Saturday, August 16, 2014

నేడే ఫైర్ఫాక్సుకు మారండి, లేదా భవిష్యత్తులో మీరు మిమ్మల్నే కోల్పోగలరు.

1990వ దశకంలో మైక్రోసాఫ్ట్, యాపిల్ ఆగడాలను చవి చూసాము. సాఫ్టువేరు రంగంలో అధిపత్య దాహంతో చిన్న కంపెనీలను ముందు కొంత లాభం చూపించి హస్తగతం చేసుకోటం, ఆపై సదరు కంపెనీ నుండి తీసుకున్న అమూల్యమైన సాఫ్టువేరు ఉత్పత్తిని నిరుపయోగం చేయడం.
ఇక 2000 మొదట్లో ఒక ప్రత్యామ్నాయంగా గూగుల్ వచ్చినప్పటికీ, అది కూడా మైక్రోసాఫ్ట్ బాటనే పట్టింది. అయితే మైక్రోసాఫ్ట్ సందర్భంలో ప్రత్యామ్నాయాలు తక్కువ, వాఅటి గురించి జనాలకు తెలిసే అవకాశాలూ తక్కువే. అందువలన మైక్రోసాఫ్ట్ పెద్ద మేధస్సును ఉపయోగించకుండానే నిలదొక్కుకోగలిగింది.
మైక్రోసాఫ్ట్ వాడి ఉత్పాదనలు, సాఫ్టువేర్లు, మనల్ని వాడి మీద ఆధారపడేలా చేస్తాయి. ఉదాహరణకి వైరస్ వచ్చే అవకాశం మైక్ర్రోసాఫ్ట్ సరుకులో చాలా ఎక్కువ. ఇన్నేళ్ళ అనుభవంలో ఏ ఇతర కంపెనీ అయినా ఆ వైరస్ ల బారిన పడకుండా తమ సరుకును మెఱుగు పరుస్తాయి. కానీ మైక్రోసాఫ్ట్ ఆ పని చెయ్యలేదు, సరి కదా, యాంటి వైరస్ కంపెనీల మార్కెట్ ను సృష్టించింది. ఫలానా వైరస్ ఉంది అని ఫిర్యాదు వస్తే ఫలానా యాంటి వైరస్ కొనుక్కో అని సమాధానం ఇచ్చేది. ఏ యాంటి వైరస్ సాఫ్టువేరూ వేసుకోకపోతే ప్రమాదం అని హెచ్చరించి, వాడికి లాభం చేకూర్చే యాంటివైరస్ కంపెనీలను సూచించేది.
ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే, లోతుగా వెళితే ఇంకెన్నెన్నో.
గ్నూ/లినక్స్ విప్లవం వచ్చి స్వేచ్ఛా సాఫ్టువేర్ల వాడకం పెరిగినా ఇంకా ఎందరో మైక్రోసాఫ్ట్ ఉచ్చులో బంధీలుగానే ఉన్నారు.
ఇక యాపిల్ అయితే మరీ ఘోరం, మనకి నచ్చిన హార్డువేరు కొనుక్కునే సదుపాయం కూడా ఉండదే! ఏదయినా సాఫ్టువేరు ఉపకరణం ఆడించాలన్నా కాసులు విదల్చాల్సిందే!
గూగుల్ వాడు వీళ్ళకన్నా మేలేమో అనుకుంటే అదీ కాదాయె!
గూగుల్ వాడు చాలా తెలివయిన జిత్తునక్క వేషాలు కలవాడు.
మనకు తెలీకుండానే మన మెయిల్స్, ప్లస్ పోస్టులు, బ్లాగు పోస్టులు, చాట్ మెసేజులు, అన్నీ, ఇది పబ్లిక్, ఇది ప్రయివేట్ అనే వ్యత్యాసం లేకుండా అన్నిటినీ దాచుకుంటున్నాడు. వాటిని పలు విధాలుగా వాడుకుంటున్నాడు. మన బాహ్య-వెలుపల-గుప్త జీవితాల చిట్టా గూగుల్ వాడి చేతుల్లో ఉంది. ప్రభుత్వాలడిగితే ప్రభుత్వాలకి, డబ్బులు విసిరే బడా కంపెనీలకీ ఈ సమాచారం ఎటువంటి కరుణా లేకుండా నిర్దాక్షిణ్యంగా పంచిపెడుతున్నాడు. అది పొందిన గవర్నమెంటులు తమకు ముప్పు ఉన్న మనుషులను పట్టుకుని శిక్షిస్తున్నారు, ఇంటలిజెన్స్ రిపోర్టులు రూపొందిస్తున్నారు సరే! కానీ అదే సమయంలో ఎందరో వ్యక్తులను వ్యక్తిగత విషయాల గూర్చి హింసించి, శిక్షిస్తున్నారు - ఇది గమనార్హం. ఇక బడా కంపెనీల సంగతి సరేసరి. మనకు తెలీకుండానే మన మెయిల్స్ లో మెయిల్లోని పాఠ్యానికి సంబంధించిన వాణిజ్య ప్రకటన దర్శనమిస్తుంది. మన మెయిల్లోని సమాచారం (అది గూగుల్ వాడు చదువుతాడా లేదా అన్నది తరువాతి విషయం) చూసి, తగ్గ ఆడ్స్ వేసే ప్రోగ్రాములు గూగుల్ వాడి దగ్గర కోకొల్లలు.
ప్రస్తుతానికి చాలా మంది గూగుల్ వాడి ప్రోడక్ట్స్ అన్నీ వాడడం లేదు కాబట్టీ చాలా సమాచారం గూగుల్ వాడికి అందడం లేదు. అందుకనే పొద్దస్తమానమూ గూగుల్ క్రోం వాడు, యూట్యూబ్ వాడు, జీమెయిల్ వాడు అని వాడి సొద.
ఒకవేళ గూగ్ల్ క్రోం వాడి జీమెయిల్ ఉపయోగిస్తే, గూగుల్ వాడికి మన మెయిల్స్ లోని సమాచారం గోప్యంగా మరింత త్వరిత గతిన చేరే అవకాశాలు ఉంటాయి.
గూగుల్ నేడు ఆండ్రాయిడ్ ను పోషిస్తోంది - ముబైల్ రంగంలో అద్దే అగ్రగామి.
క్రోం - మనకు తెలీకుండానే ఎందరమో దీనినే అప్రమేయ విహారిణిగా వాడుతున్నాము.
జాలశోధన, యూట్యూబ్,మెయిల్స్, డాక్స్ (డ్రైవ్) - ఇవీ మనమంతా వాడేస్తున్నాం, ఆయా విషయాలలో అవే అగ్రగామిలూను.
అందాకా బాగుంది. ఇవి అత్యంత ప్రజాదరణ పొందాక ఏమవుతుంది?
ఏమవుతుందీ, గూగుల్ సరుకు తప్ప ఇతరత్రా మన కళ్ళకు కనిపించవు.
