Tuesday, May 27, 2014

మోసగాళ్ళుంటారు జాగ్రత్త

సుజాత గారి ప్లస్ పోస్ట్ (https://plus.google.com/u/0/photos/113352906292796986132/albums/6017926039705877633 మీరావిడ సర్కిల్స్ లో ఉంటే కనిపిస్తుంది) చూసి అందులో అజ్ఞాత వ్యక్తులతో మోసపోయిన రాధిక గారి వృత్తాంతం చదివాక, నా తిరుపతి అనుభవం చెప్పాలనిపించి ఇక్కడ రాస్తున్నాను.

విజయవాడ నుండి బెంగుళూరు వెళ్ళాలి. హౌరా-బెంగుళూరు ఎక్స్ప్రెస్ మధ్యాహ్నం 3-4 ప్రాంతంలో ఎక్కాను. రైలు కిక్కిరిసి ఉంది. ఓఢ్ర దేశం వారు కుక్కినట్టూ ఉన్నారు, ముగ్గురి బెర్త్ లో ఐదుగురం కూర్చొని ప్రయాణిస్తున్నాం. "రిజర్వేషన్ పెట్టె కదా మీరు పక్కకు వెళ్ళండి" అనే కర్కశ కఠోర మనసు కాదు మనదేమో! పైగా ఒకే కుటుంబంలో ముగ్గురు మగరాయుళ్ళు, ఇద్దరు పురిటి నొప్పులు తీరని ఆడవాళ్ళు, వెరసి ఇద్దరు చంటిపిల్లలు, మరో ముగ్గురు పిల్లలూను.
ఉయ్యాల(లు) కట్టారు, పిల్లల అరుపులు, ఏడుపులు, ఒడియా వారి సహజ దేహ దుర్వాసనలు, ఉమ్ములూ, కిళ్ళీ నవలటాలూ, వారి ఆహారపు వాసనలు వెరసి ఆ రైలు ప్రయాణం ఇక దండగ, నిద్ర పట్టదు అని నిశ్చయించుకున్నా (కొంచెం అడ్జస్ట్ అయి కూర్చోగలరు, మిడిల్ బెర్త్ బెడ్ తీస్తే ఉయ్యాలలు డిస్టర్బ్ అవుతాయి అని అభ్యర్థన - నాది మిడిల్ బెర్తే!) మరుసటి రోజు ఆఫీసులో పొద్దున్నే ప్రోయాక్టివ్ గా ఉండాలి అందుకని తిరుపతి రాగానే రైలు దిగేసి, బస్సు పట్టుకుని బెంగుళూరు వెళదామని నిశ్చయించుకున్నాను.
అర్ధరాత్రికి తిరుపతి వచ్చింది, స్టేషన్ లో దిగేసి, తిరుమల అందాలను చూసుకుంటూ స్టేషన్ బయటకు వచ్చాను. బస్ స్టాండ్ దగ్గరే (ఓ అర కిలోమీటర్ ఉంటుందేమో) కదా అని నడిచి వెళదామనుకున్నాను. విష్ణు నివాసం తరువాత సన్నని మలుపు ఉంది. అక్కడ ఒక 25-30 యేళ్ళ వ్యక్తి ఎదురయ్యాడు. తాగి ఉన్నాడు. పలకరించాడు. తాగి ఉన్న వాళ్ళంటే నాకెందుకో చాలా అసహ్యం. చిన్నప్పుడు మా నాన్న గారు ఇంకెవరికో ఇద్దామని ఆర్మీ క్యాంటీన్ లో కొని తెచ్చిన రెండు బాటిల్స్ ని కింద ఘాట్టిగా పడేసి పగలకొట్టాను. ఆ తరువాత మరెందరితోనో కాలేజీ రోజుల్లో మాట్లాడ్డం, పలకరించడం మానేసాను - వాళ్ళు ఆల్కహాలిక్కులు అనీ. కచేరీల్లో చేరాక వారితో కో-ఎగ్జిస్ట్ అవటం నేర్చుకున్నాను కానీ, అసహ్యమే.
సరే చిరాగ్గానే ఏమిటి అని అడిగాను. ఆ వ్యక్తి చెప్పటం ఆరంభించాడు.

