Tuesday, December 11, 2012

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్త్వం విడుదల చేసిన సరికొత్త తెలుగు ఖతులు

౨వ అంతర్జాతీయ తెలుగు
అంతర్జాల సదస్సులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు విడుదల చేసిన ఖతులు :

ఈ ఖతులను తెలుగు విజయం జాలగూడు నుండి దింపుకోవచ్చు. 


Thursday, October 11, 2012

లలితమ్మకు నీరాజనం


శీతాద్రి శిఖరాన పగడాలు తాపించు।
మా తల్లి లత్తుకకు నీరాజనం
కెంపైన నీరాజనం - భక్తి పెంపైన నీరాజనం ॥

యోగీంద్ర హృదయాల మ్రోగేటి మాతల్లి।
బాగైన అందెలకు నీరాజనం
బంగారు నీరాజనం - భక్తి పొంగారు నీరాజనం ॥

నెలతాల్పు డెందాన  వలపు వీణలు మీటు
మాతల్లి    గాజులకు నీరాజనం 
రాగాల   నీరాజనం - భక్తి తాళాల   నీరాజనం ॥

మనుజాళి హృదయాల తిమిరాలు సమయించు
మాతల్లి నవ్వులకు  నీరాజనం 
ముత్యాల  నీరాజనం - భక్తి  నృత్యాల నీరాజనం ॥

చెక్కిళ్ళ కాంతితో క్రిక్కిరిసి  అలరారు
మా తల్లి ముంగెరకు నీరాజనం 
రతనాల నీరాజనం - భక్తి జతనాల నీరాజనం ॥

పసి బిడ్డలను చేసి  -  ప్రజనెల్ల పాలించు
మాతల్లి చూపులకు నీరాజనం 
అనురాగ నీరాజనం - భక్తి కనరాగ నీరాజనం  ॥ 

దహరాన కనిపించు ఇనబింబ మనిపించు
మాతల్లి కుంకుమకు భక్తి నీరాజనం 
నిండిన నీరాజనం  భక్తి మెండైన నీరాజనం॥

తేటి పిల్లలు వోలె గాలి కల్లలలాడు
మాతల్లి కుఱులకూ నీరాజనం 
నీలాల నీరాజనం - భక్తి భావాల నీరాజనం ॥

జగదేక మోహిని  సర్వేశ గేహిని
మా తల్లి రూపునకు నీరాజనం
నిలువెత్తు   నీరాజనం - భక్తి నిలువెత్తు   నీరాజనం  ॥

Friday, September 14, 2012

నీకేమయినా అభ్యంతరమా శివశక్తీ?

మంచి వీణను తయారు చేసావు - దానిని చెత్తకుప్పలోకి పడేస్తావా?
చెప్పు, శివశక్తీ!!! ఎందుకని నన్ను ఈ జ్ఞానంతో పుట్టించావు?

నాకు శక్తినిస్తావా - ఈ ప్రపంచానికి ఉపయోగపడేలా జనం బ్రతకేలా నేను చెయ్యాలి!
చెప్పు, శివశక్తీ!!! వారు ఈ భూమికి భారమై బ్రతకాలా?

నేను చెప్పినట్టూ ఆడే బంతిలా, నా శరీరం నా బుద్ధి చెప్పినట్టూ ఎక్కడికయినా వెళ్ళిపోవాలి
కల్మషంలేని బుద్ధినివ్వు శివశక్తీ, జీవితానికే జీవితాన్నిచ్చే జీవితాన్ని ప్రసాదించు శివశక్తీ!!!

ఈ శరీరం కాలి బూడిదయ్యాక కూడా నీ పాటలే నేను పాడాలి, అలాంటి నన్ను నాకివ్వు శివశక్తీ
అచంచలమయిన ఆత్మవిశ్వాసాన్నే కదా నేనడిగింది, నాకివన్నీ ఇవ్వటానికి నీకేమయినా అభ్యంతరమా శివశక్తీ?

మనస్సు నిలకడగా ఉండాలి

మనస్సు నిలకడగా ఉండాలి
మాట తీయగా ఉండాలి
మంచి ఆలోచనలు ఉండు గాక
అనుకున్నవి జరగుగాక
సులువుగా ఆశయాలు నెరవేరు గాక
ధనమూ, ప్రేమా కావాలి
ధరణిలో మంచి పేరు సంపాదించాలి

కన్నులు తెరిచి ఉండుగాక
పనిలో శ్రద్ధ ఉండుగాక
స్త్రీలు స్వతంత్రంగా ఉండు గాక
పరాత్పరుడు అందరినీ రక్షించుగాక
భూమి సస్యశ్యామలియయి ఉండుగాక
స్వర్గాలు చేరువలో ఉండుగాక
సత్యమే నిలుచుగాక
ఓం ఓం ఓం

మూలం : సుబ్రహ్మణ్య భారతి రచన

மனத்தில் உறுதி வேண்டும்

மனதி லிறுதி வேண்டும் 

வாக்கினி லேயினிமை வேண்டும்
நினைவு நல்லது வேண்டும் 

நெருங்கின பொருள் கைப்பட வேண்டும்
கனவு மெய்ப்பட வேண்டும், 

கைவசமாவது விரைவில் வேண்டும்,
தனமும் இன்பமும் வேண்டும், 

தரணியிலே பெருமை வேண்டும்,
கண் திறந்திட வேண்டும், 

காரியத்தி லுறுதி வேண்டும்,
பெண் விடுதலை வேண்டும், 

பெரிய கடவுள் காக்க வேண்டும்
மண் பயனுற வேண்டும், 

வானகமிங்கு தென்பட வேண்டும்,
உண்மை நின்றிட வேண்டும், 

ஓம் ஓம் ஓம்.

Thursday, September 13, 2012

అమ్మాయీ!

అమ్మాయీ,
నీ కనులు చంద్రుళ్ళోని కళనూ, సూర్యుని తేజాన్ని కలిగి ఉన్నాయి!

