Showing posts with label విశ్వనాథ సత్యనారాయణ. Show all posts
Showing posts with label విశ్వనాథ సత్యనారాయణ. Show all posts

Wednesday, July 16, 2014

బాణావతి - విశ్వనాథ సత్యనారాయణ - పిశాచ ప్రసంగం

బాణావతి - ఇప్పుడే చదవడం పూర్తి చేసాను.
సాహిత్య ప్రక్రియల్లో ఇదో రకం ప్రయోగం. పూర్తి సంభాషణల మధ్యనే నవలలోని కథను నడుపుతూ, మధ్యమధ్యలో హాస్యపు గుళికలు, సాహిత్య చర్చలు, రాజకీయ చర్చలు చేయిస్తూ, అలౌకిక శక్తులకు సంబంధించిన సున్నితమయిన పీటముడి అంశాలను చాలా ఓపిగ్గా విడదీస్తూ వెళ్ళిన నవల.
పిశాచాలు, ప్రేతాలు, ప్రయోగాలు లాంటివి నమ్మాలో నమ్మకూడదో అటుంచితే, ఆ అంశం నుండి కూడా వేదాంతాలు, స్త్రీ-పురుష సంబంధాల విశ్లేషణ, రాజకీయ సామాజిక పరిస్థితులని చూపించడంలో కవి సామ్రాట్ కు సాటిలేరెవ్వరు.
నలుగురం స్నేహితులం కలిసామంటే మాటల్లో మాటల్లో దెయ్యాల కథల వైపు చర్చ సాగించడం పరిపాటి, ఆ సన్నివేశమే ఇందులో మొదలవటం ఒక నోస్టాల్జియా. ఆపై క్రింది ఉద్యోగులు తమ పై అధికారులను పరోక్షనింద చేయడమూ పరిపాటే (నాకా అలవాటు లేదనుకోండి)!

సామాజిక పరిస్థితులను అధిగమించి వేద-శాస్త్రాలను నేర్చిన వనిత, అదే సామాజిక పరిస్థితులకు తలవంచి బాల్య వివాహానికి బలి కావడం, అక్కడ మొదలు పాపపు సాంగత్యం వలన అరిషడ్వర్గాల బానిసవడం, చేయరాని పాపాలలో పాలు పంచుకోవడం, దీన స్థితికి చేరి వైద్యానికి డబ్బు లేక, డబ్బు బదులు పాపం మోసి చనిపోవడం, అక్కడితో ఆగక కామాన్ని మూటకట్టుకొని కామినీ పిశాచిగా మారటం, మారి ఒక బీద యువకుడిని పట్టి పీడించ చూసి, అతనికి దాసియై, అతనికి సర్వ విద్యల సారం అందేలా చేసి, అతని ద్వారా తన మోక్షాన్ని పొందించుకున్న పిశాచం కథే ఈ బాణావతి.

సంభాషణలు చాలా చమత్కారంగా ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యపు మిఠాయి కొట్లో ఇందాకా నేను చదివినవన్నీ తియ్యటి పదార్ధాలయితే, కారబ్బూందీ ఈ బాణావతి.

సూక్ష్మ లోకం గురించి ఇంకొంచెం లోతుగా అర్ధం చేసుకునే అవకాశం కలిగింది. నాస్తికత్వ భావం కలవారిని కూడా తగిన రీతి పిశాచాలలోకం తీరుతెన్నులపై అవగాహన కలిగేలా చేసే కథనం.
భార్య-భర్త సంబంధం మరింత వక్కాణించి చెప్పారు కవి సామ్రాట్టు.

