి. వీటిపై ఒక బగ్ ఫైల్ చేసాను. అలానే అదే బగ్ తో పాటు బగ్ ఫిక్స్ కూడా పెట్టాను. తదుపరి విడుదలలో ఇవి పొందుపరుస్తామని నాకు విజ్ఞప్తి అందింది.