నల్లని గుండ్రనికనులు - రేయాకాశపు నల్లనితనాన్ని లాక్కున్నవా?
మెరిసే వజ్రాలు పొదిగిన సరికొత్త నల్లపట్టుచీర కట్టావు - నడిరేయి ఆకాశాన గల తారల్లా.
అప్పుడే పూచిన పూల సుమగంధపు నవ్వు నీది
నీలసంద్రపు అలలు నీ హృదయ ప్రేమ తరంగాలు
నీ గళం - తీయని కోకిల గళం
అమ్మాయీ
నేను నీ ప్రేమలో పడ్డాను
ఏవో కట్టుబాట్లూ, నియమాలూ అంటున్నావు
అమ్మాయీ
అవి ఎందు కోసం?
కోపావేశాల్లో మరిగిపోయే వారికే కదా ఆ కట్టుబాట్లూ, ఓ అమ్మాయీ!
పెద్దల అంగీకారంతో పెళ్ళీ క్రతువులు ఆనకి చేసుకొనవచ్చు
నేను వేచి ఉన్నాను, చూడూ
ఓ ముద్దుకై.
ఓ అమ్మాయి!

Saturday, September 8, 2012

విండోస్ ఎక్స్పీ లో ఇన్‍స్క్రిప్టు స్థాపించడం

విండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి ఈ క్రింది సోపానాలను పాటించండి.

సోపానం 1 :
Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చెయ్యండి


సోపానం 2:
ఇప్పుడు Control Panel నుండి Regional and Language Options క్లిక్ చెయ్యండి.


సోపానం 3:
ఇప్పుడు Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లి Install files for complex script and right-to-left languages ని ఎంచుకుని Ok నొక్కండి. ఇప్పుడు మీ మిషను reboot చేసి, మరలా మొదటి రెండు సోపానములను పాటించి, Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లండి. ఇక్కడ Text Services and input languages లోని details నొక్కండి.


సోపానం 4:క్రింది బొమ్మలో చూపిన విధంగా Text Services and input languages Dialog లోని Settings టాబ్ లో Installed Services విభాగంలోని Add బటన్ నొక్కండి.


సోపానం 5:
Add Input Language Dialog నుండి Telugu ఎంచుకొని Ok నొక్కండి.


సోపానం 6:
ఇప్పుడు Text Services and input languages Dialog లోని Settings టాబ్ లో Preferences విభాగంలోని Language Bar ని నొక్కండి.


సోపానం 7:Language Bar Settings లో Show the Language bar on the desktop ని ఎంచుకోండి.


సోపానం 8:
ఇప్పుడు మీ డెస్కుటాపు మీద ఈ క్రింద చూపినట్లుగా Language Bar కనిపిస్తుంది. దీనిలో తర్వాతి బొమ్మలో చూపిన విధంగా Teluguను ఎంచుకుని మీకు కావలసిన చోట తెలుగులో టైపు చేసుకోండి. కీబోర్డు లేయవుట్ చివరి బొమ్మలో చూపబడినది.



కీబోర్డు లేయవుట్

Friday, September 7, 2012

యేది యేది కుదురేది యేది యెదలో పాట సాహిత్యం

యేది యేది కుదురేది యేది యెదలో
యేది యేది అదుపేది యేది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో అనలేక 
పెదవే పేరై నీదై ఉంటే

యేది యేది కుదురేది యేది యెదలో ఓఓఓ
యేది యేది అదుపేది యేది మదిలో ఓఓఓ ఓఓఓ

నే ఓడే ఆట నీ వాటం అంటా
ఎంతో ఇష్టంగా
నే పాడే పాట నీ పేరేనంటా
చాలా కాలంగా
నాకంటూ ఉందా ఓ ఆశా
నీ ఆశే నాకూ శ్వాస
ఊహా ఊసూ నీతో నేనుంటే శా
నీ అందం ముందుంటే ఆనందం రమ్మంటే
కలలే కళ్ళై చూస్తూ ఉంటే

యేది యేది కుదురేది యేది యెదలో ఓఓ
యేది యేది అదుపేది యేది మదిలో ఓఓ

నా కాలం నీదే, నువ్వై గడిపేసెయ్ ఎన్నాళ్ళవుతున్నా
ఓహో నీ పాఠం నేనే, నన్నే చదివేసెయ్ అర్ధం కాకుండా 
నాలోకం నిండా నీ నవ్వే, నాలోనూ నిండా నువ్వే
తీరం దారీ దూరం నువ్వయ్యావే
నా మొత్తం నీదయితే, నువ్వంతా నేనయితే
మనలో, నువ్వు-నేను ఉంటే

యేది యేది కుదురేది యేది యెదలో
యేది యేది అదుపేది యేది మదిలో
లోతుల్లో జరిగేది మాటల్లో కనలేక 
పెదవే పేరై నీదై ఉంటే

యేది యేది కుదురేది యేది యెదలో
యేది యేది అదుపేది యేది మదిలో

Thursday, August 16, 2012

మధుసూదన మధుసూదన హర మామక దురితం


శరణం భవ కరుణాం మయి
కురుదీనదయాళో
కరుణారస వరుణాలయ
కరిరాజ కృపాళో

అధునాఖలు విధినా మయి
సుధియాసుర భరితం
మధుసూదన మధుసూదన హర
మామక దురితం

వరనూపుర ధరసుందర  కరశోభితవలయా
సురభూసుర భయవారక
ధరణీధర  కృపయా
త్వరయా హర భయమీశ్వర
సురవర్య మదీయం
మధుసూదన మధుసూదన
హర మామక దురితం

ఘృణిమండల మణికుండల
ఫణిమండల  శయన
అణిమాది సుగుణ భూషణ
మణిమంటప సదన
వినతాసుత ఘనవాహన
మునిమానసభవనా
మధుసూదన మధుసూదన
హర మామక దురితం

అరిభీకర  హలిసోదర
పరిపూర్ణ సుఖాబ్దే
నరకాంతక నరపాలక
పరిపాలిత జలధే
హరిసేవక శివ నారా
యణ తీర్థ పరాత్మన్

మధుసూదన మధుసూదన
హర మామక దురితం






మకరచెఱలో  చిక్కుకుని విలవిలలాడుతున్న కరిరాజుని కాపాడిన ఓ అత్యంత దయామయుడవయిన దేవదేవా, కరుణామయా, నాపై నీ కరుణను కురిపించు.
మధు అను రాక్షసుడిని మర్దించిన ఓ దేవా, ఇవాళ నా పాపాలన్నీ మన్నించి హరించివేయి.
కాళ్ళకు మనోహరమయిన గజ్జెలు కట్టి చేతులకు అందమయిన కంకణాలు కట్టుకుని , సమస్త దేవత్లూ మరియు ఋషిజనాల కష్టాలు తీర్చు స్వామీ, మధు అను రాక్షసుడిని మర్దించిన ఓ దేవా, ఇవాళ నా పాపాలన్నీ మన్నించి హరించివేయి.
మణులు ఖచితమయిన చెవిపోగులు ధరించి, ఫణి రాజు పై శయనించిన ఓ స్వామీ , నీవు సమస్త సుగుణాలూ కల వాడవు, ఆ గరుత్మంతుడ్ని వాహనం గా చేసుకుని ఉన్నవాడవు. మధు అను రాక్షసుడిని మర్దించిన ఓ దేవా, ఇవాళ నా పాపాలన్నీ మన్నించి హరించివేయి.
నీ శత్రువులకు నీవు అరివీర భయంకరుడవు, సుఖ సంతోషాల సముద్రం నీవు, నరకుడిని సంహరించి, అందరినీ కాపాడావు, నారాయణ తీర్థుల సేవలు గొన్న దేవా, మధు అను రాక్షసుడిని మర్దించిన ఓ దేవా, ఇవాళ నా పాపాలన్నీ మన్నించి హరించివేయి.