మైక్రోసాఫ్ట్ మార్కెట్ లో ఉన్నపుడు ఎందరో కొందరికి రెడ్ హ్యాట్, ఫెడోరా, డీబియన్, ఉబుంటూ, యాపిల్, సొలారిస్ ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలుసు. పని వద్దో కాలేజీలోనో వాడే వారు కూడా.
కానీ ఆండ్రాయిడ్ కు ప్రత్యామ్నాయం సయనోజెన్ మాడ్, ఫైర్ఫాక్స్ఓఎస్ మొ॥ ఉన్నవని ఈనాడు చాలా మందికి తెలీదు.
క్రోం స్థానే ఫైర్ఫాక్సును వాడటానికి జనాలు సుముఖత చూపలేకపోతున్నారు. క్రోం కన్నా ఫైర్ఫాక్స్ వేగవంతం, పైగా అంతర్జాల వాడుక లేనప్పుడు ఫైర్ఫాక్స్ జాలంతో సంపర్కం చెయ్యదు.  ఈ విషయం కనిపెట్టాలంటే ఒక నెల పొర్తిగా క్రోం ని, ఒక నెల పూర్తిగా ఫైర్ఫాక్సునే వాడి ఇంటర్నెట్ వాడకంలో తేడాలు గమనించండి. కేవలం జీమెయిల్, గూగుల్ సెర్చ్ మొ॥ గూగుల్ సరుకు కొంత వేగవంతంగా క్రోం లో ఆడినట్టు మనకు భ్రమ కలుగుతుంది. నిజానికి అలా జరుగదు.
ఇక జాలశోధన సమయంలో మన వ్యక్తిత్వానికి మన శోధనలను ముడిపెట్టే  గూగుల్ శోధన చాలా అసహ్యమయిన చర్యలను మన శోధనాధారంగా చేస్తోంది - అవి మనకు తెలీవు.
డక్‍డక్‍గో లాంటి శోధనయంత్రాలు మన శోధన ను పసిగట్టవు, మనకు ఇబ్బందులూ చేపట్టవు.
యూట్యూబ్ వల్ల జరిగే మేలు కన్నా నష్టమే ఎక్కువని ఈ మధ్యనే చూసాము కూడా. కొన్ని కంపెనీలు పైరసీ విరుద్ధ చట్టాలు రూపొందించి త్యాగయ్య కృతులనే కాపీరైటులో చూపిన వైనం ఈ అంధ్య పెద్ద దుమారమే రేపింది.
డాక్స్, లేదా డ్రైవ్ కి ప్రత్యామ్నాయంగా ఎన్నో సేవలు జాలంలో కలవు, జోహో అనే భారతీయ కంపెనీ కూడా గూగుల్ డాక్స్ లా వర్డ్, స్ప్రెడ్ షీట్, ప్రెజెంటేషన్ ఆన్లైనులో చేసుకునే సేవలను అందిస్తుంది.
మన నుండి ఎంత తక్కువ అయితే అంత తక్కువ సమాచారం జాలంలోకి చేరేలా జాగ్రత్త తీసుకోవాలి, లేదా మీరు ఎవరూ లేని సమయంలో వ్యక్తిగతంగా ఏవో కొన్ని వీడియోలు యూట్యూబులో చూసారు, అందరి ముందు, ఏదో కాన్ఫరెన్సులో ఏదో వీడియో యూట్యూబులో చూపించాల్సి వచ్చింది, ఆ వీడియో అయిపోయిన వెంటనే సజెస్టెడ్ వీడియోస్ అంటూ అంతకు ముందు మీరు చూసిన వీడియో కు సంబంధించిన మరిన్ని నలుగురు ముందూ యూట్యూబ్ చూపెట్టింది - ఇది అసలు ఊహించగలమా?
అలానే ఏదో  వివాదాస్పద జాలస్థలి (వెబ్సైట్) ఉంది. మీరు స్నేహితుల ముందు సెర్చ్ చేసారు, ఫలానా జాలస్థలిని మీరు ఫలానా తేదీన చూసారని వస్తుంది - ఎంత ఇబ్బంది?
ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి, వినియోగదారుడికి మరింత మెఱుగైన సేవలు అనే నెపంతో ఆయా జాలస్థల సేవలు అనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను చాలా వరకూ మన వద్ద నుండి రాబట్టి దుర్వినియోగం చేస్తున్నాయి. మన వ్యక్తిగతత్త్వాన్ని మనమే వారికి ఇవ్వాళ చేరవేసి రేపు బాధపడే సందర్భాలను కావాలనే ఏర్పరుచుకుంటున్నాము.
దీనికి స్వస్తీ పలకాలంటే అలాంటి శోషణకు స్థానంలేని సేవలను ఉపయోగించవచ్చు.
ఇవ్వాళ ఆఫ్లైనులో గూగుల్ డాక్స్ వాడాలంటే క్రోం లోనే సాధ్యం ఐ గూగుల్ వాడు ప్రకటించాడంటే దానర్ధం, ఆఫ్లైన్ ద్వారా క్రోం ని మన మొత్తం కంప్యూటర్ లోకి జొరబడే అవకాశాన్ని మన ద్వారానే ఇప్పించాలని చూడటం, ఇక దీని పర్యవసానం జనాల ఆలోచనలకే వదిలివేస్తున్నాను.
ఆండ్రాయిడ్ ద్వారా ఎన్నో కంపెనీలను నిబంధనలు మార్చి వాడుకరుల సమాచారం రాబట్టే ప్ప్రయత్నం గూగుల్ పెద్ద యెత్తునే చేబడుతోంది కూడా.
మరి దీనిని ఎలా ప్రతిఘటించడం?
ప్రత్యామ్నాయాలను వాడడం ద్వారా!
గూగుల్ క్రోం ను వాడడం మానేయడం! మీ స్నేహితుల ద్వారా మానిపించడం.
లేదా గ్గూగుల్ విజృంభణలో అందరూ బలి కావాల్సిందే!
ఫైర్ఫాక్సును వాడండి. గూగులు, మైక్రోసాఫ్ట్, యాపిల్ లా కాకుండా ఫైర్ఫాక్స్ కేవలం ఔత్సాహికుల ద్వారా ఏనాటికానాడు మెరుగు పరచబడుతుంది కూడా. అందరికీ జాలం అన్న నినాదంతో ముందుకు వెళుతున్న మొజిల్లా ఫైర్ఫాక్స్ మన భారతీయతను ఆదర్శంగా తీసుకుంది కూడా.
వేరే ఏ బడా కంపెనీలు మనల్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలనుకున్నా, మొజిల్లా మాత్రం అందుకు చాలా దూరం :)