హైదరాబాదు పరిసర ప్రాంతాలు 60ల ప్రాంతంలో ఎలా ఉండేది అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల వెతలు వారి సంభాషణల్లోనే చదవవచ్చు. ఒక సన్నివేశంలో ఆంగ్లం వీపు మీద "అట్టు" వేయడమూ జరిగింది!
సమాజంలోని బాల్య వివాహం అనే రుగ్మత ఎలాంటి సామాజిక దారుణాలకు దారి తీస్తుందో ఒక విధంగా చెప్పకనే చెప్పారు.
ఇంతకీ పుస్తకం పూర్తి చేసినా నాకు అర్ధం కానిది శర్మ వాళ్ళ చిన్నన్నయ్య మీదకు ప్రయోగం ఎవరు చేయించారూ, అన్న విషయం!
లేక ప్రయోగం బేగంపేట లోని ఇంట్లో ఉండటానికి వచ్చిన వారి మీద జరిగిందా?
మొత్తానికి మంచి మనోరంజకం అలాగే ధర్మసూక్ష్మాలనూ తెలిపే గ్రంథం!

Thursday, May 1, 2014

వీరవల్లడు

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ వారి రచనలకు సంబంధించి పాఠకులలో ఎన్నో అపోహలు. ఆ అపోహల వల్ల అసలు ఆయన సాహిత్యాన్ని చదివే అదృష్టాన్ని కోల్పోవడం పరిపాటి.
కవి సామ్రాట్ రచనల గురించి జనబాహుళ్యంలో ఉన్న కొన్ని అంశాలు:

  1. ఈయన రచనలన్నీ అర్ధం కాని భాషలో ఉంటాయి.
  2. చదవటానికి సాధ్యం కానంత పెద్ద పరిమాణంలో ఉంటాయి. (కనీసం వెయ్యి పేజీలుంటాయి)
  3. ఒక కులాన్ని సాహిత్యం ద్వారా గ్లోరిఫై చేయడం. నిమ్న కులాల ఊసు ఆ సాహిత్యంలో ఉండదు.
ఇలాంటివి ఇంకెన్నో...
అయితే
ఈ వీరవల్లడు నవల పైన చెప్పుకున్న అంశాలను పటాపంచలు చేసే పుస్తకం.
వ్యావహారిక భాషలో రాయబడి, చదవటానికెలాంటి ఇబ్బందీ ఉండదు (విశ్వనాథ వారి సాహిత్య భాష గురించి కరణం బాలసుబ్రహ్మణ్యం పిళ్ళై గారి వద్ద సరికొత్త వాదన విన్నాను - ఆ చర్చ వేరే టపాలో).
62 పేజీలు (అదీ చిన్న పేజీలు- ఇప్పుడున్న పుస్తకంలో 40 పేజీలే) గల పుస్తకం. ఒక నిమ్న కుల వ్యక్తిని గ్లోరిఫై చేస్తూ రాయబడిన పుస్తకం.

కథలోకి వెళితే ఒక విద్యార్థి పేరును వాళ్ళ మాస్టారు హేళన చేయడం "వల్లడా, వల్లకాడా" అనడంతో ఆ విద్యార్థికి రోషం వచ్చి ఇంటికొచ్చి పేరు మార్చుకోవాలనుందని పట్టుబట్టడం- ఆ పేరు ఒక పాలేరు పేరని తెలిసి మరింతా మారం చేయడం జరుగుతుంది. ఆ పేరు, ఆ పేరుగల వ్యక్తి వీరవల్లడి కథను ఆ పిల్లోడికి తండ్రి చెబుతాడు.
బ్రాహ్మణ కుల పెద్దల దొంగ న్యాయాలకు తన యజమాని మరణానంతరం యజమాని కుటుంబం వీధిపాలవటం సహించలేక, ఊరంతటినీ ఒక్క తాటి మీదకి తెచ్చి సరియయిన న్యాయం ఇప్పించడం ఆ కథ. ఆనాటి కుల కట్టుబాట్లూ, గ్రామ్య జీవనం, భూమి వ్యవహారాలు రచయిత కథ ద్వారా చక్కగా చెప్పగలిగాడు.
కృష్ణమ్మను ఎంతో మనోహరంగా చిత్రీకరించి కళ్ళముందుంచడం నాకు చాలా నచ్చింది.