"నా పేరు ఫలానా, నేను హైదరాబాదులో ఉంటున్నాను. ఫలానా కచేరీలో పని చేస్తున్నాను. తిరుమలకు దర్శనానికి వచ్చాను. నా పర్సు, డబ్బులూ అన్నీ పోయాయి అన్నాడు. "
మరి తాగున్నావు, అదేమిటీ అని అడిగాను.
"అదా! నాకు వారాంతాలు తాగడం అలవాటు."
"భగవంతుని సన్నిధిలోనే!"
"చెప్పాగా, టెంప్ట్ అయ్యాను, అలవాటు మానుకోలేక పోయాను."
(వీడెవదో దొరికాడు, ఇప్పటికిప్పుడు బెంగుళూరు బస్సెక్కితే ఏ 5 గం॥లకో చేరతాను, మళ్ళీ మంచమెక్కానంటే నిద్రలోకి వెళ్ళి ఈ రోజు ఆఫీసు వెళ్ళలేను, నిద్రెలాగూ పోయింది, కాస్త ఎంటర్టెయిన్మెంట్ మిగిలిద్ది, వీడితో 3 వరకూ ఉండి ఆ పై బస్సెక్కుదాం అని అనిపించింది, అనిపించినదే తడవు సంభాషణ పెంచాను)
"సరే అబ్బాయీ ఇప్పుడేం కావాలి?"
"అదే పర్సు పోయింది, హైదరాబాదు దాకా వెళ్ళాలి, డబ్బు సాయం చేస్తే మీ ఫోను బ్యాలెన్స్ వేస్తాను."
"నాకు పోరిదోస్తులు లేరబ్బా, ఫోనులో 10 రూ వేసినా నెలంతా ఉంటాది. ఇంకో మాట చెప్పు."
"సరే, నీ అకౌంట్ నంబర్ ఇప్పిచ్చావనుకో, బ్యాంకులో డబ్బులు జమ చేస్తాను."
"ఏమయ్యా సాఫ్టువేరీవంటున్నావు, ఆ మాత్రం తెలీదా నెట్ బ్యాంకింగ్ వగైరా ల గురించి."
"ఆఁ! తెలుసు తెలుసు, ఎందుకు తెలీదూ. నీ బ్యాంక్ డీటెయ్ల్స్, ఐఎఫెస్సీ కోడ్ తో సహా చెప్పు, రేపు హైదరాబాదు చేరంగానే వేసేస్తాను."
"ఎప్పుడు ప్రయాణం"
"ఏం చెప్పమంటారు, పర్సు ఖాళీ అ<... పర్సు పోయింది, మీరు డబ్బిప్పిస్తే వెంటనే ఏ రైలు అందితే అది, జెన్రల్ లో ఎక్కి వెళ్ళిపోతాను. హైదరాబాదు వెళ్ళంగానే మొదటి పని నెట్ ఓపెన్ చేసి మీకు డబ్బు పంపటమే."
"సరే, ఎంత డబ్బు కావాలి?"
"ప్రయాణానికి సరిపడా!"
"ప్రయాణం టికెట్ కొనిస్తే సరిపోద్దా?"
"అంటే జేబులో పైసా లేదు, రోజు ప్రయాణం, తిండికీ, నీళ్ళకీ...."
"సరే అబ్బాయీ, చూద్దాం పద. నా వద్ద జేబులో డబ్బు లేదు. ఏటీఎం నుండి తియ్యాలి. బస్ స్టాండ్ కీ రైల్వే స్టేషన్ కీ మధ్య ఉన్నాం. నువ్వెలాగో ట్రెయిన్ లో వెళతానంటున్నావు, టికెట్ నేనే తీసిస్తాను. పై ఖర్చులకు ఇంకో రెండొందలిస్తాను."
"సరే!"
"సరే, ఇంతకీ సాఫ్టువేరీలో ఏం చేస్తున్నావు?"
"మీరూ సాఫ్టువేరేనా?"
"నేనేమైతే ఎందుకు? అయినా చెబుతున్నాను విను. నేను సాఫ్టువేరు వాడినే, కానీ బకానాం హంసః గాడిని. సాఫ్టువేరుకి మించే పని చేస్తున్నానులే!"
