Friday, September 5, 2014

సరదా కోసం, ఒక పొట్టి కథ అనువాదం

ఈ మధ్య ఎవరి వద్దకు కలవడానికి వెళ్ళినే మీరేమయినా రచనలు చేసారా అన ప్రశ్న ఎదురవుతుంది.
ఎప్పటి నుండో (నాకు ఊహ తెలిసినప్పటి నుండి) నా సొంత కథ వ్రాయాలన్నది కోరిక.
సరే అందుకు ఇప్పుడు శ్రీకారం.

కోరా లో దొరికిన ఒక ఆంగ్ల కథకు అనువాదం

౩౭ యేళ్ళ సుదీర్ఘ దాంపత్య జీవితం గడిపేసరికి గురునాధానికి భార్య ఆండాళ్ళు మీద మనసు సన్నగిల్లింది. కొత్తగా చేరిన సెక్రెటరీ తాయారమ్మ మీద కన్ను పడింది. తాయారమ్మ గడుసుదాయే, ఇంట్లో నుండి ఆండాళ్ళుని తరిమేస్తేనే కాపరానికి వస్తానంది. లంకంత ఇల్లు - కోట్ల విలువ కలిగింది. ఆండాళ్ళు ఏం చేస్తుంది, పాపం - కోర్టుకు వెళ్ళింది. గురునాధం ఘటికుడు, గట్టి లాయర్లను పెట్టి పది లక్షల జరిమానాకు విడాకులకు ఒప్పించాడు.

ఆండాళ్ళుకి మూడు రోజుల వ్యవధి ఇచ్చాడు. ఆమె మొదటి రోజంతా సొత్తు మూటకట్టుకోటంలో గడిపేసింది, రెండో రోజు పనిమనుషులను పెటించి ఆ సామానంతా పుట్టింటికి మార్పించింది.
మూడో రోజు పెద్ద విందు ఏర్పాటు చేయించింది. విందు కోసం మాంఛి ఱొయ్యలు, పీతలు, చేపలు వండించింది. ముందు రోజు సహాయం చేసిన పనిమనుషులందరికీ విందు ఘనంగా చేయించింది. గురునాథానికీ, తాయారమ్మకీ టైం లేక విందుకు రాలేదని చెప్పించి, డీవీ మేనర్ కు వెళ్ళి సుష్టుగా భోంచేసి ఐనాక్స్ కి సినిమా చూట్టానికి వెళ్ళారు. పని మనుషులంతా భుక్తాయాసంతో సేదదీరారు.
ఇక ఆండాళ్ళు ఏడుస్తూ దిగాలుగా అన్ని గదులూ పరికిస్తూ, ప్రతీ వస్తువునూ పలకరిస్తూ వీడుకోలు చెబుతూ ఉంది. గురునాధానికి పూల సజ్జలంటే మహా ఇష్టం, పూల సజ్జల కోసం ఏనుగు దంతంతో చేసిన గిన్నెలను చేయించి అన్ని గదుల్లోనూ అమర్చాడు. వాడికి ఆ గిన్నెలంటే ఎంతిష్టమంటే ఆండాళ్ళుని ఒక్క గిన్నె కూడా ముట్టుకోవద్దని హెచ్చరించేవాడు.
ఆండాళ్ళు తనతో పాటు ఒక సంచిలో శుభ్రం చేసాక వచ్చిన చేప తోలుకుండే గుండ్రటి పొట్టు, రొయ్య తలలు, పీతల వ్యర్థం వేసుకుని తెచ్చింది. ఒక్కో ఏనుగు దంతం గిన్నెలో గుప్పెడు పొట్టు వేసుకుంటూ అన్ని గదుల్లో తిరగాడింది.
గురునాధం వచ్చే సమయానికి ఆమె ఇల్లు వదిలి వెళ్ళిపోయింది.
తాయారమ్మకి ఆ ఇంట్లో భూతల స్వర్గం కనిపించింది. ఇద్దరూ సంతోషంగా కలకాలం ఉందామని తీర్మానించుకొని నిద్రపోయారు.
రెండో రోజు ఉదయం నుండి ఇంట్లో ఏదో తెలీని దుర్వాసన. గదులన్నీ శుభ్రం చేయించారు, ఎలుకలు ఎక్కడయినా చచ్చి పడున్నాయేమో వెతికించారు, సెంటు బాటిళ్ళు పదుల్లో కొని ఇల్లంతా చిలకరించారు. రెండు రోజులు ఇంటి బయట ఉంటూ పనిమనుషులతో ఇల్లంతా తోమించారు. ఏ ఒక్క చిట్కా పని చెయ్యట్లేదు.
జనాలు ఇంటికి రావటం మానేసారు. పని మనుషులు పని మానేసారు. ఇక లాభం లేదని ఇల్లు ఖాళీ చేసేద్దామని నిశ్చయించుకున్న గురునాధం ఇల్లును అమ్మకానికి పెట్టాడు. నెల తరువాత సగం ధర పెట్టినా ఎవ్వరూ కొనడానికి రావటం లేదు. మధ్యవర్తులు కూడా కంపు ఇల్లు అని తెలుసుకుని పలకరించడం మానేసారు. గురునాధం ఆఖరికి అప్పు చేసి కొత్త ఇల్లొకటి కొనుక్కున్నాడు.
అప్పుడే ఆండాళ్ళు ఫోన్ చేసి కుశల ప్రశ్నల అడిగింది, గురునాధం జరిగిందంతా చెప్పాడు. ఆమె అంతా నెమ్మదిగా విని, తనకి ఆ ఇల్లు అంటే ఇష్టమనీ, విడాకుల జరిమానా కింద తీసుకుంటాననీ చెప్పింది.
ఆమెకి ఈ ఇల్లు ఎంత దుర్వాసనేస్తోందో తెలీదనుకొన్న గురునాధం వెంటనే ఒప్పేసుకున్నాడు, కానీ అదే రోజున ఒప్పందపత్రాలపై సంతకాలు కావాలన్నాడు. ఆండాళ్ళు సంతోషంగా ఒప్పుకుంది. సంతకాలయిపోయాయి.
ఒక వారం తరువాత తాయారు ముఖంలో సంతోషం, ఇల్లు ఖాళీ చేసేస్తున్నందుకు. కానీ ఇంట్లో సామానుతో పాటూ ఏనుగు దంతం గిన్నెల పూల సజ్జలు కూడా బండ్లెక్కేసాయి!