Friday, July 13, 2012

తాగుడు నిర్ణయాలు

ప్రస్తుతం మనం మన సంస్కృతినిప్రజాభిప్రాయం ద్వారా కాకుండా, కేవలం కొన్ని వ్యాపారపరమయిన సంస్థలకణుగుణంగా తయారు చేసుకుంటున్నాము. ఒకప్పుడు పొగతాగకపోతే వాడు మగాడే కాదు. ఈనాడలా లేదు. నేడు తాగకపోతే మగాడు కాదు అన్నట్టుగా సమాజం తయారయింది. మీరు జీవితంలో విజయాన్ని సాధించినవారయితే తప్పనిసరిగా తాగాలి. ఈ విధంగా మనం మన నాశనానికి దారితీసే సంస్కృతిని అలవరుచుకుంతున్నాం. ఇది పూర్తిగా వ్యాపార సంస్థల ద్వారా పోషించబడుతున్న సంస్కృతి. ఇది ఏ హద్దు వరకూ వెళ్ళిందంటే, వ్యాపార సంస్థలు మనుషుల చేత మన్ను తినిపించాలన్నా, వ్యాపార ప్రకటనల ద్వారా ఏ సినిమా నటుడితోనో మన్ను తినిపించి మనచేత కూడా మన్ను తినిపించగలరు; వారీ విషయంలో మంచీచెడు పట్టించుకోరు.
తాగడం తాగకపోవడం అనేది పూర్తిగా ఒక మనిషి ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. చావుబతుకుల మధ్య తేడా ఒకటే, చావులో మీరు చేతనులై ఉండరు, బతుకులో మీరు చేతనమయి ఉండొచ్చు. నిద్రలో మీరు అచేతనులు; నీరసావస్థలో చేతనులుగా ఉండే శక్తి ఉండొచ్చు. బతుకనేది మీరు చేతన ఇంకా మెలకువలో ఉంటేనే సాధ్యం. తాగుడు మత్తునిస్తుంది, అది మిమ్మల్ని చేతనావస్థ నుండి దూరంగా లాక్కుపోతుంది. మీరు మనశ్శాంతికై ఏ ప్రయత్నమూ చేయకుండా అనిర్మలమయిన మనస్సుతో ఉండటం వలన సాయంత్రమో, ఆఫీసు పార్టీలోనో తాగే మందు పెద్ద మనశ్శాంతిని ప్రసాదించే మార్గంలా అనిపిస్తుంది.
మనస్సు ఒత్తిడిలో ఉన్నా, ఉగ్రముగా ఉన్నా, పొందనిదాని కోసం పరితపిస్తున్నా, తాగుడులోని మత్తు పెద్ద ఉపశమనంలా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని మనం మన శరీరానికి తెలిపితే, అదే బతుకు నుండి దూరంగా చేసేవన్నీ ఉపశమనానికి మార్గాలని గుర్తిస్తుంది. ఇక అక్కడితో మృత్యువాతపడటం చాలా సులభం.
--సద్గురు జగ్గీ వాసుదేవ్ 

Friday, May 11, 2012

కలత నిదర - నండూరి సుబ్బారావు గారి కవిత


ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా!
యెన్నెలల సొగసంత యేటిపాలేనటర?

ఆ కాశ మేమూలొ
అణగి పోయిన రేయి
యేటి శెందురుడల్లె
సాటు సూపుల కులికి ॥ఈ రేయి॥
ఆకాశ మావొరస
అడిలి పోయిన రేయి
మాట లెరుగని పాప
యేటి గిలగిల సూపి ॥ఈ రేయి॥
ఆకాశ మోతీరు
ఆవు లించిన రేయి
మిసమిసలతో యేటి
పసలతో నను సుట్టి ॥ఈ రేయి॥
యెలుతు రంతా మేసి
యేరు నెమరేసింది ---
కలవరపు నాబతుకు
కలతనిద రయ్యింది ॥ఈ రేయి॥
ఒక్క_ తెను నాకేల
ఓపజాలని సుకము?
యీరేయినన్నొల్లనేరవారాజా!
--నండూరి సుబ్బారావు


ఈ పద్ధతిని ఏమంటారు?

