Showing posts with label పుస్తక సమీక్ష. Show all posts
Showing posts with label పుస్తక సమీక్ష. Show all posts

Wednesday, July 16, 2014

బాణావతి - విశ్వనాథ సత్యనారాయణ - పిశాచ ప్రసంగం

బాణావతి - ఇప్పుడే చదవడం పూర్తి చేసాను.
సాహిత్య ప్రక్రియల్లో ఇదో రకం ప్రయోగం. పూర్తి సంభాషణల మధ్యనే నవలలోని కథను నడుపుతూ, మధ్యమధ్యలో హాస్యపు గుళికలు, సాహిత్య చర్చలు, రాజకీయ చర్చలు చేయిస్తూ, అలౌకిక శక్తులకు సంబంధించిన సున్నితమయిన పీటముడి అంశాలను చాలా ఓపిగ్గా విడదీస్తూ వెళ్ళిన నవల.
పిశాచాలు, ప్రేతాలు, ప్రయోగాలు లాంటివి నమ్మాలో నమ్మకూడదో అటుంచితే, ఆ అంశం నుండి కూడా వేదాంతాలు, స్త్రీ-పురుష సంబంధాల విశ్లేషణ, రాజకీయ సామాజిక పరిస్థితులని చూపించడంలో కవి సామ్రాట్ కు సాటిలేరెవ్వరు.
నలుగురం స్నేహితులం కలిసామంటే మాటల్లో మాటల్లో దెయ్యాల కథల వైపు చర్చ సాగించడం పరిపాటి, ఆ సన్నివేశమే ఇందులో మొదలవటం ఒక నోస్టాల్జియా. ఆపై క్రింది ఉద్యోగులు తమ పై అధికారులను పరోక్షనింద చేయడమూ పరిపాటే (నాకా అలవాటు లేదనుకోండి)!

సామాజిక పరిస్థితులను అధిగమించి వేద-శాస్త్రాలను నేర్చిన వనిత, అదే సామాజిక పరిస్థితులకు తలవంచి బాల్య వివాహానికి బలి కావడం, అక్కడ మొదలు పాపపు సాంగత్యం వలన అరిషడ్వర్గాల బానిసవడం, చేయరాని పాపాలలో పాలు పంచుకోవడం, దీన స్థితికి చేరి వైద్యానికి డబ్బు లేక, డబ్బు బదులు పాపం మోసి చనిపోవడం, అక్కడితో ఆగక కామాన్ని మూటకట్టుకొని కామినీ పిశాచిగా మారటం, మారి ఒక బీద యువకుడిని పట్టి పీడించ చూసి, అతనికి దాసియై, అతనికి సర్వ విద్యల సారం అందేలా చేసి, అతని ద్వారా తన మోక్షాన్ని పొందించుకున్న పిశాచం కథే ఈ బాణావతి.

సంభాషణలు చాలా చమత్కారంగా ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యపు మిఠాయి కొట్లో ఇందాకా నేను చదివినవన్నీ తియ్యటి పదార్ధాలయితే, కారబ్బూందీ ఈ బాణావతి.

సూక్ష్మ లోకం గురించి ఇంకొంచెం లోతుగా అర్ధం చేసుకునే అవకాశం కలిగింది. నాస్తికత్వ భావం కలవారిని కూడా తగిన రీతి పిశాచాలలోకం తీరుతెన్నులపై అవగాహన కలిగేలా చేసే కథనం.
భార్య-భర్త సంబంధం మరింత వక్కాణించి చెప్పారు కవి సామ్రాట్టు.

హైదరాబాదు పరిసర ప్రాంతాలు 60ల ప్రాంతంలో ఎలా ఉండేది అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల వెతలు వారి సంభాషణల్లోనే చదవవచ్చు. ఒక సన్నివేశంలో ఆంగ్లం వీపు మీద "అట్టు" వేయడమూ జరిగింది!
సమాజంలోని బాల్య వివాహం అనే రుగ్మత ఎలాంటి సామాజిక దారుణాలకు దారి తీస్తుందో ఒక విధంగా చెప్పకనే చెప్పారు.
ఇంతకీ పుస్తకం పూర్తి చేసినా నాకు అర్ధం కానిది శర్మ వాళ్ళ చిన్నన్నయ్య మీదకు ప్రయోగం ఎవరు చేయించారూ, అన్న విషయం!
లేక ప్రయోగం బేగంపేట లోని ఇంట్లో ఉండటానికి వచ్చిన వారి మీద జరిగిందా?
మొత్తానికి మంచి మనోరంజకం అలాగే ధర్మసూక్ష్మాలనూ తెలిపే గ్రంథం!