Tuesday, July 29, 2014

తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా కవితలు, పాటలకు ఆహ్వానం

నమస్కారం

తెలుగు భాష గొప్పదనమేమిటో తెలిపే పాటలు మనకు అత్యల్పం. మన స్థానిక ప్రముఖులెందరో ఉన్నా, వారి గురించి మనకు తెలీదు. (ఉదాహరణకి ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి గురించి కడప వారికీ, పట్టాభి సీతారామయ్య గురించి కృష్ణా జిల్లా వారికీ  తరం చాలా మందికి తెలీదు) ప్రాంతీయ ఆట-పాటలు, పండుగలు-పిండి వంటల గురించి తెలిపే తెలుగు పాటలు చాలా అరుదు. 
సురవరం ప్రతాప రెడ్డి ఎవరు అంటే చెప్పలేని దుఃస్థితి. బాపిరాజు బొమ్మలు ఎరుగని బ్రతుకులు. 
ఇదంతా ఎందు వలన? సాహిత్యం ద్వారా ప్రచారం లేకపోవటం వలన ఒక కారణం. పుస్తకాలలో విరివిగా మనకు ఈ జ్ఞానం లభించినా సినిమా పాటల ద్వారా లేదా మంచి రాగంలో ఉన్న పాటల ద్వారానే మనం ఈ విషయాలను జనాల్లోకి సమూలంగా తీసుకువెళ్ళవచ్చు, 

అందుకని నా అభ్యర్థన ఏమిటంటే, వచ్చే ఒక వారం రోజులలో తెలుగు ప్రముఖులు-ప్రదేశాలు-సంస్కృతి ప్రతిబింబించేలా నిందా స్తుతి చెయ్యని పాటలు / కవితలు వ్రాసి పంపగలరు. వీటిని తగు విధంగా ప్రచారం చేసే ప్రయత్నాలు నా వంతుగా చేస్తాను.
పంపవలసిన మెయిల్ చిరునామా : nani1only@gmail.com
ధన్యవాదాలతో
రహ్మానుద్దీన్ షేక్