వేఁగి క్షేత్రము - విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత


ఏ రాజు పంచెనో యిచట శౌర్యపు పాయసమ్ములు నాగులచవితినాళ్ళ
ఏ యెఱ్ఱసంజలో నెలమి పల్లవరాజరమణులు కాళ్ళఁబారాణులిడిరొ,
చిత్రరధస్వామి శ్రీరథోత్సవములోఁ దెలుగు పిల్లలు కత్తి త్రిప్పిరెపుడొ,
ఏ రెండు జాముల యినునివేడిమి వచ్చి కలసి పోయెనొత్రిలింగ ప్రభువుల,
నాజగచ్ఛ్రేయసంబులై యలరుతొంటి
వేంగిరాజుల పాద పవిత్రచిహ్న
గర్భిత మ్మైనయీ భూమిఖండమందు
నశ్రువులు జార్త్రు జీవచ్ఛవాంధ్రజనులు.
ఇట వేఁగీశుల పాదచిహ్నములు లెవే! లేవుపో! భావనా
స్ఫుట మూర్తిత్వమునైనఁ బొందవు నెదో పూర్వాహ్ణదుష్కాలపుం
ఘటికల్ గర్భమునం దిముడ్చుకొనియెం గాబోలు నీపల్లెచో
టట లోకాద్భుతదివ్యదర్శనమటే యాభోగ మేలాటిదో.
నీయతుల ప్రభావ మహనీయత వేఁగిపురాధిరాజమా!
ఆయతధర్మమూర్తులు మహాత్ములు వారలు బ్రహ్మకోశగో
పాయిత లాంధ్రపల్లవనృపాలురహుంకృతి వ్యాఘ్రగర్జగా
నై యరిలోకభీకర మహాద్భుత శౌర్యరసాకృతిం జనెన్.
ఈ నాపదార్పితక్షోణి నేరాజు ధర్మాసనంబుండి స్మృత్యర్థం పొందెనొ
ఈనాదృగావృతంబైన భూములలోన నేశౌర్యధనులు శిక్షింపఁబడిరొ
ఈ నాశరీరమం దివతళించిన గాలి యెంత పౌరాతన్య మేచుకొనెనొ
ఈ నాతనూపూర్ణ మైన యాకాశమ్ము నే క్రతుధ్వనులు శబ్దించినదియొ
అస్మదజ్ఞాతపూర్వదివ్యత్వ మొప్పు
నీవునీతావనీఖండ మిచట నిలచి
యస్వతంత్ర దొరలు నాయాంధ్రశక్తి
నన్నుఁగంపింపఁ జేయుచున్నది భృశమ్ము.
వేఁగి రాజ్యపు పల్లెవీధుల చెడుగుళ్ళ రిపులఁ గవ్వించు నేరువులు తెలిసి
ఎగురుగోడీబిళ్ళసొగసులో రిపుశిరస్సుల బంతులాడు శిక్షలకు డాసి
చెఱ్ఱాడి యుప్పుతెచ్చిననాడె శాత్రవ వ్యూహముల్ పగిలించు నొఱపుగఱచి,
కోతికొమ్మచ్చిలో కోటగోడల కెగఁబ్రాకి లంఘించు చంక్రమణ మెఱిఁగి
తెనుఁగులంతప్డెయవి నేర్చుకొనియు యుందు
రెన్నగాఁ దెల్గుతల్లులు మున్ను శౌర్య
రస మొడిచి యుగ్గుఁ బాలతో రంగరించి
బొడ్డుకోయని కూనకే పోయుదు రట.
శిలవోలెన్ కదలంగ లేక హృదయస్నిగ్ధార్ద్రసద్భావనా
ఖిల చైతన్యుడనై పురావిదిత వేంగీపూజ్య సామ్రాజ్యగా
ధల యోజించుచు నాంధ్రపల్లవనరేంద్ర శ్రీయశస్త్సంభమున్
బలె నిల్చుంటిన యీ పవిత్ర ధరణీ భాగంబునం దీగతిన్-
ఏ దివ్యపూరుషు లీశాద్వలాంకూరశేఖరమ్ముల లిఖించిరొ! యివెల్ల
ఈ వాయువీచిలో నేయప్సరస్సమాజము నింపిరో గీతిసముదయంబు
ఏ దివ్యశిల్పు లీరోదసీకుహరాన వ్రాసిరో దివ్యశిల్పమ్ము లిన్ని
ఈ పధాంతరమునం దేవురాణమునీంద్రసంతతులో ప్రశంసలు పొనర్త్రు
ఎటఁ గనినఁ బూర్వపల్లవ నృపచరితలె
వ్రాయఁ బడి పాడఁబడి గీయఁబడి యువిన్య
సింపఁబడి శ్రోత్ర పేయమై చెన్నుదాల్చె
నీయతీంద్రియశక్తి నాకెట్టు లబ్బె!
ఈ పొలా లెంతచేవెక్కించుకొన్నవో. గుండె వ్రయ్య సముద్రగుప్తు డడలె
ఈ నేల పావిత్ర్యమెంత కుంభించెనో చిత్రరధ స్వామి సేవలుకొనె
ఇట పల్లవులరాచయెలనాగ లేవ్రతమ్ములు చేసిరో లచ్చి నిలుకడ వడె
ఈ కాశ్యపీఖండ మేశరజ్యోత్స్నలో పిలకించెనో కీర్తి తెలుపులూరె
ఇట నెచట త్రవ్వినను బంగరేనట యది
యెంతశ్రీయొ! యదెంత రాజ్యేందిరయొ ప
దానతనఖాగ్రపాతనిర్యన్నిధాన
మైన యీచోటనుపభోగ్య మయ్యె నేడు.
ఈ పొదలం జరించుచు నహీనమహామహిమానుభావమౌ
నేపురవీధులందొ చరియించుచు నంటి నటంచుఁ భారతం
త్ర్యాపతితుండ నయ్యును పురా మహదాంధ్రమునన్ స్వతంత్రుడౌ
నేపురుషుందనో మనుచు నీ భ్రమ సత్యముగాఁ దలంచుదున్
ఏ పల్లవనృపాలు డెత్తినబావుటా చాళుక్యనృపులరాజ్యంబునందు
ఏ దేశికవిత పాలించినకవిరాజు నన్నయ్య వ్యాకరణంబునందు
ఏయులిఁజెక్కునేర్పులు మహాశిల్పి గోదావరీనదీఘోషయందు
ఏతొంటి తెలుగుల యెక్కువాచారమ్ము బలవ న్నృపుల ప్రాభవమ్మునందు
సమసిపోయెనో -- యున్మత్తసామజంబు
కొలను జొరబడి తమ్మితూడులను పెరికి
వైచెటె యెఱుంగుగాని తత్పద్మగర్భ
కేసరవిమిశ్రమధురసాగ్రియత గలదె?
ఇమ్ముగఁగాకుళమ్ము మొదలీవరకుం గల యాంధ్రపూర్వరా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతరమేలో చలించి పోవు నా
ర్ద్ర మ్మగు చిత్తవృత్తులఁ బురాభవనిర్ణయమేని నెన్నిజ
న్మములుగాగ నీతనువున్ బ్రవహించునొ యాంధ్రరక్తముల్.
ఇది వినిపింతు నదు మది నెంచెద మిత్రులకున్ గళన్ధగా
ద్గదికము లోచనాంతబహుధాస్రుతభాష్పనదమ్ము స్పందనా
స్పదహృదయమ్ము నాపనికిఁజాలక చేసెడు నన్ను నింతగా
నెద పదిలించుకొన్న దిదియెక్కడి పూర్వజన్మవాసనో!
                                                                                           --విశ్వనాథ సత్యనారాయణ

