Thursday, March 26, 2020

కరోనా బాధితుడు బాటసారి

ముందూ వెనుకా ఆలోచించకుండా పెద్దలు తీసుకునే నిర్ణయాలు ఆ పెద్దలను ప్రభావితం చేసేదేముండదు గానీ, ఆ నిర్ణయం వలన పిన్నలు ఎంత కష్టాలకు లోనవ్వాల్సి వస్తుందో, నిర్ణయాలు తీసుకునే పెద్దలకు అవి తట్టవు. తట్టినా వారు పట్టించుకోరు, పట్టించుకుంటే వారి మనుగడ కష్టం అని వారు తలుస్తారు కనుక.
డాక్టర్ కార్తీక్ తన కూతురు విషయంలో నిర్ణయం తీసేస్కునే హక్కు ఉంది, అందుకు హిమ ఎదురు చెప్పకూడదు. ఆ నిర్ణయాల వలన వచ్చే కష్టాలు మాత్రమే హిమ అనుభవించాలి.
సరిగ్గా అలానే, అక్కడ దేశ ప్రధాని ఒక రోజు జనతా కర్ఫ్యూ ముసుగులో మూడు వారాలు (ఆపై ఇంకెన్ని రోజులో, నెలలో తెలీదు) గృహ నిర్బంధం ప్రకటించేసాడు. సాధారణ ప్రజకు ఆలోచించుకునే వ్యవధి, ఇళ్ళకు చేరటానికి తగిన వనరులు ఏర్పరుచుకునే వ్యవధి కూడా ఇవ్వలేదు.
ఒకరికి ఒంట్లో బాగాలేదు, కానీ హాస్పిటల్ దాకా చేరేసే నాధుడు లేడాయె. సంంంచీడు కూరగాయల ధరలు సహస్రం దాటాయి. ఆంధ్రలో మారుమూల మరొకరు ప్రాణాపాయ స్థితిలో ఉంటే, ఆఖరి ఆశగా హైదరాబాదు తీసుకెళ్ళడం ఈ పరిస్థితుల్లో కుదరదు.
ఇటు హాస్టళ్ళ యజమానులు తిండి పెట్టడం కుదరదు, ఖాళీ చేసి మీ ఊరు పోండి అని రోడ్డు మీదకు నెట్టేస్తే, ఎలాగోలా ముందు స్వగ్రామం చేరదాం అని ఆ యువతి/యువకుడు ధైర్యం చేసి బయలుదేరతారు. రోడ్డు మీద కనిపిస్తే కాఠిన్యాన్నంతా ఒక విసురులోకి దించి కొట్టేస్తారు పోలీసులు. వారిని తప్పించుకొని రాత్రుళ్ళు సొంతిళ్ళకి చేరిందెందరో. ఈలోపు పోలీసులు అల్లరి పెద్దది అవకుండా, తమ చేతికి మరకవకుండా, అనుమతి పత్రాలు జారీ చేసేస్తారు. క్యూలో నుంచొని, గంట-రెండు గంటలు-పది గంటలు వేచి వేచి అనుమతి పత్రం పొందుతారు రోడ్డున పడ్డ ఆ యువకులు. అనుమతి పత్రం చేతికందిన మరుక్షణం డబ్బుకు వెనుకాడకుండా కారో, బైకో, లారీయో, వ్యానో ఎక్కి ఇంటి ముఖం పడతారు.  పెద్ద జనం లేని సమయంలో రెండు కార్లు, నాలుగు బైకులను అనుమతించిన సరిహద్దు పోలీసులు, వీరిని నిర్దాక్షిణ్యంగా ఆపేస్తారు. తిండి, నీరు, శుచి లేకుండా రోడ్డు మీదే ఆ సరిహద్దు పోలీసుల దయ మీద, ఆ ఆం.ప్ర. ముఖ్యమంత్రి నిర్ణయం మీద ఆశతో పడిగాపులు కాస్తారు. వెర్రి జనం.
ఎంతటి విపత్తు పరిస్థితిలోనైనా జనాన్ని సురక్షితంగా వారి ఇళ్ళకు చేర్చటం ప్రభుత్వ బాధ్యత. విడిగా పంపించేస్తే సమస్య అయితే, పరీక్షించి పంపండి. వ్యాధి ఉన్నవారు సైతం, వైరస్ ని నియంత్రణలో ఉంచగలిగే వాహనాలలో వారిని తరలించండి.
పరీక్షించడానికి సరైన పద్ధతులుండవు, సరైన నిర్ణయం తీసుకునే విచక్షణ ఉండదు.
అప్పటికప్పుడు ఈ పెద్దాయన, ఆ పెద్దాయనతో మాట్లాడతాడు. ఆ పెద్దాయన,  ఏ హాస్టలూ మూతబడదు అని హామీ ఇస్తాడు. ఇటేమో ఇళ్ళకు చేరాలంటే 14 రోజుల నిర్బంధం తప్పదు అని ప్రజాముఖంగా సీయం అంటాడు.  దిక్కుతోచక తిరిగి హైదరాబాద్ చేరేద్దాం అని నిర్ణయించుకునే లోపే ప్రతి ఒక్కరినీ వారి గ్రామానికి చేర్చే ఏర్పాటు అని ప్రకటించేస్తాడు.
అసలే ప్రకృతి జనంతో విలయతాండవం ఆడుతుంటే, ఈ ప్రజా పరిపాలకులకూ జనం భలే దొరికారు ఆటాడుకోడానికి.

ఇదంతా చూస్తుంటే శ్రీశ్రీ కవిత గుర్తొస్తోంది. బాటసారి...

కూటి కోసం, కూలి కోసం,
పట్టణంలో బ్రతుకుదామని
తల్లి మాటలు చెవిని పెట్టక
బయలుదేరిన బాటసారికి,
ఎంత కష్టం!
మూడు రోజులు ఒక్క తీరుగ
నడుస్తున్నా దిక్కు తెలియక-
నడిసముద్రపు నావ రీతిగా
సంచరిస్తూ సంచలిస్తూ
దిగులు పడుతూ దీనుడౌతూ
తిరుగుతుంటే...
చండ చండం, తీవ్ర తీవ్రం....
జ్వరం కాస్తే
భయం వేస్తే
ప్రలాపిస్తే....
మబ్బు పట్టి, గాలి కొట్టి...
వాన వస్తే... వరద వస్తే...
చిమ్మ చీకటి కమ్ముకొస్తే...
దారితప్పిన బాటసారికి
ఎంత కష్టం!