Monday, July 28, 2014

ఈదుల్ ఫిత్ర్

ప్రపంచంలో గల అన్ని మతాల వారూ, విశ్వాసాల వారూ ఏదో/ ఒక పండగో పబ్బమో చేసుకుంటూంటారు. మొహమ్మదీయులు కూడా సంవత్సరం పొడవునా ఏదో ఒక పండుగ చేసుకుంటూ ఉంటారు - బక్రీద్, మొహమ్మద్ ప్రవక్త (సఅసం) పుట్టిన రోజు, మొ॥ అయితే ఈ అన్ని పండుగలలో రెండు ముఖ్యమైనవి, వీటిని ఈద్ అంటారు. ఈద్-అల్-ఫితర్, ఈద్-అల్-అజ్‍హా. ఈ రెండు రోజులూ పూర్తి పండుగ వాతావరణంలో సంతోషం మరియు ఉల్లాసభరితంగా జరుపుకోమని దేవుడే(అల్లాహ్) స్వయంగా కుర్ఆన్ ద్వారా తెలిపారు.
మానవాళికి మార్గదర్శకంగా ఉండేందుకు దేవుడు కుర్ఆన్ ను రంజాన్ నెలలోనే అవతరింపచేసాడు. ఇదే నెలలో మొదటి సారి వెలుగు కూడా ఉద్భవింపబడింది. భౌతిక వెలుగు లేనిదే మనిషి ఏమీ చూడలేడు. భావాత్మక వెలుగు లేనిదే మనిషి మంచి-చెడు వ్యత్యాసం చూడలేడు. కుర్ఆన్ అవతరణకు ముందు మనిషి పూర్తి అంధకారంలో ఉండేవాడు. కుర్ఆన్ అవతరణ ద్వారా ఈ భావాత్మక వెలుగు మానవాళికి ప్రసరించింది. కుర్ఆన్ అవతరణ సమయానికి మానవ సమాజం చాలా అస్తవ్యస్తంగా ఉండేది. ఒక మనిషి మరో మనిషిని బానిసగా వాడుకునే వాడు. కార్మిక కర్షకుల రక్తాన్ని జెలగల్లా పీల్చే వారీ యజమానులు. మొహమ్మద్ ప్రవక్త(సఅసం) ద్వారా మానవత్వాన్ని బంధించిన ఈ సంకెళ్ళను తెంపెయ్యాలనుకున్నాడు అల్లాహ్. ఈ సంకెళ్ళలో మొదటిది అజ్ఞానం, మూఢనమ్మకాలు. గర్జిస్తున్న మేఘాలు, ఉరుముతున్న ఉరుములు, మెరుస్తున్న మెరుపులు, వేడితో చంపేసే వడగాలులు, సుడిగుండాలలో ముంచెత్తే నదులు - ఇవన్నీ దేవుడి రూపాలే అనీ, వీటికి మొక్కటం, డబ్బు ఖర్చు చేసి విందులు తినిపించడం లాంటివి చేసేవాడు. వాటి ముందు మోకరిల్లి సజ్దా చేసేవాడు, పూజించేవాడు. నర బలులు ఇచ్చి ఆ దేవతలను సంతృప్తి చేసుకునేవాడు. కుర్ఆన్ ద్వారా ఈ మూఢనమ్మకాలను అణిచివేసి ఇస్లాం ధర్మాన్ని శాంతి సూచకంగా మానవాళికి మొహమ్మద్ ప్రవక్త(సఅసం) ద్వారా అందించాడు అల్లాహ్.
ఈ మూఢ నమ్మకాలు రూపుమాపటంతో పాటే మానవ సమాజం సక్రమంగా ఉండేలా వ్యవస్థీకృతమయినది ఇస్లాం.
రంజాన్ నెల రోజుల పాటూ మొహమ్మదీయులు పగటి పూట భోజనం చేయకుండా కుర్ఆన్ పఠనం, దైవారాధనలో నిమగ్నులై ఉంటారు. ఆకలి దప్పికలలో బీద వారు అనుభవించే బాధను ప్రతి మొహమ్మదీయుడూ అనుభవిస్తాడు. ఆ అనుభవం ద్వారా పేద వారికి సహాయం చెయ్యాలనే భావన గుండె లోతు నుండి కలుగుతుంది. రంజాన్ నెల లో జకాత్ ఇవ్వడం, ఫిత్రా ఇవ్వడం ఇందుకు ఋజువులు.
ఫిత్రా అనేది ఇంటి పెద్ద పేద వారికి విధిగా రంజాన్ ఆఖరి రోజు తరువాత వచ్చే ఈదుల్-ఫితర్ నమాజ్ కు ముందుగా ఇవ్వాల్సి ఉంటుంది, ఇంటిలో ప్రతి సభ్యునికీ 2.25 కేజీల బరువు ఆహార ధాన్యాలు లేదా తత్సమానమయిన ధనాన్ని ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక జకాత్ అనేది ప్రతి ఆదాయం కలిగిన వ్యక్తి విధిగా సమర్పించవలసిన ఆదాయపు దానపు భాగం, 1000 రూపాయలకు 25 రూపాయల చప్పున లెక్కించి సంవత్సర ఆదాయంలో ఆ భాగాన్ని పేదవారికి ఇవ్వాల్సి ఉంటుంది.
ఇవి అయ్యాక పండగ పూట ఉదయాన్నే దేవుడికి రంజాన్ అందించినందుకు కృతజ్ఞతతో ప్రార్థనలు చెయ్యాలి.
ప్రార్థనల అనంతరం మొహమ్మదీయుల గృహాలలో షీర్-ఖుర్మా అనబడే విశేష వంటకం వండబడుతుంది. ఇది పాల పాయసంలో రకరకాల డ్రై ఫ్రూట్స్ కలిపి చేయబడుతుంది.
రోజంతా బంధువులు, స్నేహితులు, ఒకరినొకరం కలిసి, శుభాకాంక్షలు తెలిపి, ప్రీతిభోజనాలు జరుపుకుంటారు.
దానముల గొప్పతనాన్ని తెలిపే ఈదుల్ ఫిత్ర్ ని సంతోషంగా జరుపుకుందాం!

Thursday, July 17, 2014

"తెలుగు భాషకు ప్రాచీన హోదా వలన ఒరిగిందేమన్నా ఉందా?" అన్న ప్రజ లోని చర్చకు నా ఆలోచనలు

యాదృచ్ఛికంగా తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా నా తరఫున ఏం చెయ్యవచ్చు అన్న సందర్భంలో ఈ చర్చ నాకు తారసపడడం జరిగింది.
ఆ చర్చ పై నా విమర్శ వ్రాసే ముందు, అందరికీ ఒక విన్నపం
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా భావ గీతాలు వ్రాసి నా మెయిల్ ఐడీకు పంపగలరు. పాటకు కావాల్సిన అంశం - తెలుగు ప్రముఖులు, తెలుగు ప్రదేశాలు, తెలుగు విశేషాలు. మీ ప్రాంతం (జిల్లా-గ్రామ) స్థాయిలో ప్రసిద్ధులైన వ్యక్తుల గురించి తెలుసుకొని, మీ ప్రాంతంలోని ప్రముఖ ప్రదేశం గురించి తెలుసుకొని, మీ ప్రాంతపు వంటకాల గురించి తెలుసుకొని, ఇంకా ఇతర సాంస్కృతికాంశాల గురించి తెలుసుకొని, ఏవయినా పుస్తకాలు లభ్యమయితే చదివి. ఆపై ఆ విషయమై కవితలు/పాటలు/వ్యాసాలు వ్రాసి nani1only@gmail.com కు వేగు (విద్యుల్లేఖ) పంపగలరు.