Monday, April 16, 2012

భాషాభిమానం మితిమీరిన వేళ కూడా తెలుగు అక్షరం అ-క్షరమే

ఈ మధ్య ఒక వింత పోకడ మొదలయింది. భాషాభిమానం పేరు చెప్పుకొని, లిపి సంస్కరణలు అంటూ ఎక్కడలేని చెత్తను తెచ్చి మన తెలుగు లిపికి అంటిస్తున్నారు. విజయ లిపి అయిన తెలుగు లిపి, పద్య సాంప్రదాయం ఆ పై వచ్చిన శతక సాంప్రదాయం తరువాత వచ్చిన ప్రబంధ సాంప్రదాయం మొదలు నేటి గద్య మరియు కవిత సాంప్రదాయం వరకూను రాసేప్పుడు అతి తక్కువ శ్రమ కలిగే విధంగా, అదే సమయంలో స్పష్టంగా, దోష రహితంగా అతి తక్కువ సమయంలో రాసే విధంగా తీర్చిదిద్ద బడింది. అయితే తెలుగు లిపికేనా ఈ ప్రత్యేకత? అవును ముమ్మాటికి ఇది సత్యం. మిగితా భాషా సాంప్రదాయాల్లో రాతప్రతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు, అక్కడ గురు-శిష్య పరంపరలో ఒక తరానికి ముందు తరం వొప్పజెప్పే విధానంలో జ్ఞానం పాకేది. ఒకానొకప్పుడు జ్ఞానాన్ని పుస్తకాలుగా భద్రపరచటం నేరంగా కూడా పరిగణించేవారు(చాణక్యుని నీతి శాస్త్రం నుండి). కానీ అది ఉత్తరాది భాషలకే పరిమితం అనుకుంటాను, అందుకే చాలా వరకూ తులసీదాస్, సూర్‍దాస్,కబీర్‍దాస్,రహీమ్‍దాస్ ఇత్యాదుల దోహాలు జనాల నోట విని సంకలనం చేసినవ్ కానీ రాతప్రతులుగా వారు చెప్పిన కాలంలో చేయబడలేదు. వివరాలకు : www.esamskriti.com/essays/docfile/14_395.doc 
ఇందుకు కొన్ని కారణాలు : ౧. ప్రామాణిక లిపి లోపం, ౨. మాటకు రాత ఉండవలసిన అవసరం లేదన్న భావన, ౩. ఒకవేళ రాతలో ఉన్నా, పరదేశిల దండయాత్రలలో ఆయా రాతప్రతులు నాశనం అవడం. లేదా ౪. నోటి ద్వారా జ్ఞాన ప్రసారానికి పెద్ద పీట వెయ్యడం. 
అయి ఉండవచ్చు.
మొదటి కారణం - కొన్ని విధాలుగా సమంజసమే, అవధీ, భోజ్పురీ మున్నగు మాటలకు సరియయిన లిపి లోపం నేటికీ ఉంది.
రెండవ కారణం కూడా నిజం అవ్వవచ్చు - సమాజంలో ఒక వర్గమే చదువు నేర్చి, మిగితా వర్గాలు చదువుకు దూరంగా ఉండేవి, చదువుకునే వారి లోపం వల్ల రాతకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదేమో?
మూడవ కారణం - ఉత్తరాదిన జరిగిన అన్ని దాడులలోనూ ప్రతి సారీ ధనసంపద కొల్లగొటారే గానీ పద సంపదను నాశనం చేసింది తక్కువే అనవచ్చు, పైగా చాలా వరకు రాతప్రతులను పర్షియన్ కు తర్జుమా చేసారు కూడా.(పై లంకెలో ఇచ్చిన డాక్ ఆధారంగా)
ఇక నాలుగవ కారణమే ఎక్కువగా ప్రాచుర్యంలో ఉంది. 
గంగా నదికి ఇచ్చే హారతిలో పాడే పాటతో సహా ఉత్తరాదిన అన్నీ నోటి ద్వారానే నేర్పబడతాయి. పుస్తక రూపేణా ఏమీ అందుబాటులో ఉండదు.
అయితే ఇక్కడ నా అభిప్రాయం ప్రకారం ఉత్తరాదిన రాతలిపికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేదు. లిపి సంస్కరణలు చాలా తక్కువ. శిలాఫలకాలే అందుకు సాక్ష్యం.
ఇక దక్షిణాదిన హెచ్చు సాహిత్యం రాతప్రతుల ద్వారానే తరాలు దాటేదీ, దేశాలూ దాటేది. లిపి సంస్కరణలూ ఇక్కడ చాలా పెద్ద స్థాయిలో జరిగాయి. 
హిందుస్తానీ సంగీతం(ఉత్తర భారత సాంప్రదాయం)లో స్వరాలను నేటికీ రాసి నేర్చుకున్ ప్రక్రియ కనబడదు. 
అదే కర్ణాటక సాంప్రదాయంలో అది కనిపిసుంది.
శిలా శాసనాలు పరిశీలించినా, తాళపత్ర గ్రంథాలు పరిశీలించినా తెలిసేది ఒకటే, మన వద్ద మాటక్కూ రాతకూ ఒకే ప్రాతిపదికన సమాన ప్రాధాన్యత ఇచ్చారు. ఇంకా చెప్పాలంటే ఒకింత ఎక్కువ రాతకే పెద్దపీట వేసారు. రాత కూడా కొన్ని తరాలకు అదే విధంగా అందాలి అన్న దూరదృష్టితో ఏర్పరిచారు. నేటికీ అన్నమయ్య మొదలు వాగ్గేయకారుల కృతులు ఆ నాడు ఎలా పాడారో అదే రీతి నేటికీ పాడగలుగుతున్నామంటే అది రాతకు మన వారు ఇచ్చిన ప్రాధాన్యతను తెలియబరుస్తుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన గమ్మత్తయిన విషయమేమంటే, ఇతర భాషల్లోలా కాకుండా తెలుగులో శబ్దానికి అత్యున్నత స్థానం ఉంది. 
శబ్దానికో అక్షరం మనకు కలదు. తిరుక్కార్తి అయిన వెంటనే జరిగే ప్రబంధ పఠనం అపుడు ழ అనే ఒక వింత అక్షరం తెలుగు అక్షరాల్లో దూరి వచ్చినపుడు కలిగే ఆశ్చర్యం, భయం,  దుఃఖం అతి కొద్ది మందికే తెలుస్తుంది. ఆ సందర్భం నేనూ చిన్నప్పుడు ఎదుర్కున్నాను. అయితే దానికీ తెలుగులో అక్షరం ఉందని ఈ మధ్యనే సురేశ్ కొలిచాల గారి వద్ద తెలుసుకుని మిక్కిలి సంతోషపడ్డాను కూడా. తెలుగులో ఆ ప్రకారంగా ఏ శబ్దమైనా అక్షరరూపేణా ఉంది అన్న నిర్ధారణకు వచ్చాను.