ఇక ఆలస్యం దేనికీ వెంటనే మీరూ ఈ పుస్తకాన్ని చదివేయండి.

  

Tuesday, September 10, 2013

వేయి పడగలు-విశ్వనాథ మరియు నేనూను

ఒక చిన్ననాటి జ్ఞాపకం
ఒక చిన్న పుస్తకం, మామయ్య పుస్తకాల్లో కనిపించింది. అందులోని కొన్ని; కాదు కాదు చాలా పదాలు నాకు అర్ధమవలేదు, ఆ పుస్తకాన్ని ఒక పక్కన పెట్టేసాను.
***
పాత పుస్తకాల దుకాణంలో ఒక లావుపాటి పుస్తకం ఉంది, తెరిచి చూడాలేదు తెలుగు కాబట్టీ - ఇది నేను తొమ్మిదో తరగతి చదివే రోజుల సంగతి. స్కూల్ లో తెలుగు లేదు కాబట్టీ తెలుగు చదవాలనే ఆసక్తి - ఎక్కువ బొమ్మలున్న చందమామలాంటి పుస్తకాలకే పరిమితం, బొమ్మల్లేని పుస్తకాలు సుద్ద-దండగ అనిపించేవి. ఆ పుస్తకం వేయిపడగలు! అదే మొదటి సారి చూడటం.
***
దూరదర్శన్ లో సుమ ఒక సీరియల్ లో వచ్చేది. అందులో భర్త ఉప్పివ్వమన్నప్పుడు లవణం అని అంటుంది. ఈమేంటి ఉప్పుని లవణం అంటుంది అని హేళనగా చెప్పుకున్న రోజులు; ఉన్నట్టుండి ఒకమ్మాయి జుట్టు విరబోసుకొని వేపమండలతో పరుగెడుతున్న సన్నివేశం చూసి భయపడటం - పదో తరగతి పరీక్షల తరువాతి శెలవు దినాలు. అది వేయి పడగలు సీరియల్!
 ***
ఇంజనీరింగ్ చదువుతున్న రోజులు, కాలేజీ ఉన్న ఊళ్ళో ఇతర వ్యాపకాలు లేకపోవడంతో జిల్లా గ్రంథాలయంలో చేరి అన్ని రకాల తెలుగు పుస్తకాలు చదువుతున్న రోజులు. స్నేహితుల ప్రభావం వల్ల ఎన్నో విలువయిన పుస్తకాలు తెలుగువీ-ఇంగ్లిష్ వీ కనుగొని చదివి మురిసిపోతున్న రోజులు. వేయి పడగలు పుస్తకం గురించి ఇక్కడ స్నేహితులలో ఒకడు కచ్చితంగా చదవాల్సిన పుస్తకం అనడంతో పుస్తకంపై కాస్త ఆసక్తి కలిగింది, కానీ పుస్తకం ఎప్పుడూ ఎవరో ఒకరి ఖాతాలో ఉండేది - మళ్ళీ అనాసక్తి.
***
2009 పుస్తక ప్రదర్శన, మొదటిసారి ఇలాంటి ప్రదర్శనకు రావటం జరిగింది. ఈ-తెలుగు సభ్యులను కలవడం - వీవెన్ ని అంతకు ముందే కలిసినా, సుజాతగారినీ, సతీశ్ యనమండ్ర గారినీ, చక్రవర్తి గారినీ కలిసింది మొదట అక్కడే, పక్కనే నవోదయ స్టాల్ లో మొట్ట మొదటి సారి పూర్తి పుస్తకం చూసాను - వేయి పడగలు విశ్వనాథ సత్యనారాయణ అనే పేర్లను, కొందామని పుస్తాం చేతులోకి ఎత్తుకొని, ధర చూసి తిరిగి పెట్టేసాను. విద్యార్థులకు కథల పుస్తకాలు చదువుకునేందుకిచ్చే డబ్బుకు ఆ పుస్తకం అందలేదు మరి-ఆ రోజుల్లో!
***
2010 పుస్తక ప్రదర్శన సంపాదన చేతికొచ్చిన రోజులు, ఈ-తెలుగు స్టాల్ కి ఇంతకు ముందు ఒక రోజు వెళితే, ఈ మారు వారం రోజులు వెళ్ళిన సందర్భం, కానీ ఏ స్టాల్ లోనూ వేయిపడగలు దొరకలేదు, జీతం అందిన మొదటి రోజు నుండీ సరిగ్గా ఆరు నెలలు, పుస్తకం కొందామని తెచ్చిన డబ్బుతో హ్యారీ పాటర్, మరికొన్ని పుస్తకాలు కొని నిరాశతో ఇంటికి చేరాను.