ఇక పోస్టులో చెప్పబదిన విషయాల గురించి :
తెలుగు భాషా విశిష్ట కేంద్రం అనేది తెలుగు వారి సొత్తు. అది ప్రాంతాలకతీతం. ఆంధ్ర-తెలంగాణలకన్నా, ఈ రాష్ట్రాల వెలుపల ఒక అంచనా ప్రకారం అంతే మంది తెలుగు మాట్లాడే వారు నివసిస్తున్నారు[నిరూపణ అలభ్యం]. అంటే తెలుగు వారి కోసం నెలకొల్పే సంస్థకు తెలుగు వారికీ కచ్చితంగా భౌతిక సంబంధం అనవసరం. అరవ వాళ్ళు నెలకొల్పుకున్న తమిళ్ వర్చువల్ యూనివర్సిటీ తరహాలో ఒక పూర్తి ఆన్లైన్ లో పని చేసే సంస్థను నెలకొల్పుకోవాలి. అలా చేసిన వాళ్ళం మనమే మొదటి వాళ్ళం కావచ్చును కూడా. ఇక నిధులూ గట్రా ఏమయినా ఖర్చు చెయ్యాలంటే అంతర్జాలం కంప్యూటర్ అందుబాటులో లేని వారికి అవి అందించే ప్రయత్నాలకు వాడాలి. స్వామి కార్యం స్వకార్యమూ నెరవేరుతాయి. కాదూ లేదూ ఒక గుమస్తా కచేరీ కావాలంటే రెండు పెట్టుడు కార్యాలయాలు రెండు ప్రాంతాల్లో పెట్టుకోవచ్చు. మిగితా ప్రభుత్వ కార్యాలయాల సంగతేమో కానీ, విశిష్ట భాషా కేంద్రం ఒకవేళ కన్నడ, అరవం, ఓఢ్రం లా స్థాపిస్తే ఆ రెండు ప్రాంతాల కచేరీల్లో సందడే సందడి. తిరుమలకు మించిన కోలాహలం.
కేంద్రప్రభుత్వ వాటాలో 100 కోట్లు విడిగా కేవలం భాషాభివృద్ధికి ఖర్చు పెట్టేందుకు విడుదల అవుతున్నాయి. రాష్ట్ర బడ్జెట్ లో సంక్షేమ పధకాల సరసన ఏనాటికీ భాషాభివృద్ధి సరితూగలేదు. ఏ నాయకుడికీ భాషాభివృద్ధి అత్యావశ్యక అంశం కాదు కాబట్టీ. పైగా మొత్తం తెలుగు వారికీ జవాబుదారీ పుచ్చుకున్న కొద్ది మంది మధ్య తరగతి తల్లిదండ్రులు స్కూళ్ళేంటి, ఇళ్ళేంటి, ఆఖరుకి ఏడుపు కూడా ఆంగ్లంలోనే ఏడవమని పిల్లలని ఉరుముతున్నారు. వీరే ప్రభుత్వానికి మార్గదర్శకం చేసేవారూను. ఈ నాయకులంతా వాళ్ళకి నిష్పూచీ - ఏనాటికీ ఆంగ్లానికి పైచేయిగా తెలుగును ఒప్పుకోరు.
అందువల్ల పై నుంచి వచ్చిన డబ్బు అయితే సక్రమంగా ఖర్చు అయ్యే   అవకాశాలు ఎక్కువ కదా!
సాహిత్య అకాడమీ పుస్తకాలనే తీసుకోండి. ఇక్కడ బెంగుళూరులో అన్ని భాషలకన్నా అతి తక్కువ పుస్తకాలు తెలుగువే, పైగా ఒక సారి ముద్రణ పొందిన పుస్తకాలకు మళ్ళీ మోక్షం లేదు. ఆ డబ్బు ప్రభుత్వం ఖర్చు పెట్టే బదులు పాత పుస్తకాల పునర్ముద్రణకు ఏ సంస్థకు అప్పగించినా కొందరికి ఉపాధి, నాలాంటి వారికి ఆ పుస్తకాల అందుబాటూ కలుగుతాయి. తెలుగులో ప్రారంభ స్థాయి-బాలసాహిత్యం-ఇతర భాషల నుండి తెలుగులోకి అనువాదాలు చాలా తక్కువ. ఇవి లేనిదే తెలుగు మీద ఆసక్తి కలుగదు, ఇవి మొట్టమొదట రూపొందించాల్సినవి!
ఇవి లేకుండా ఎన్ని విశ్వవిద్యాలలో పీఠాలు ఏర్పరిచినా లాభం లేదు.
అయినా ఎంత కాడికీ ప్రభుత్వం ఏదో చేసిపెడుతుంది, చేసిపెట్టాలి అన్న ధ్యాసే కానీ, సామాన్యులుగాఅ మనం తెలుగుకు ఏం చేయగలము, భాషను ప్రాచీన భాషగా చూసేందుకు ఏం ఏం ఋజువులున్నాయి అన్న సంగతి సామాన్యుడికి పడుతుందా? అసలు ఇలాంటి విషయాలు తెలుసుకోడం సామాన్యుడికి ఎంతవరకూ అవసరం?
నేడు అంతర్జాలం వాడుతున్న వారు ప్రధానంగా ఆంగ్ల మాధ్యమంలో నిత్యం సంభాషణలు జరిపే వారు కాబట్టీ మనకు పెద్ద ఇబ్బంది కనిపించడం లేదు. కానీ ఈ సంఖ్య అసలు తెలుగు వారి సంఖ్యలో అత్యల్పం అనీ మనం గుర్తించం అది మన అజ్ఞానం. దాదాపు 95% మంది ఇంకా తెలుగులోనే ఆలోచిస్తారు, కూడికలు, తీసివేతలూ చేస్తారు. వీరంతా అంతర్జాలం వాడాలంటే తెలుగులో సమాచారం అంతర్జాలంలోకి వాడుకునే రీతిలో‌(యూనికోడ్)లోకి రావాలి. ఇతర భాషల వారు చెయ్యలేనిది తెలుగు వారు చేసి చూపించే అవకాశం చాలానే ఉంది. ఇంక ఏ భారతీయ భాషలో లేనంత సాహిత్యం జాతీయంగా తెలుగులో ఉంది. అదంతా అంతర్జాలానికి వికీసోర్స్ లాంటి వేదికల ద్వారా తరలించగలిగితే ఆ 95% మందికి కాస్త ఊరట కలుగుతుంది. మనందరి కసరత్తు ఈ దిశలో ఉండాలి. ఇక ఇవన్నీ బాహ్య సౌందర్యాన్ని పెంచుతాయి, కానీ లోలోపలి భావ సౌందర్యం పెంచాలంటే?
తెలుగు భాషా వైభవాన్ని తెలిపే పాటలూ, కథలూ, కవితలూ జనాల నరనరాల్లోకి వెళ్ళాలి. భాషాభిమానం అనేది ప్రతిఒక్కరికీ ఉండాల్సిన గుణం. భాషలేందే భావమే లేదు కదా!