Friday, May 16, 2014

கோட்டைப்புரத்து வீடு (కోట్టైప్పురత్తు వీడు - కోటపురం మహల్)

ఇందిరా సౌందర్ రాజన్ నవలలు అంటే ఎప్పుడూ నాకు తెలీని ఒక ఆసక్తి. అతీత శక్తులు - నమ్మకాలు - చరిత్ర - సమాజం ఇతివృత్తాలుగా రాసే ఈయన నవలలు బహుశా ప్రతి ఒక్కరూ తప్పక వదలకుండా చదివే శక్తి కలిగి ఉంటాయంటే అతిశయోక్తి కాదేమో! రోమాలు నిక్కబొడుచుకునే విధంగా సస్పెన్స్ థ్రిల్లర్ లు రాయటంలో ఈయనది చెప్పుకోదగ్గ పేరు.
ముఖ్యంగా ఈయన రచనల్లో అరవనాటి స్థానిక గ్రామదేవతల కథ-కథనాలు కనిపిస్తాయి. రాచరికపు వ్యవస్థలు, రాజ్యాలు, రాజకుటుంబాల గురించి ప్రత్యేకంగా రాస్తారని చెప్పనక్కరలేదు. రహస్యం వరుసలో వచ్చిన రహస్యం-మర్మదేశం మొదలగు అత్యంత ప్రజాదరణ పొందిన టీవీ సీరియళ్ళకు ముడి సరకు ఈయన రచనలే!
ఈ నవల విషయానికొస్తే, ఇది ఆనంద వికటన్ పత్రికలో 31 వారాల పాటూ సీరియల్ గా ప్రచురించబడింది. ఒక్కో వారం కొత్త ఉత్కంఠతో, కొత్త మలుపుతో మరింత ఆసక్తి కలిగిస్తూ, వచ్చే వారపు భాగాన్ని చదివేందుకు మరింత ఆసక్తిని కలిగించేలా రాసారు.
కోట్టైపురం రాజరికవంశం వారిపై వంజియమ్మ శాపం నడుమ జరిగే అర్చన - విసు ప్రేమాయణమే ఈ నవల. 
వంజియమ్మన్ కు జరిగిన దారుణాతి దారుణమయిన అన్యాయం, ఆమె భర్త హత్య, ఆమె బలాత్కారం ఆత్మహత్య, ఆ అనుసరణలో కోట్టైపురం రాజవంశంలో పుట్టిన అమ్మాయిలు పుట్టిన వెంటనే చనిపోవటం, అబ్బాయిలు వారి ముప్ఫయ్యవ యేట చనిపోవడం అనే శాపంతో కథ మొదలవుతుంది. తన అన్న గజేంద్రన్ చావు అంచులో‌(ముప్ఫ్య్యవ యేట అడుగిడుతూ)ఉండగా బెంగుళూరు నుండి విసు ఎయిర్పోర్ట్ లో దిగడం, అర్చన అతన్ని అక్కడికి కలవడానికి రావడం, రాజ మర్యాదలంటే ఆసక్తి లేని విసు కు సంస్థానంలోని ఉద్యోగుల వినమ్రతకూ మధ్య జరిగే సంఘర్షణ ముందుగా కనిపిస్తుంది.
ఆపై విసు అన్న చనిపోవడం, అందుకు కారణం అందరూ శాపమని నమ్ముతున్నా ఒక్క అర్చన ఈ విషయాన్ని మానవకల్పితమనీ, ఒక కుట్ర జరుగుతుందనీ పసిగట్టడం, ఆపై మహల్లో మరిన్ని మరణాలు, విసుపై హత్యా ప్రయత్నాల నడుమ నవల ఆద్యంతం రసవత్తరంగా సాగుతుంది. కొన్ని సందర్భాలలో పాత్రలు హేతువాదాన్ని వీడి శాపాలలో అతీత శక్తులలో నమ్మకం పెంచుకుంటారు కూడా. మళ్ళీ తిరిగి లౌక్యంగా ఆలోచిస్తారు.
అర్చన చాకచక్యంగా ఏ విధంగా విసు ను ఈ కుట్ర నుండి లేదా దేవత శాపం నుండి కాపాడుతుందో అన్నది మిగితా నవలలో ఆసక్తికర భాగం!
320 పేజీలు వదలకుండా చదివిస్తాయి!