ఒక రోజు పుస్తక ప్రదర్శనకు భరణి గారు రావడం, నా ల్యాపీలో కౌటిల్య తన బ్లాగులో విశ్వనాథ గారి పై రాసిన విషయాలు సిగ్గుపడుతూ భరణి గారికి చూపించడం గమనించాను. ఈ కుఱచబ్బాయితో స్నేహం చేసి ఎలాగయినా వేయిపడగలు సాధించి చదవాలనుకున్నాను. 
తరువాతి రోజు అడిగితే ప్రస్తుతం నా వద్ద లేదు గుంటూరొస్తే ఇస్తా అన్నాడు. 
లేదు నాకిప్పుడే కావాలి అని నిలదీస్తే నాగ ప్రసాద్ అనే సాములోరు వద్ద ఉంది తీసుకో అన్నాడు.
***
పుస్తక ప్రదర్శన ముగిసింది. ఈ నాగ ప్రసాద్ విలాసం అగమ్యగోచరంగా ఉంది.
మొత్తానికి ఒక రోజు సాములోరు ఉండే స్థావరానికి దగ్గరలో ఉన్న హాస్టల్లో నేను చేరడంతో ఏ జన్మ సుకృతి ఫలమో వేయిపడగలు మొదటి సారి నా చేతికందింది. అందిందే తడవుగా మొదటి మూడు అధ్యాయాలు చదివేసాను.
భాష కొత్తగా-వింతగా ఉంది, చదవగా చదవగా మరింత రుచించింది. కానీ నాలుగవ-అయిదవ అధ్యాయాలు కొంచెం మందచదువుగా చప్పగా సాగాయి. ఎనిమిదో అధ్యాయం వరకూ చదివాక పుస్తకం కొన్ని రోజులు కనపడకుండా పోయింది.  చెప్పలేనంత దిగులు వచ్చింది. రోజువారీ పనుల్లో మళ్ళీ పడిపోయి పుస్తకం సంగతి మరిచాను.
మళ్ళీ కొన్ని రోజులకి పుస్తకం దొరికింది మందకొడిగా చదువుతూ ఆసక్తిగానే మొత్తానికి ఒక ఆరు నెలల్లో పుస్తకం చదవడం ముగించాను.
గుంటూరు తరచు వెళ్ళడం మొదలయ్యాక కుఱచబ్బాయిని కలవటం ఎక్కువయింది. విశ్వనాథ గురించిన జ్ఞానమూ పెరిగింది. డీఎల్ఐ, కౌటిల్య, పాత పుస్తకాల కొట్ల పుణ్యమా అని విశ్వనాథ వారి సాహిత్యం మరింత చదవగలిగాను.
వేయిపడగలు ఎంత నచ్చిందంటే, ఇప్పటికీ ఎవరయినా ఏదయినా తెలుగు పుస్తకం చదవడానికి సలహా అడిగితే మొదటగా ఈ పుస్తకాన్నే చదమంటాను.
మా ఇంట్లో మామయ్యతో-అమ్మతో చదివించాను. ఓ మూడు కాపీలు కొని మరీ స్నేహితులకిచ్చాను కూడా.
ఇప్పటికీ ఏదో ఆలోచిస్తూ వేయిపడగలు తెరిచి చదివితే ఆ రోజు తలతొలిచేస్తున్న సమస్యకు సమాధానం దొరుకుతుంది.
విశ్వనాథ వారు రాసిన ఎన్ని గ్రంథాలున్నా, అన్నిట్లో పెక్కు గొప్పదీ వేయి పడగలు.
నా అవగాహనలో పుస్తకం చదవకుండానే పుస్తకం పై విమర్శలు గుప్పించొచ్చు అని నిరూపించిన పుస్తకాలలో వేయిపడగలు మొదటిది, రెండవదయిన చెలియలికట్ట కూడా విశ్వనాథ రచనే అవటం గమనార్హం. 
వేయిపడగల రచనా శైలి చాలా సులువు, భాష అలవాటయ్యాక చదవనలవవుతుంది.
పాత్రలు మనకూ, మన జీవితాలకూ ఎంతో దగ్గరగా ఉంటాయి. ఒక్కో పాత్రపైనా మరో పుస్తకమే రాయవచ్చు. 
ప్రతి సన్నివేశాన్ని ఊహించుకొని సంతోషించి, నాలో నేనే నవ్వుకున్న రోజులున్నాయి.
ఒక తెలీని ఉద్వేగం వేయిపడగలు చదివిన ప్రతి సారీ నాలో కలుగుతుంది.
ఒకానొక వ్యక్తి ఒక రచయిత రచనొకటి చదివి మిగితా రచనలు దీనికి తీసిపోయేవిగా ఉంటే ఆ రచయితను నిందించవచ్చనే భయంతో సదరు రచయిత మిగితా రచనలు చదవలేదుట. వేయిపడగల విషయంలో నేను మొదట అదే అనుకున్నాను. కానీ కామకోటి వారి సైట్ లో నా రాముడు చదివాక అలాంటి ఆలోచనలకి దూరంగా నిలవాలనుకున్నాను.