వాడికి కాసేపు నేనేమన్నానో అర్ధం కాలేదు. బిక్కమొహం పెట్టేసాడు.
"నా సంగతి సర్లే ఏదో భాషాభిమానమూ యౌవన ఆవేశం కలిసొచ్చి ఏదో చేస్తున్నాను, నీ సంగతి చెప్పు"
"నేనా, టెస్టింగ్ ఇంజనీర్ ని."
"ఇంకా?"
"ఈ మధ్యనే ఒక ఆర్నెల్ల క్రితం పెళ్ళయింది. అమ్మాయి వాళ్ళ నాన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఆఫీసరు. బాగానే కట్నం ముట్టింది. హైదరాబాదులో 3 బెడ్ రూం ఫ్లాట్ వచ్చింది. అమ్మాయి గ్రూప్స్ కి సిద్ధమవుతుంది. నా ప్యాకేజీ కేవలం నెలకు పాతిక, మిగితా ఖర్చులన్నీ మామగారే ఇస్తున్నారు. ఇంట్లో పప్పు-ఉప్పు అన్నీ మాకు ఊరు నుండే పంపిస్తున్నారు. జీతం తక్కువగా ఉందని, ఆన్సైటు ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళాలని అనుకున్నాను. వైజాగ్ లో ఒక కన్సల్టెన్సీ ఉంది స్నేహితుడే దానికి సీఈఓ. మూడు అడిగారు పంపడానికి. అంతా ఓకే అయి ఇలా మంచి జరిగిందని స్వామి వారిని చూద్దామని వచ్చాను. అలవాటు ప్రకారం పబ్ కి వెళ్ళాను, పర్స్ అవీ అలా టేబుల్ మీద పెట్టి బార్ టెండర్ దగ్గరికి వెళ్ళి షాట్స్ తీసుకున్నాను?"
"షాట్స్ అంటే?"
"తరువాత చెబ్తాను. తిరిగి వచ్చి చూస్తే పర్సు లేదు. ఇదే హైదరాబాదు అయి ఉంటే తీసుకున్నవాడి తోలు వలిపించే వాడ్ని. రేపు స్వామి వారి దర్శనానికి వెళ్ళాలనుకున్నాను. ఇప్పుడంతా వృథా. తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. స్వామి దర్శనం చేసుకోకుండా తిరుపతి వచ్చి వెళ్ళిపోతున్నాను. ఏం ఉపద్రవం తల మీదకు వస్తుందో!"
నాకూ అలా అనిపించింది. కాస్సేపు ఆలోచించాను.
"సరే, మీరంత బాధ పడవద్దు, ఇద్దరం కలిసే దర్శనానికి వెళదాం. నేను ఖర్చులన్నీ పెట్టుకుంటాను."
"అయ్యో అంత శ్రమ మీకెందుకు. డబ్బిప్పించండి, హైదరాబాదు వెళ్ళి తిరిగి వచ్చి దర్శనం చేసుకుంటాను. నా డబ్బుతో నేనే దర్శనానికి రావాలి."
"దేవుడే మిమ్మల్ని రప్పించుకుంటున్నాడనుకోండి. కాలి నడకన పైకి వెళదాం. ఆపై వసతి అవసరం లేదు. నడకకు ముందు, విష్ణు నివాసంలోనో, శ్రీనివాసం లోనో డార్మ్స్ లో పడుకుందాం, ఫ్రీ. తిరిగి వచ్చాక హైదరాబాదు వరకూ వెళ్ళే రైలు ఎక్కించే బాధ్యత నాది. కావాలంటే మీతో పాటుగా హైదరాబాద్ వస్తాను."
వాడు సంశయిస్తూ ఓకే అన్నాడు.
"సరే అలిపిరి కి వెళ్దామా, శ్రీవారి మెట్టుకా"
"నాకు తెలీదు, నేనెప్పుడు నడిచి వెళ్ళలేదు."