ఇక వ్యాఖ్యలలో వ్రాసిన అంశాలపై నా ఆలోచనలు :
అసలు తెలుగు భాష ప్రాచీనమా అనే విషయంలో ఎన్నో తగాదాలు ఉన్నాయి. వేరేవారికి ఈ హోదా దొరికింది కాబట్టి మనకూ కావాలని అర్రులు చాచడం వ్యర్ధం. అలాగే ప్రాచీన భాషగా కాక ఆధునిక భాషగా పోసిషన్ చేస్తే మంచిదా అన్న ఆలోచనను తేలిగ్గా కొట్టేయలేము.
వేరే వారికి దొరికిందన్న సందర్భంలో మనమూ అడిగామన్నది చర్చనీయమే కానీ నిజంగానే తెలుగు ప్రాచీనమా కాదా అని ప్రశ్నించుకుంటున్నామంటే అది మన అజ్ఞానమే, హాలుడి గాథా సప్తశతి నాటికే తెలుగుందని మనకు తెలియవస్తుంది. కొత్తె యుగం 500 నాటికే తెలుగు ఉందన్న నిరూపణలు కలవు.  1000 కొ.యు. నాటికి నన్నయ్య వాగనుశాసనం వ్రాయగలిగాడంటే అప్పటికే తెలుగు పూర్తి వాడుకలోకి వచ్చేసింది. తెలుగు ఎంత అభివృద్ధి చెందిన భాష అంటే దక్షిణ భారత శాస్త్రీయ సంగీతపు రాగాలకు ఏ రాగానికైనా తగిన పదాలతో వినసొంపుగా సాగే భాష మనది, అంతగా భాషలోని పదాలు అభివృద్ధి చెందాయి అంటే ఏనాటి నుండీ భాష అభివృద్ధి చెందుతూ వస్తుందో అంచనా వెయ్యడమే కష్టం. నేటికీ కావ్యాల సంఖ్యలో కానివ్వండి, గద్య-సాహిత్యాల పరంగా చూడండి, లిపి అభివృద్ధి పరంగా చూడండి తెలుగు చాలా పరిణామానికి గురి అయిన భాష-ఈ విషయాన్ని ఎవ్వరూ కాదనలేరు. ఇక తెలుగు పూర్తి ఆధునిక భాష కూడా! ఏ శబ్దాన్నైనా తెలుగులో ఆ భాష మాతృక కలవారు పలికే విధంగా వ్రాసే అవకాశం ఉంది! (భారతీయ భాషా లిపుల మీద నేను గమనించిన చిన్న విషయం)
ప్రభుత్వ రంగ బడ్జెటులను గమనిస్తే వంద కోట్లు పెద్ద మొత్తం కాదు. ఉ. చౌక బియ్యం పథకానికి రెండున్నర వేల కోట్లు కేటాయింపులు ఉన్నాయి. కేంద్రం ఇవ్వకపోయినా వంద కోట్లు పెట్టుకోలేనంత బీద స్థితిలో ఎవరూ లేరు.
 కానీ భాషాభివృద్ధికి ఖర్చుపెట్టే విధానం ప్రభుత్వం వద్ద లేదు. ఎలా ఖర్చు పెట్టాలో ప్రభుత్వానికి తెలీదు. ఏం విషయమై ఖర్చు పెట్టాలో తెలీదు. భాషాభివృద్ధికి ప్రభుత్వ పరంగా ఏం చేయవచ్చో అన్న విధి విధానాలు లేవు.
సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (లేదా ఇంకో అందమయిన పేరు) అంటూ భవనాలకు ఇతర హంగులకు ఖర్చు పెట్టడం ప్రభుత్వాలకు మాంచి సరదా. ఉచిత పబ్లిసిటీ, ఏదో సాదించామన్న ఊకదంపుడుతో బాటు కాంట్రాక్టర్లకు వడ్డింపులు ఉంటాయి మరి. ఆయా సంస్థలలో ఎలాంటి పరిశోధన జరగాలి, వాటి ద్వారా వచ్చే ప్రయోజనం ఏమిటి అనే విషయాలపై ఎవరికీ ధ్యాస ఉండదు.
ఈ విషయమై తెలుగు బ్లాగరులు, జాలరులకు మంచి అవకాశం ఉంది. అంతర్జాలం వేదికగా ప్రభుత్వానికి ధీటుగా ఇలా కూడా భాషాభివృద్ధికి తోడ్పడవచ్చా, ఔరా!, అని అనుకునేలాంటి పనులు మనమే చేసి చూపవచ్చు. అదీ సున్నా ఖర్చుతో.
తెలుగు భాష పునరుజ్జీవనం అంశంలో ఎంతో కృషి చేయాల్సిన అవసరం ఉంది. అందుకు భాషాభిమానులు, పండితులు మరియు భాషాశాస్త్ర నిపుణులు (linguistic experts) కలిసి మేధోమధనం చేయాలి.
నేను ఈ విషయంతో ఏకీభవిస్తున్నాను.
లిపి/వ్యాకరణ సంస్కరణ, నిఘంటువులు, భాషా సరళీకరణ, మరుగున పడ్డ తేటతెలుగు పదాలను తిరిగి వాడకంలో తీసుకురావడం, పద్య రచన పునర్వైభవ ప్రాప్తి, కోల్పోయిన పద్య/గద్య సంపద పునర్నిర్మాణం, చేతిరాతల (manuscripts) స్కానింగ్/డిజిటల్ లైబ్రరీ, కంప్యూటర్/కీబోర్డు వ్యవస్థ లాంటి స్తూలాంశాలను (broad headings) ముందుగా గుర్తించాలి. ప్రతిదానిలో కొన్ని కొన్ని ముఖ్యమయిన సూక్ష్మ పరిశోదనా విషయాలను (specific research outline) ఖరారు చేయాలి. ఆయా పరిశోధనల లక్షాలు, మానవ & ధన వనరులు, కాల పరిమితి వగైరా విషయాలను రికార్డు చేసుకోవాలి.
లిపి/వ్యాకరణ సంస్కరణ : తెలుగులిపి చాలా వరకూ తాళపత్రాలపై త్వరగా వ్రాసేందుకు అనువుగా రూపుదిద్దుకుంది. అందరిలో బాగా జీర్ణించుకుపోయిన అంశం. ఇది మారాలంటే క్షేత్ర స్థాయిలో ప్రక్షాళన జరగాలి. అరవంలో ఇలా రెండు పర్యాయాలు జరిగింది. మొదట అరవంలో లేని వర్ణాలన్నీ (శ, విసర్గం, క-ఖ లకు 1,2 ద్వారా తేడా మొ॥) స్వాతంత్ర్యం వచ్చిన కొత్తలో భాషా నిపుణుల ద్వారా చేర్చబడ్డాయి, ఇవి జీర్ణించుకునేందుకు దాదాపు మూడు తరాలు పట్టింది, వెంటనే అన్నా దురై నుండి వచ్చిన సంస్కృత-హిందీ వ్యతిరేక ఉద్యమం వలన ఇవి మళ్ళీ లుప్తాక్షరాలుగా చెయ్యాలి అనీ, అంతకు ముందు వాడిన వర్ణాలనే వాడాలనే నిర్ణయం జరిగింది. ఇప్పటికీ ఈ అంశం వారిలో చాలా అయోమయాన్ని నింపుతుంది. అంతర్జాలమే అన్నీ అని నమ్ముతున్న నేటి తరానికి ఇది అవరోధం కాదు. తెలుగులిపి కష్టతరం అనుకునే వారు పూర్తి రోమన్ లిప్యంతరీకరణ వాడుతున్న రోజులివి. ఈమాట లాంటి జాలస్థలాలు RTS లో చదివే విధానాన్ని అదనంగా ఇస్తున్నాయి. లిపి పరంగా సంస్కరణలు తేవాల్సిన అగత్యం అయితే లేదు. ఇక వ్యాకరణ పరంగా ఏ విధమైన సంస్కరణలు రావాలని చూస్తున్నదీ వ్యాఖ్య రచయిత తెలుపలేదు.