హాహాహూహూ, విష్ణుశర్మ ఇంగ్లిష్ చదువు, మా స్వామి, ఆంధ్ర ప్రశస్తి, ఏకవీర, ప్రళయనాయుడు, చిన్న కథలు ఇప్పటి వరకూ చదివిన ఇతర రచనలు.
2011 లో ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు విజయవాడ వెళ్ళినపుడు, కస్తూరి మురళీకృష్ణ గారు, కోడిహళ్ళి మురళీమోహన్ గారూ, శ్రీకాంత్ గారూ, నేను ఇంకా కుఱచబ్బాయి కౌటిల్య కలిసి విశ్వనాథ గారి ఇంటిని సందర్శించాము కూడా. అక్కడ మురళీకృష్ణ గారూ, మురళీమోహన్ గారి నుండి విశ్వనాథ వారి గురించి మరింత తెలుసుకోగలిగాను.
ఆ ఇంటిని స్మారకం చేయాలని కృష్ణాజిల్లా రచయితల సంఘం వారు ప్రతిపాదిస్తే, అది తిరస్కరించి అక్కడ ఒక ప్రింటింగ్ ప్రెస్ ను నడుపుతూ ఇటివలే విశ్వనాథ వారి జైవిక వారసులు ఆ ఇంటి వద్దే ఉంటున్నారని తెలిసింది. త్వరలో వారి రచనలు అందరికీ అందుబాటులో తెస్తామని మాటిచ్చారట కూడానూ!
ఆ మహానుభావుడి రచనలు జనబాహుళ్యానికి చేరేలా చేయటం ప్రతి తెలుగువాడీ కర్తవ్యం.
కొన్ని కారణాల వలన వారి రచనలు అన్నీ చదవలేకపోయాను.
మిగితా రచనలు కూడా కుఱచబ్బాయి దయతో చదవగలనని ఆశిస్తున్నాను.