ఈ లోపు ఏటీఎం వచ్చింది. డబ్బు డ్రా చేసాను. టికెట్ తీసి ఇచ్చాను.
తెల్లవారున కృష్ణా ఎక్స్ప్రెస్ కి వెళ్ళిపోతానన్నాడు. అదేమిటీ ఇప్పుడేగా దర్శనం చేసుకోవాలనుకున్నాం, అంటే లేదు నాకు మూడ్ లేదు, తిరుపతి వచ్చి తాగాను, ఘోర పాపం చేసాను. ఈ పాపి దర్శనానికి అనర్హుడు అన్నాడు. సర్లెద్దు, నేను నీ పాపాన్ని మూటగట్టుకుంటా, పద ముందు దర్శనానికి వెళదాం అన్నాను. కాస్సేపు స్టేషన్ లో కూర్చుందాం అన్నాడు. ఇంకొంచెం చెప్పుకొచ్చాడు.
"మాది చాలా బీద కుటుంబం, కానీ చౌదరింట పుట్టాను. రోషం-పౌరుషం ఎక్కువ. డబ్బు కోసం దిగజారే కుటుంబం కాదు మాది. అడుక్కోటం అస్సలు రాదు. " ఇంకేదేదో చెప్పాడు.
"ఇదంతా ఇప్పుడెందుకు?"
"ఆఁ, మీకు నా మీద అనుమానం గా ఉంది. అందుకనే డబ్బు బదులు టికెట్ ఇస్తున్నారు."
"లేదు, లేదు. నేను నిన్ను పూర్తిగా నమ్ముతున్నాను. తాగి ఉన్నావు. నీ వద్ద ఎవరయినా రుబాబు రాయుళ్ళు వచ్చి ఉన్న డబ్బంతా తీసుకుపోతే? టికెట్ అయితే ఏ కానిస్టేబులూ తీసుకుపోడుగా..."
"సరే, ఇంకా దర్శనానికి వెళదామా"
"ఇప్పుడేగా దర్శనం వద్దు రేపు ఉదయం తెల్లవారుఝాము రైలెక్కుతానన్నావు?"
"లేదు, వెళదాం"
"సరే, పద"
విష్ణు నివాసం ముందు వైపుకు ఆటోలు ఉంటాయని అటు నడుస్తుండగా, గోవిందరాజస్వామి కోనేరు ముందున్న గేటు లోంచి లోపలికి పోదాం అని సంజ్ఞ చేసాడు. నేను ఫాలో అయ్యాను.
అక్కడ అరుగు మీద నడుము వాల్చుదామన్నాడు, సరే అన్నాను.
ఒక గాలి ఆడే చోట మెట్ల మీద కూర్చున్నాం. అతడు ఒక వేపు చూపించి అక్కడ సీసీ కెమెరా ఉంది, ఒకవేళ మనం నిద్ర మగతలో ఉన్నా మన సామానులు సేఫ్ అన్నాడు. అలిపిరి తెలీని వాడికి ఈ విష్ణునివాసంలో కెమెరాలు ఎలా తెలుసబ్బా అని అనుకుంటూ ఉండగా.
"లేదు సర్, నేను హైదరాబాద్ వెళ్ళాలి. నా ఫోనులో బ్యాలెన్స్ అయిపోయింది, మా ఆవిడ ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు."
"నేను బ్యాలెన్స్ వేయిస్తాగా, అయినా దర్శనం అయినంత సేపూ ఫోన్ వాడముగా, కౌంటర్ లో ఉంటుంది. మీ వాళ్ళు అర్ధం చేసుకుంటారులే. దర్శనానికి మనం ఎంత త్వరగా మొదలయితే అంత మేలు."
"లేదు, నాకు చాలా పనులు ముందుకు వెళ్ళవు."
అప్పుడే నాకు ఏదో తోచి, ఫోన్ చూసుకున్నాను. ఆఫీసుకు త్వరగా రావాలని మెసేజ్ ఉంది. సర్లే అని నేను కూడా తగ్గాను.