నిఘంటువులు : ఇవి అత్యంత అవసరం. పారిభాషిక పదకోశాలు, మాండలిక పదకోశాలు, యాస పదకోశాలు, బూతుల పదకోశాలు, సాంకేతిక నిఘంటువులు రూపొందించడమే గాక అన్ని రకాలుగా (అంతర్జాలంలో, పుస్తకాలుగా, దృశ్యక శ్రవ్యకాలుగా) అందుబాటులోకి తేవాలి.
భాషా సరళీకరణ : తెలుగు ఇప్పటికే సరళమయిన భాష. కానీ ఎందరో సంస్కృత మోహం కలిగిన పండితుల వలన సాహిత్యంలో తేట తెలుగు మాటలు చోటు చేసుకోలేక పోయాయి. సినిమాలు ఈ విషయంలో నిరాశను ఇస్తున్నాయి. అందువలన సరళ పదాలతో సాహిత్యం రావాల్సిన అవసరం ఉంది. ప్రారంభ స్థాయి సాహిత్యం ఉండటం ఆ భాష నిలకడకు ఉపకరించే ప్రధాన తొలిమెట్టు, తెలుగులో చాలా తక్కువ ప్రారంభ స్థాయి సాహిత్యం ఉంది. ఇది బాగా అభివృద్ధి చెందాలి.
మరుగున పడ్డ తేటతెలుగు పదాలను తిరిగి వాడకంలో తీసుకురావడం : జనాలకు నిత్యం వినపడే, కనపడే వనరుల ద్వారానే ఇది జరుగుతుంది, అందుకని సినిమాలు, ఎఫెం రేడియో, వార్తా పత్రికలు, బ్లాగులు, సంభాషణలు అన్నింటా మెల్లి మెల్లిగా కొన్ని పదాలను చొప్పించాలి. సంభాషణలలోకి తేట తెలుగు పదాలను ఇమిడ్చి మాట్లాడుకోవాలి.
 పద్య రచన పునర్వైభవ ప్రాప్తి : ఇప్పటికే ఆంధ్ర ప్రభుత్వం 100 కవితలు వ్రాసిన కవులకు ముద్రించుకునేందుకు డబ్బు సహాయం అందిస్తామని వారి మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇంకా ఎన్నో సంస్థలు, ఎందరో పెద్దలు కవులకు సత్కారాలు చేస్తూ పురస్కారాలు అందిస్తున్నారు. ఈ సంస్థలు లేదా ఆ సహాయం అందించే ప్రభుత్వ అధికారులు నెల నెలా కవి సమ్మేళనాలను వివిధ ప్రాంతాలలో నిర్వహిస్తూ కవితకు ఉండాల్సిన స్వరూపాన్ని వక్కాణిస్తూ సూచనలు పంపగలిగితే బాగుంటుంది.
కోల్పోయిన పద్య/గద్య సంపద పునర్నిర్మాణం : ఇప్పటికే ఎందరో ఈ విషయమై కృషి చేస్తున్నారు. కోల్పోయిన సాహిత్యంతో పాటూ ప్రస్తుతం ఉన్న సాహిత్యాన్ని శాశ్వత పరిచే దిశగా అందరూ కృషి చేయాలి. కానీ శాశ్వత పరచడమంటే స్కాన్ చేసి పెట్టడమనే అల్పబుద్ధి గల వారున్నంత వరకూ ఏమీ చేయలేము. పూర్తి యూనికోడ్ పాఠ్యం చేసి భద్రపరచడమే సరియయిన మార్గం. లాభాపేక్షతో కొందరు సంగ్రహ కర్తలు స్వార్ధంతో వారి వద్దనే కొన్ని అపురూప రచనలను జనసామాన్యానికి దూరంగా ఉంచుతున్నారు. వారు చనిపోవడంతో ఆ రచనలూ నాశనమవుతున్నాయి, తెలుగువారు ఈ అలవాటును విడనాడాలి.
చేతిరాతలచేతివ్రాతల (manuscripts) స్కానింగ్/డిజిటల్ లైబ్రరీ : ఒక రాష్ట్రానికి చెందిన చేతివ్రాతలను వేరే రాష్ట్రం వారు కనీసం బొమ్మల రూపంలోనైనా తీసుకుపోరాదు అన్న నిబంధనలు పెట్టే కుచించుకుపోయిన మనస్తత్వం కల వారి మధ్య మనమున్నాము. ఏం చేయగలం? కుదిరినన్ని విధాలలో వీటిని పలుచోట్ల భద్ర పరచాలి.
కంప్యూటర్/కీబోర్డు వ్యవస్థ లాంటి స్తూలాంశాలను స్థూలాంశాలను (broad headings) ముందుగా గుర్తించాలి. ప్రతిదానిలో కొన్ని కొన్ని ముఖ్యమయిన సూక్ష్మ పరిశోదనా విషయాలను (specific research outline) ఖరారు చేయాలి. : ఈ దిశగా ఎందరో ఇప్పటికే పని చేస్తున్నారు (IIT-M వారి imli, IIITH, HCU, JNTU వారి పరిశోధనలు). ఇక ఎందరో కంప్యూటర్ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను (వీవెన్ గారు, ఇతర e-తెలుగు సభ్యులు, నేనూను) సంప్రదించేలా ఒక వ్యవస్థ ఏర్పడాలి.
ఆయా పరిశోధనల లక్షాలు, మానవ & ధన వనరులు, కాల పరిమితి వగైరా విషయాలను రికార్డు చేసుకోవాలి. : ఇది పరోక్షంగా, ప్రత్యక్షంగా కొన్ని సందర్భాలలో జరుగుతోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు భాషకు ఒక మానిఫెస్టో కావాలి. ఇదంతా చేయడానికి ఎందరో పెద్దల సహకారం అవసరం. ఈ ప్రక్రియకు ఖర్చు ఆట్టే కాదు కానీ అందరినీ ఒకదగ్గర జమా చేయడం, వారి చర్చలను రికార్డు చేయడం మరియు వారి నిర్ణయాలను ప్రచురించడం కోసం ఎంతో ఓర్పు & శ్రమ పడుతుంది. Coordination, not funds, is the key to this exercise.
ఇది జరిగితే మొదటి అడుగు నాదే అవ్వాలని, పూర్తి సహకారం అందిస్తాననీ హామీ ఇస్తున్నాను.