కురాన్ చదివేప్పుడు మూడు రకాల లు పలకాలి ఒక క సాధారణంగా వచ్చే శబ్దం(ک), మరొకటి నాభి నుండి గాలిని తెచ్చి పలకాలి(ك), మూడవది కంఠం నుండి వచ్చే గాలిని నాలుక మధ్య భాగం ద్వారా అడ్డుపెట్టి పలకాలి(ق). 
కానీ ఇవి మూడు తెలుగ్లో ఉన్నాయి. అయితే నేటి అక్షరమాల పరిమితికి వీటిని క కగా వాడుకోవచ్చు.
అలానే జల్లెడ అన్నపుడు డ మరియు జ కలిపిన శబ్దం వస్తుంది. జడ అన్నపుడు మామూలు జ, కఁజు అన్నపుడు ద మరియు జ కలిపిన శబ్దం వస్తుంది. వీటిని కూడా ౨ మరియు ౩ లు చేర్చి చూపవచ్చు. 
ఇది బ్రౌణ్యంలో చాలా చక్కగా చెప్పబడి ఉంది.
అలానే స్త్రీ అన్న పదం రాయటానికి చాలా సులభం. అదే స్త్రీని దేవనాగరి లో రాస్తే स्त्री అవుతుంది, అదే అరవంలో ஸ்த்ரீ అవుతుంది. అంటే తెలుగులో అది మీకు ఒకే అక్షరం అయితే నాగరిలో ఒకటీముప్పావు(దాదాపు రెండు), అరవంలో మూడు అక్షరాలు పట్టే స్థలాన్ని ఆక్రమిస్తుంది. ఇదే విధంగా ఇంకా ఎన్నో లెక్కలేనన్ని ఉదాహరణలు ఇవ్వవచ్చు. అయితే అదే సమయంలో ఘడియలో ఘ, ఝటలో ఝ చాలా క్లిష్టంగా అనిపించవచ్చు గానీ, వాటి వాడుకను అనుసరించి, వీటిలో సంస్కరణ అవసరం లేదని పెద్దలు వాటిని అలానే ఉంచేసారన్నది నా నమ్మకం. 
అయితే ఈ రాత విధానం, తెలుగులో రాత పద్ధతి కంప్యూటర్లొచ్చాక మారాల్సిన అవసరం ఉందా?
ఏం లేదు.
కారణం, ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. ఒక ఆంగ్ల ఆల్బం పాటకు లిరిక్స్ రాసేప్పుడు ఆంగ్లం వాడుతూ, రాసినపుడు, నంబ్ అనే లింకిన్ పార్క్ పాటకి నేను పాటను పది సార్లు రివైండ్ చేసి రాస్కున్నాను. పాట మరీ అంత వేగంగా ఉండదు. 
అదే సమయంలో తెలుగులో రాస్తూ ఆనతినీయరా అను పాటను నేను మూడవ సారి ప్రూఫ్ రీడ్ గా విన్నాను! 
అదనమాట మన లిపి గొప్పతనం.
ఎంతటి మాటనయినా/పాటనయినా ఎవరయినా ఆశువుగా చెబుతూంటే రాసేందుకు వీలుగా మన లిపి ఉన్నది. 
కేవలం మాటను రాతగా పెట్టేందుకు కాదు, మాటను సునాయాసంగా-శుద్ధంగా-శుభ్రంగా-తక్కువ స్థలము-తక్కువ శ్రమ వెచ్చిస్తూ రాసే విధంగా ఉంది మన భాష. 
ఇక్కడ వరకు చదివారా! హమ్మయ్యా, నా బాధ అర్ధం చేస్కున్నారని ఆశిస్తున్నాను. ఇదంతా రాసింది ఎందుకూ అంటే - మొన్నా మధ్య అచంగుడు ఒక లంకె పంచారు. అది చూసినపుడు నా కోపం గొంతు దాకా వచ్చి ఆగిపోయింది. ఆ వ్యాసానికి లంకె ఇక్కడ : http://www.namasthetelangaana.com/news/Article.asp?category=1&subcategory=5&contentid=58696 
కానీ పోన్లే ఏదో భాషపై అమితమయిన ప్రేమ అనుకుంటూ వదిలేసాను. అయినా ఏదో ఒక రోజు ఆ వ్యాసం, దానికి తోడుగా అతను రాసిన ఒక పుస్తకం ఉంది, అదీ పట్టుకుని అతని వద్ద అన్నిటికీ సంజాయిషీ తీస్కోవాలని ఎలాగు అనుకున్నాను. 
భాషను నేనొక వ్యక్తిగా, ఇంకా చెప్పాలంటే మాతృసదృశంగా చూస్తాను. కొన్ని అక్షరాలను తీసెయ్యటం అంటే ఆ అమ్మకు చేతులు, కాళ్ళు విరగ్గొట్టమనడమే. మాట్లాడే భాషలో లేని రాత భాషలో ఉన్న అక్షరాలు కేవలం కాల్పనికాలు. నేను మాట్లాడేదే ప్రామాణిక భాష అనీ, దానికి సరిపడా అక్షరాలుంటే రాతకు చాలు అనటం చాలా పెద్ద పొఱపాటు. 
అయితే స.వెం. రమేశ్ గారు ఈ నెల నడుస్తున్న చరిత్రలో ఒక వ్యాసం రాసారు. 
అక్కడ ఆయన చెప్పినదేమిటంటే, మన తెలుగు వ్రాలు(వ్రాత కు ఆయన వాడిన నామవాచకం - నాకయితే బాగా నచ్చింది, ఇకపై వాడదామనుకుంటున్నాను)లో అక్షరాలు చిన్న పిల్లలకు నేర్పించటానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని, వాటిని తత్‍క్షణమే మార్చాలనీ. 
ఆ వ్యాసంలో కొన్ని అంశాలు ఇక్కడ రాస్తూ, వాటికి నా ఆలోచనలు జోడిస్తున్నాను.