"సరే, పద. నన్ను బస్ స్టాండ్ వద్ద విడిచి, నువ్వు రైల్వే స్టేషన్ కి వెళ్దూ."
"అన్నట్టూ మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వలేదు."
"పర్వాలేదయ్యా!"
"లేదు ఇవ్వండి"
"సరే!"
అతనో పుస్తకం చేతిలో పెట్టాడు. అందులో పేజీలో మూణ్ణాలుగు చోట్ల పేరూ-ఫోన్ నంబర్ లేదా పేరూ-బ్యాంక్ అకౌంట్ నంబర్ ఇంకా ఏవేవో అంకెలూ రాసున్నాయి. మధ్యలో ఓ ఖాళీ పేజీ ఇచ్చి రాయమన్నాడు. మళ్ళీ అనుమానం పడితే వీడు ఏడ్చేస్తాడేమో అని ఏం అనలేదు. వ్రాస్తూ ఆలోచిస్తున్నాను ఏ అకౌంట్ వివరాలివ్వాలా, అమ్మదా లేక నాదా అనీ.
అంతలో అంత అనుమానమెందుకు ఇవీ నా సెర్టిఫికేట్స్ చూడండి అని నా చేతికిచ్చాడు.
"ఎంబరాస్ చెయ్యకురా స్వామీ!"
అన్నీ తిరుపతివి, వాడేమో వైజాగ్ వాడిని, హైదరాబాదులో ఉంటున్నాను అని చెప్పాడు. సర్లే మళ్ళీ ఏడుస్తాడేమో అని ఏం అనలేదు.
ఇక వీడు మోసగాడే అని రూఢీ చేసుకుని, పై డబ్బు ఏమీ ఇవ్వలేదు.
వీడి శోకులు మరీ ఎక్కువయ్యాయి, బస్ స్టాండ్ కి వెళ్ళే దారిలో ఓ పాన్ షాప్ వద్ద సిగరెట్ ఇంకా గమ్  కొన్నాడు. వాటి డబ్బులూ నన్నే అడిగాడు, అయిష్టంగానే ఇచ్చాను. తాగే వాళ్ళంటే ఎంత అసహ్యమో స్మోక్ చేసే వాళ్ళంటే అంతకు రెట్టింపు కోపం నాకు. వాళ్ళు చావక ఎదుటి వాళ్ళను చంపుతారు.
సర్లే నిండా మునిగాక చలి ఉంటుందా?
ఎలాగూ 200 టికెట్ కిచ్చి మోసబోయాను అని అనుకున్నాక ఈ పదీ పరకా ఒక లెక్కా?
బస్ స్టాండ్ వచ్చింది.
ఇద్దరం కృత్రిమంగా నవ్వులు మార్చుకొని, టాటాలు చెప్పుకున్నాం.
ఆ అబ్బాయి మెల్లి మెల్లిగా నా కనుచూపు నుండి మాయమవుతున్నాడు, దూరంగా దూరదూరంగా వెళిపోతన్నాడు.
నేను వెంబడించాను. రైల్వే స్టేషన్ వైపుకి వెళుతున్నాడు.
"ఛ! జెన్యున్ అబ్బాయే! అనవసరంగా అనుమాన పడ్డాను."
అని నా మీద నాకే అసహ్యం వేసింది.
సర్లె ఆ రెండొందలూ ఇద్దామని వెళ్ళాను. పిలుపుకందనంత దూరంలో ఉన్నాడు.
ఇంకాస్త దూరం వెళ్ళాక అతను రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించాడు.
నేను మరింత సమీపించాను. అతడి మాటలు వినపడేంతగా.
టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు.
కౌంటర్ లో నేను కొనిచ్చిన టికెట్ ఇచ్చి.
"క్యాన్సిల్ చెయ్యండి. ఎంత డబ్బు వస్తుంది?"
"190"
"ఇవ్వండి."
నా కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి. కాళ్ళ కింద నేల జారినంత పనయ్యింది... 