Friday, May 11, 2012

వేఁగి క్షేత్రము - విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత


ఏ రాజు పంచెనో యిచట శౌర్యపు పాయసమ్ములు నాగులచవితినాళ్ళ
ఏ యెఱ్ఱసంజలో నెలమి పల్లవరాజరమణులు కాళ్ళఁబారాణులిడిరొ,
చిత్రరధస్వామి శ్రీరథోత్సవములోఁ దెలుగు పిల్లలు కత్తి త్రిప్పిరెపుడొ,
ఏ రెండు జాముల యినునివేడిమి వచ్చి కలసి పోయెనొత్రిలింగ ప్రభువుల,
నాజగచ్ఛ్రేయసంబులై యలరుతొంటి
వేంగిరాజుల పాద పవిత్రచిహ్న
గర్భిత మ్మైనయీ భూమిఖండమందు
నశ్రువులు జార్త్రు జీవచ్ఛవాంధ్రజనులు.
ఇట వేఁగీశుల పాదచిహ్నములు లెవే! లేవుపో! భావనా
స్ఫుట మూర్తిత్వమునైనఁ బొందవు నెదో పూర్వాహ్ణదుష్కాలపుం
ఘటికల్ గర్భమునం దిముడ్చుకొనియెం గాబోలు నీపల్లెచో
టట లోకాద్భుతదివ్యదర్శనమటే యాభోగ మేలాటిదో.
నీయతుల ప్రభావ మహనీయత వేఁగిపురాధిరాజమా!
ఆయతధర్మమూర్తులు మహాత్ములు వారలు బ్రహ్మకోశగో
పాయిత లాంధ్రపల్లవనృపాలురహుంకృతి వ్యాఘ్రగర్జగా
నై యరిలోకభీకర మహాద్భుత శౌర్యరసాకృతిం జనెన్.
ఈ నాపదార్పితక్షోణి నేరాజు ధర్మాసనంబుండి స్మృత్యర్థం పొందెనొ
ఈనాదృగావృతంబైన భూములలోన నేశౌర్యధనులు శిక్షింపఁబడిరొ
ఈ నాశరీరమం దివతళించిన గాలి యెంత పౌరాతన్య మేచుకొనెనొ
ఈ నాతనూపూర్ణ మైన యాకాశమ్ము నే క్రతుధ్వనులు శబ్దించినదియొ
అస్మదజ్ఞాతపూర్వదివ్యత్వ మొప్పు
నీవునీతావనీఖండ మిచట నిలచి
యస్వతంత్ర దొరలు నాయాంధ్రశక్తి
నన్నుఁగంపింపఁ జేయుచున్నది భృశమ్ము.
వేఁగి రాజ్యపు పల్లెవీధుల చెడుగుళ్ళ రిపులఁ గవ్వించు నేరువులు తెలిసి
ఎగురుగోడీబిళ్ళసొగసులో రిపుశిరస్సుల బంతులాడు శిక్షలకు డాసి
చెఱ్ఱాడి యుప్పుతెచ్చిననాడె శాత్రవ వ్యూహముల్ పగిలించు నొఱపుగఱచి,
కోతికొమ్మచ్చిలో కోటగోడల కెగఁబ్రాకి లంఘించు చంక్రమణ మెఱిఁగి
తెనుఁగులంతప్డెయవి నేర్చుకొనియు యుందు
రెన్నగాఁ దెల్గుతల్లులు మున్ను శౌర్య
రస మొడిచి యుగ్గుఁ బాలతో రంగరించి
బొడ్డుకోయని కూనకే పోయుదు రట.
శిలవోలెన్ కదలంగ లేక హృదయస్నిగ్ధార్ద్రసద్భావనా
ఖిల చైతన్యుడనై పురావిదిత వేంగీపూజ్య సామ్రాజ్యగా
ధల యోజించుచు నాంధ్రపల్లవనరేంద్ర శ్రీయశస్త్సంభమున్
బలె నిల్చుంటిన యీ పవిత్ర ధరణీ భాగంబునం దీగతిన్-