౧. ఆఅ, ఉఊ,ఋౠ,ఎఏఐ,ఒఓఔ, ఒకే వర్గంలో ఉంటూ చూడటానికి ఒకేలా ఉన్నాయి, మరి ఇఈ లు ఎందుకు వేరుగా ఉన్నాయి? - భాషలో ఉచ్చారణకి పెద్దపీట వెయ్యాలి. స్పష్టత పలుకులో ఉండాలి. రాత అనేది కేవలం పలుకులను దాచే ఒక అత్యంత న్యూనతమయిన విధానం. నేటి సాంకేతికతవలన పలుకులను మనం ఆడియోలో కూడా భద్రపరచవచ్చు, అలాంటప్పుడు సారూప్యతలు వెతకనక్కరలేదు. ఇఈ లు ఒకలా లేవని అవి నేర్చుకోను అనే వాడు a ని u ని ఒకేలా పలకటానికి ఎందుకు సిద్ధమవుతున్నాడు? నాకు తెలుగు ప్రాథమికంగా బడిలో నేర్పబడలేదు. కానీ ఇంటి వద్దనే నేర్చుకోవలసి వచ్చింది. కారణం వాడుక, బడి మినహా ఇంటా బయటా అంతా తెలుగే ఉండేలా మా అమ్మా-నాన్నలు జాగ్రత్త పడ్డారు. ఆ వాడుకని బట్టీ అవసరం ఏర్పడి తెలుగు వ్రాత, మాట నేర్చుకున్నాను. నాలా ఎంతో మంది ఉన్నారు. భాష నేర్చుకోవాలంటే అందులోని మీనమేషాలు ఎంచరాదు.
౨. అ పక్కన సున్నా పెడితే అమ్ అని చెబుతున్నారు కదా. అంమ అని రాస్తే తప్పు ఎలా అవుతుంది? 'బమ్‍గారు పమ్‍టలే పమ్‍డుతాయి' అని అన్నారు ‍- ఆ కొద్ది మందికీ తెలుగు వర్ణమాల అర్ధం కాలేదు. ప్రతి వర్గానికి పఞ్చమ అక్షరం ఉంది. ఆ వర్గం మొత్తం అనునాసికం వచ్చినపుడు ఆ పఞ్చమ అక్షరాన్ని పలుకుతాము. అందుకని ఆ పఞ్చమ అక్షరం ఉన్నది. 
ఎంత ప్రయత్నిఞ్చినా గంగ గఙ్గ అవుతుందే తప్ప గఞ్గ, లేదా గణ్గ, గన్గ,గమ్గ అవ్వదు. 
ఇది ఉచ్చారణ సక్రమఙ్గా చేసే ఎవరయినా సులువుగా చెప్పగలరు. 
బమ్‍గారు పమ్‍టలే పమ్‍డుతాయి అని ఏ తెలుగు వాడూ చచ్చినా పలకడు, బఙ్గారు పణ్టలే పణ్డుతాయి అన్నది అప్రమేయ ఉచ్చారణ. 
౩. ౠ తో మాటల్లేనపుడు దానిని ఎందుకు చేర్చుకోవాలి?- ఇక్కడ మరలా ఇదే విషయం వక్కాణిఞ్చి చెప్పాలి, భాషకి రాత ఉన్నది అన్ని శబ్దాలను రాత రూపంలో చూపేందుకు. నోటిలోండి గాలి నాభి గుండా వచ్చేప్పుడు పెదాలను వృత్తాకారం చేసి, నాలుక కొనతో ఆ గాలికి రాపిడి చేస్తే వచ్చే శబ్దమే ౠ. భాష రాతలో ఒక శబ్దం లేకున్నా అది వైకల్యం గల భాషే. పైన చెప్పబడిన ழ ప్రబంధాల్లో వచ్చినపుడు ఒక తెలుగు పిల్లవాడు ఒకింత బాధ పడేది తెలుగు రాతలో ఈ శబ్దం లేదనే. ఈ అక్షరానికి తెలుగులో పదాల్లేవని ఈ అక్షరాన్ని తీసిపారెయ్యలేము. 
౪,౫ కూడా పై వాటిని పోలి ఉన్నవే.
౬. య గుణింతములో యి యీ లకు గుడిని ఎందుకు తగిలించడంలేదు? - పైన చెప్పిన విధంగా తెలుగు లిపి అత్యల్ప సమయంలో అత్యధికంగా రాసేందుకు సంస్కరించబడిన లిపి. అందువలన రాయటానికి వీలుగా ఉండాలని ఎక్కువ సార్లు వాడే వాటిని ఇలా మార్చుకుని రాసారు. అంచేత వీటిని పెద్దవారిమాట చద్దన్నం మూటలా మనమూ పాటిస్తున్నాం. ఇది సులువైన విధానం కాబట్టే జనం మారలేదు. గుడి జోడించి రాయటమే సులువయితే, ఈ అక్షరాలు రాసేవారము కాదు.
౭. క కింద ష పెట్తినపుడు క్‍ష అవ్వలి కానీ క్ష ఎందుకు అవుతుంది? - ఇదే ప్రశ్నకు దగ్గరగా జంపాల చౌదరి గారు నన్నొకసారి అడిగారు, చౌదరి గారి ప్రకారం తెలుగులో క్ష ఉంది, అలానే క్‍ష కూడా ఉంది. ఆయితే కక్ష, రిక్షా లాంటి పదాల్లో క్ష ఉంటుందని ఫిక్‍షన్, డికాక్‍షన్ వంటి పదాల్లో క్+ష వస్తుందని వారు చెప్పారు. మొదటిది పలకటంలో క-ష కలిపి ఒకే స్వరంలో పలికేస్తాము, రెండవ రకంలో క పలకటానికి ష పలకటానికీ మధ్య కొంత అత్యల్ప సమయం వస్తుంది. అందువలన క కింద ష వత్తు పెడితే అది క్ష కాదు. క మరియు ష కలిపి ఒక శ్వాసలో పలికితేనే అది క్ష, కొద్దిపాటి తేడాతో రెండు శ్వాసలలో పలికితే అది క్‍ష. అదృష్టమో ద్దురదృష్టమో రెండవ జాతి పదాలు క్‍ష ఉన్నవి తెలుగులో లేవు.
మిగితా అంశాలపై చర్చ తదుపరి టపాలో...