Friday, May 16, 2014

கோட்டைப்புரத்து வீடு (కోట్టైప్పురత్తు వీడు - కోటపురం మహల్)

ఇందిరా సౌందర్ రాజన్ నవలలు అంటే ఎప్పుడూ నాకు తెలీని ఒక ఆసక్తి. అతీత శక్తులు - నమ్మకాలు - చరిత్ర - సమాజం ఇతివృత్తాలుగా రాసే ఈయన నవలలు బహుశా ప్రతి ఒక్కరూ తప్పక వదలకుండా చదివే శక్తి కలిగి ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో! రోమాలు నిక్కబొడుచుకునే విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ లు రాయటంలో ఈయనది చెప్పుకోదగ్గ పేరు.
ముఖ్యంగా ఈయన రచనల్లో అరవనాటి స్థానిక గ్రామదేవతల కథ-కథనాలు కనిపిస్తాయి. రాచరికపు వ్యవస్థలు, రాజ్యాలు, రాజకుటుంబాల గురించి ప్రత్యేకంగా రాస్తారని చెప్పనక్కరలేదు. రహస్యం వరుసలో వచ్చిన రహస్యం-మర్మదేశం మొదలగు అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియళ్ళకు ముడి సరకు ఈయన రచనలే!
ఈ నవల విషయానికొస్తే, ఇది ఆనంద వికటన్ పత్రికలో 31 వారాల పాటూ సీరియల్ గా ప్రచురించబడింది. ఒక్కో వారం కొత్త ఉత్కంఠతో, కొత్త మలుపుతో మరింత ఆసక్తి కలిగిస్తూ, వచ్చే వారపు భాగాన్ని చదివేందుకు మరింత ఆసక్తిని కలిగించేలా రాసారు.
కోట్టైపురం రాజరికవంశం వారిపై వంజియమ్మ శాపం నడుమ జరిగే అర్చన - విసు ప్రేమాయణమే ఈ నవల. 
వంజియమ్మన్ కు జరిగిన దారుణాతి దారుణమయిన అన్యాయం, ఆమె భర్త హత్య, ఆమె బలాత్కారం ఆత్మహత్య, ఆ అనుసరణలో కోట్టైపురం రాజవంశంలో పుట్టిన అమ్మాయిలు పుట్టిన వెంటనే చనిపోవటం, అబ్బాయిలు వారి ముప్ఫయ్యవ యేట చనిపోవడం అనే శాపంతో కథ మొదలవుతుంది. తన అన్న గజేంద్రన్ చావు అంచులో‌(ముప్ఫ్య్యవ యేట అడుగిడుతూ)ఉండగా బెంగుళూరు నుండి విసు ఎయిర్పోర్ట్ లో దిగడం, అర్చన అతన్ని అక్కడికి కలవడానికి రావడం, రాజ మర్యాదలంటే ఆసక్తి లేని విసు కు సంస్థానంలోని ఉద్యోగుల వినమ్రతకూ మధ్య జరిగే సంఘర్షణ ముందుగా కనిపిస్తుంది.
ఆపై విసు అన్న చనిపోవడం, అందుకు కారణం అందరూ శాపమని నమ్ముతున్నా ఒక్క అర్చన ఈ విషయాన్ని మానవకల్పితమనీ, ఒక కుట్ర జరుగుతుందనీ పసిగట్టడం, ఆపై మహల్లో మరిన్ని మరణాలు, విసుపై హత్యా ప్రయత్నాల నడుమ నవల ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. కొన్ని సందర్భాలలో పాత్రలు హేతువాదాన్ని వీడి శాపాలలో అతీత శక్తులలో నమ్మకం పెంచుకుంటారు కూడా. మళ్ళీ తిరిగి లౌక్యంగా ఆలోచిస్తారు.
అర్చన చాకచక్యంగా ఏ విధంగా విసు ను ఈ కుట్ర నుండి లేదా దేవత శాపం నుండి కాపాడుతుందో అన్నది మిగితా నవలలో ఆసక్తికర భాగం!
320 పేజీలు వదలకుండా చదివిస్తాయి!

