Monday, July 28, 2014

ఈదుల్ ఫిత్ర్

ప్రపంచంలో గల అన్ని మతాల వారూ, విశ్వాసాల వారూ ఏదో/ ఒక పండగో పబ్బమో చేసుకుంటూంటారు. మొహమ్మదీయులు కూడా సంవత్సరం పొడవునా ఏదో ఒక పండుగ చేసుకుంటూ ఉంటారు - బక్రీద్, మొహమ్మద్ ప్రవక్త (సఅసం) పుట్టిన రోజు, మొ॥ అయితే ఈ అన్ని పండుగలలో రెండు ముఖ్యమైనవి, వీటిని ఈద్ అంటారు. ఈద్-అల్-ఫితర్, ఈద్-అల్-అజ్‍హా. ఈ రెండు రోజులూ పూర్తి పండుగ వాతావరణంలో సంతోషం మరియు ఉల్లాసభరితంగా జరుపుకోమని దేవుడే(అల్లాహ్) స్వయంగా కుర్ఆన్ ద్వారా తెలిపారు.
మానవాళికి మార్గదర్శకంగా ఉండేందుకు దేవుడు కుర్ఆన్ ను రంజాన్ నెలలోనే అవతరింపచేసాడు. ఇదే నెలలో మొదటి సారి వెలుగు కూడా ఉద్భవింపబడింది. భౌతిక వెలుగు లేనిదే మనిషి ఏమీ చూడలేడు. భావాత్మక వెలుగు లేనిదే మనిషి మంచి-చెడు వ్యత్యాసం చూడలేడు. కుర్ఆన్ అవతరణకు ముందు మనిషి పూర్తి అంధకారంలో ఉండేవాడు. కుర్ఆన్ అవతరణ ద్వారా ఈ భావాత్మక వెలుగు మానవాళికి ప్రసరించింది. కుర్ఆన్ అవతరణ సమయానికి మానవ సమాజం చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఒక మనిషి మరో మనిషిని బానిసగా వాడుకునే వాడు. కార్మిక కర్షకుల రక్తాన్ని జెలగల్లా పీల్చే వారీ యజమానులు. మొహమ్మద్ ప్రవక్త(సఅసం) ద్వారా మానవత్వాన్ని బంధించిన ఈ సంకెళ్ళను తెంపెయ్యాలనుకున్నాడు అల్లాహ్. ఈ సంకెళ్ళలో మొదటిది అజ్ఞానం, మూఢనమ్మకాలు. గర్జిస్తున్న మేఘాలు, ఉరుముతున్న ఉరుములు, మెరుస్తున్న మెరుపులు, వేడితో చంపేసే వడగాలులు, సుడిగుండాలలో ముంచెత్తే నదులు - ఇవన్నీ దేవుడి రూపాలే అనీ, వీటికి మొక్కటం, డబ్బు ఖర్చు చేసి విందులు తినిపించడం లాంటివి చేసేవాడు. వాటి ముందు మోకరిల్లి సజ్దా చేసేవాడు, పూజించేవాడు. నర బలులు ఇచ్చి ఆ దేవతలను సంతృప్తి చేసుకునేవాడు. కుర్ఆన్ ద్వారా ఈ మూఢనమ్మకాలను అణిచివేసి ఇస్లాం ధర్మాన్ని శాంతి సూచకంగా మానవాళికి మొహమ్మద్ ప్రవక్త(సఅసం) ద్వారా అందించాడు అల్లాహ్.
ఈ మూఢ నమ్మకాలు రూపుమాపటంతో పాటే మానవ సమాజం సక్రమంగా ఉండేలా వ్యవస్థీకృతమయినది ఇస్లాం.
రంజాన్ నెల రోజుల పాటూ మొహమ్మదీయులు పగటి పూట భోజనం చేయకుండా కుర్ఆన్ పఠనం, దైవారాధనలో నిమగ్నులై ఉంటారు. ఆకలి దప్పికలలో బీద వారు అనుభవించే బాధను ప్రతి మొహమ్మదీయుడూ అనుభవిస్తాడు. ఆ అనుభవం ద్వారా పేద వారికి సహాయం చెయ్యాలనే భావన గుండె లోతు నుండి కలుగుతుంది. రంజాన్ నెల లో జకాత్ ఇవ్వడం, ఫిత్రా ఇవ్వడం ఇందుకు ఋజువులు.
ఫిత్రా అనేది ఇంటి పెద్ద పేద వారికి విధిగా రంజాన్ ఆఖరి రోజు తరువాత వచ్చే ఈదుల్-ఫితర్ నమాజ్ కు ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది, ఇంటిలో ప్రతి సభ్యునికీ 2.25 కేజీల బరువు ఆహార ధాన్యాలు లేదా తత్సమానమయిన ధనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక జకాత్ అనేది ప్రతి ఆదాయం కలిగిన వ్యక్తి విధిగా సమర్పించవలసిన ఆదాయపు దానపు భాగం, 1000 రూపాయలకు 25 రూపాయల చప్పున లెక్కించి సంవత్సర ఆదాయంలో ఆ భాగాన్ని పేదవారికి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇవి అయ్యాక పండగ పూట ఉదయాన్నే దేవుడికి రంజాన్ అందించినందుకు కృతజ్ఞతతో ప్రార్థనలు చెయ్యాలి.
ప్రార్థనల అనంతరం మొహమ్మదీయుల గృహాలలో షీర్-ఖుర్మా అనబడే విశేష వంటకం వండబడుతుంది. ఇది పాల పాయసంలో రకరకాల డ్రై ఫ్రూట్స్ కలిపి చేయబడుతుంది.
రోజంతా బంధువులు, స్నేహితులు, ఒకరినొకరం కలిసి, శుభాకాంక్షలు తెలిపి, ప్రీతిభోజనాలు జరుపుకుంటారు.
దానముల గొప్పతనాన్ని తెలిపే ఈదుల్ ఫిత్ర్ ని సంతోషంగా జరుపుకుందాం!

2 comments:

  1. ఈద్ ముబారక్.

    అయితే ముస్లిములను మొహమ్మదీయులు అనడం సబబు కాదు. మొహమ్మద్ ప్రవక్త (PBUH) కేవలం ఒక ప్రవక్త మాత్రమె దేవునితో సమానం కాదు.

    ReplyDelete
  2. Thank you dear Rahman!

    Fine & Timely article.

    ReplyDelete