అందాకా అందరూ చూసి విశ్లేషించుకునేందుకు స.వెం. రమేశ్ గారు ప్రతిపాదించిన అక్షరమాల :



Wednesday, February 22, 2012

భాషందం అజంతం

మన భాష అందమైన భాష. అజంతమైన భాష.
మరి ఈ అజంతమనగా ఏంటి?
అజంతం -- అచ్చు+అంతం.
అనగా అచ్చుతో అంతమయ్యేది.
తెలుగు నుడి ఇది -- ఏ పదమూ హల్లులతో ముగియదు!
అమ్మ - అ తో ముగుస్తుంది
ఆవు - ఉ తో ముగుస్తుంది
ఇల్లు - ఉ తో ముగుస్తుంది
ఈగ - అ తో ముగుస్తుంది
...

మానస్ - స తో ముగుస్తుంది - తెలుగు కాదు, సంస్కృతం
రమేశ్ - శ తో ముగుస్తుంది - తెలుగు కాదు, సంస్కృతం కూడా కాదు (సంస్కృతంలో నపుంసక లింగం)

...

మన భాష హల్లుతో ముగియదు, హలంతం కాదు. అజంతం, అమరం, అందం.

అదనమాట సంగతి

Monday, February 20, 2012

తెలుగదేలయన్న

ఈ టపా మొదలు కొన్ని గంభీరమయిన టపాలు ఇక్కడ ప్రచురితమవనున్నాయి.
అన్ని టపాల్లోనూ తెలుగు భాషపై నా ఆలోచనలు పంచుకోనున్నాను.

ఈ టపాలో :  తెలుగదేలయన్న
ఎన్నో సందర్భాల్లో ఈ పై పదాన్ని జనం వాడేస్తారు(అర్ధం తెలిసి వాడతారా లేక అజ్ఞానంగా ఏదో చెప్పేదానికి వెయిట్ ఇవ్వాలని వాడతారా? అనే ప్రాథమిక అనుమానం వచ్చినా అభివాదన శీలస్య గుర్తొచ్చి కంగా ఉండాలి :P).
నేను ఒకటి రెండు సందర్భాల్లో చాలా ఫూలిష్ కాంటెక్స్ట్ లలో వాదేసాను.
అయితే వీవెన్ గారు ఒక రోజు మాటల సందర్భంలో దేసభాశాలందు తెలుగు లెస్స అన్న పద్యం గురించి కారకా తెచ్చారు, అర్ధం చెప్పమన్నారు.చెప్పకపోతే నన్ను తక్కువ అంచానా వేస్స్తారని భయం. సెప్తే మన మందబుద్ధి బయట పడిద్దనే పీడ. మొత్తానికి అంతకు ముందొకసారి వికీపీడియాలో కృష్ణదేవరాయలు వ్యాసంలో చదివింది గుర్తొచ్చి నెమరవేసుకున్నా.
 “తెలుఁగదేలనన్న దేశంబు దెలుఁగేను
తెలుఁగు వల్లభుండఁ దెలుఁగొకండ
యెల్ల నృపులగొలువ నెరుఁగ వే బాసాడి
దేశభాషలందుఁ తెలుఁగు లెస్స”
                                        —శ్రీ ఆంధ్ర విష్ణు

ఇక సందర్భానికొద్దాం శ్రీకృష్ణదేవరాయలవారు తెలుగులోనే ఆముక్తమాల్యదను ఎందుకు రాయాలి అని శ్రీకృష్ణదేవరాయలకు సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువే ఆంధ్రమహావిష్ణువుగా పలికెనని సాహితీ సమరాంగణుడే చెప్పెను.

 తెలుఁగదేలయన్న - తెలుగు అది ఏలయు అనిన

అడనమాట సంగతి ....

Thursday, January 19, 2012

క్యూఆర్ కోడ్


క్యూఆర్ కోడ్ అనేది క్విక్ రెస్పాన్స్ కోడ్ కు సంక్షిప్త రూపం. ఇది ఒక 2-డైమెన్షనల్ మ్యాట్రిక్స్ బార్ కోడ్. మొట్టమొదట ఆటోముబైల్ ఇండస్ట్రీ కోసం కనుగొన్నారు. ఎక్కువ పదాలను ఒక చిన్న బొమ్మ రూపంలో పొందుపరచటం మరియు త్వరిత పఠనీయతవల్ల ఈ టెక్నిక్ బాగా ప్రాచుర్యం పొందింది. తెలుపు బ్యాగ్రౌండ్ లో నలుపు రంగు చతురస్రాలతో ఒక సందేశాన్ని గూఢంగా ఉంచడమే ఈ టెక్నిక్. అంకెలు, అక్షరాలు+అంకెలు, బైట్/బైనరీ మరియు కంజి(జపానీయుల లిపి) -- ఈ నాలుగు రకాల సందేశాలను క్యూఆర్ కోడ్ ద్వారా భద్ర పరచవచ్చు. టొయోటా అనుబంధ సంస్థ అయిన డెన్సో 1994 లో వాహనాల తయారీని అంచనా వేసేందుకు బార్ కోడ్ యొక్క 2 డైమెన్షన్ రూపాన్ని వాడారు. అతి వేగంగా ఎన్కోడ్(గూఢీకరణ) మరియు డీకోడ్(నిగూఢీకరణ) అయ్యే విధంగా ఈ కోడ్ ను రూపొందించారు. అమెరికా, కెనడా మరియు హాంగ్‍కాంగ్ లలో క్యూఆర్ కోడ్ వాడుక అధికంగా ఉంది.

qrcode
నా పేరు బ్లాగు పేరు, నా ఫోన్ నంబర్, ఈ మెయిల్ ను పొందుపరిచిన క్యూఆర్ కోడ్

పై బొమ్మలో చూపిన విధంగా క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇదివరకే ఈ తరహా కోడ్ ను మీరు పత్రికల్లో, బిజినెస్ కార్డ్లపై ఇంకా మరెన్నో చోట్ల చూసే వుంటారు. ఈ క్యూఆర్ కోడ్ లో ఉన్న సమాచారాన్ని ఫోన్ ద్వారా స్కాన్ చేసి అప్పటికప్పుడే ఏం రాసుందో తెలుసుకోవచ్చు. ఆండ్రాయిడ్ వంటి స్మార్ట్ ఫోన్లలో ఈ కోడ్ ను ఇట్టే చదవవచ్చు.
మీ పేరు లేదా ఏదయినా సమాచారాన్ని ఇప్పుడే క్యూఆర్ కోడ్ గా మార్చండి. http://qrcode.kaywa.com/ కు వెళ్ళి మీ సొంత క్యూఆర్ కోడ్ ను పొందండి.