Thursday, May 1, 2014

వీరవల్లడు

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారి రచనలకు సంబంధించి పాఠకులలో ఎన్నో అపోహలు. ఆ అపోహల వల్ల అసలు ఆయన సాహిత్యాన్ని చదివే అదృష్టాన్ని కోల్పోవడం పరిపాటి.
కవి సామ్రాట్ రచనల గురించి జనబాహుళ్యంలో ఉన్న కొన్ని అంశాలు:

  1. ఈయన రచనలన్నీ అర్ధం కాని భాషలో ఉంటాయి.
  2. చదవటానికి సాధ్యం కానంత పెద్ద పరిమాణంలో ఉంటాయి. (కనీసం వెయ్యి పేజీలుంటాయి)
  3. ఒక కులాన్ని సాహిత్యం ద్వారా గ్లోరిఫై చేయడం. నిమ్న కులాల ఊసు ఆ సాహిత్యంలో ఉండదు.
ఇలాంటివి ఇంకెన్నో...
అయితే
ఈ వీరవల్లడు నవల పైన చెప్పుకున్న అంశాలను పటాపంచలు చేసే పుస్తకం.
వ్యావహారిక భాషలో రాయబడి, చదవటానికెలాంటి ఇబ్బందీ ఉండదు (విశ్వనాథ వారి సాహిత్య భాష గురించి కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై గారి వద్ద సరికొత్త వాదన విన్నాను - ఆ చర్చ వేరే టపాలో).
62 పేజీలు (అదీ చిన్న పేజీలు- ఇప్పుడున్న పుస్తకంలో 40 పేజీలే) గల పుస్తకం. ఒక నిమ్న కుల వ్యక్తిని గ్లోరిఫై చేస్తూ రాయబడిన పుస్తకం.

కథలోకి వెళితే ఒక విద్యార్థి పేరును వాళ్ళ మాస్టారు హేళన చేయడం "వల్లడా, వల్లకాడా" అనడంతో ఆ విద్యార్థికి రోషం వచ్చి ఇంటికొచ్చి పేరు మార్చుకోవాలనుందని పట్టుబట్టడం- ఆ పేరు ఒక పాలేరు పేరని తెలిసి మరింతా మారం చేయడం జరుగుతుంది. ఆ పేరు, ఆ పేరుగల వ్యక్తి వీరవల్లడి కథను ఆ పిల్లోడికి తండ్రి చెబుతాడు.
బ్రాహ్మణ కుల పెద్దల దొంగ న్యాయాలకు తన యజమాని మరణానంతరం యజమాని కుటుంబం వీధిపాలవటం సహించలేక, ఊరంతటినీ ఒక్క తాటి మీదకి తెచ్చి సరియయిన న్యాయం ఇప్పించడం ఆ కథ. ఆనాటి కుల కట్టుబాట్లూ, గ్రామ్య జీవనం, భూమి వ్యవహారాలు రచయిత కథ ద్వారా చక్కగా చెప్పగలిగాడు.
కృష్ణమ్మను ఎంతో మనోహరంగా చిత్రీకరించి కళ్ళముందుంచడం నాకు చాలా నచ్చింది.

ఇక ఆలస్యం దేనికీ వెంటనే మీరూ ఈ పుస్తకాన్ని చదివేయండి.