ఏ దివ్యపూరుషు లీశాద్వలాంకూరశేఖరమ్ముల లిఖించిరొ! యివెల్ల
ఈ వాయువీచిలో నేయప్సరస్సమాజము నింపిరో గీతిసముదయంబు
ఏ దివ్యశిల్పు లీరోదసీకుహరాన వ్రాసిరో దివ్యశిల్పమ్ము లిన్ని
ఈ పధాంతరమునం దేవురాణమునీంద్రసంతతులో ప్రశంసలు పొనర్త్రు
ఎటఁ గనినఁ బూర్వపల్లవ నృపచరితలె
వ్రాయఁ బడి పాడఁబడి గీయఁబడి యువిన్య
సింపఁబడి శ్రోత్ర పేయమై చెన్నుదాల్చె
నీయతీంద్రియశక్తి నాకెట్టు లబ్బె!
ఈ పొలా లెంతచేవెక్కించుకొన్నవో. గుండె వ్రయ్య సముద్రగుప్తు డడలె
ఈ నేల పావిత్ర్యమెంత కుంభించెనో చిత్రరధ స్వామి సేవలుకొనె
ఇట పల్లవులరాచయెలనాగ లేవ్రతమ్ములు చేసిరో లచ్చి నిలుకడ వడె
ఈ కాశ్యపీఖండ మేశరజ్యోత్స్నలో పిలకించెనో కీర్తి తెలుపులూరె
ఇట నెచట త్రవ్వినను బంగరేనట యది
యెంతశ్రీయొ! యదెంత రాజ్యేందిరయొ ప
దానతనఖాగ్రపాతనిర్యన్నిధాన
మైన యీచోటనుపభోగ్య మయ్యె నేడు.
ఈ పొదలం జరించుచు నహీనమహామహిమానుభావమౌ
నేపురవీధులందొ చరియించుచు నంటి నటంచుఁ భారతం
త్ర్యాపతితుండ నయ్యును పురా మహదాంధ్రమునన్ స్వతంత్రుడౌ
నేపురుషుందనో మనుచు నీ భ్రమ సత్యముగాఁ దలంచుదున్
ఏ పల్లవనృపాలు డెత్తినబావుటా చాళుక్యనృపులరాజ్యంబునందు
ఏ దేశికవిత పాలించినకవిరాజు నన్నయ్య వ్యాకరణంబునందు
ఏయులిఁజెక్కునేర్పులు మహాశిల్పి గోదావరీనదీఘోషయందు
ఏతొంటి తెలుగుల యెక్కువాచారమ్ము బలవ న్నృపుల ప్రాభవమ్మునందు
సమసిపోయెనో -- యున్మత్తసామజంబు
కొలను జొరబడి తమ్మితూడులను పెరికి
వైచెటె యెఱుంగుగాని తత్పద్మగర్భ
కేసరవిమిశ్రమధురసాగ్రియత గలదె?
ఇమ్ముగఁగాకుళమ్ము మొదలీవరకుం గల యాంధ్రపూర్వరా
జ్యమ్ముల పేరు చెప్పిన హృదంతరమేలో చలించి పోవు నా
ర్ద్ర మ్మగు చిత్తవృత్తులఁ బురాభవనిర్ణయమేని నెన్నిజ
న్మములుగాగ నీతనువున్ బ్రవహించునొ యాంధ్రరక్తముల్.
ఇది వినిపింతు నదు మది నెంచెద మిత్రులకున్ గళన్ధగా
ద్గదికము లోచనాంతబహుధాస్రుతభాష్పనదమ్ము స్పందనా
స్పదహృదయమ్ము నాపనికిఁజాలక చేసెడు నన్ను నింతగా
నెద పదిలించుకొన్న దిదియెక్కడి పూర్వజన్మవాసనో!
                                                                                           --విశ్వనాథ సత్యనారాయణ