కనీసం తెలుగుభాషయొక్క వినియోగం సరియైన దిశగానైనా జరిగేలా మనం చర్యలు తీసుకోలేని స్థితిలో ఉన్నాం. 
ఈ విషయాన్ని నేను ఖండిస్తున్నాను. ఇందుకు సరియయిన ఋజువు ఉందా? నిరూపించగలరా?
ఇక తెలుగు భాషకు ఆధునిక హోదా తేవడానికి మరో ప్రజా ఉద్యమమే రావాలి. పైన వ్యాఖ్యలో జై గొట్టిముక్కల సూచించినట్టు ఒక మానిఫెస్టో కావాలి. జాలమూ బ్లాగులూ వేదికగా మనందరమూ ఆ దిశగా ప్రయత్నం మొదలుపెట్టవచ్చు.
ఇదే మనం చెయ్యగలిగీ, ఇప్పటిదాకా చెయ్యని పని. బ్లాగరులకు ఎంతటి అవకాశం ఉందో, ఏ దిశలో పనిచేయవచ్చో తెలిసీ ఆ దిశగా బ్లాగరులు పని చేయలేకపోతున్నారు.
ఇలాంటి వారు ఒక సత్పరిమాణం కోసం సత్సంకల్పం చేస్తే మంచే జరుగుతుంది. ఫలితాలు వచ్చాక ప్రస్తుతం దూరంగా ఉన్నవారిలో చలనం వస్తుంది.
ఇదే నా మాట కూడా!

  



  

Wednesday, July 16, 2014

బాణావతి - విశ్వనాథ సత్యనారాయణ - పిశాచ ప్రసంగం

బాణావతి - ఇప్పుడే చదవడం పూర్తి చేసాను.
సాహిత్య ప్రక్రియల్లో ఇదో రకం ప్రయోగం. పూర్తి సంభాషణల మధ్యనే నవలలోని కథను నడుపుతూ, మధ్యమధ్యలో హాస్యపు గుళికలు, సాహిత్య చర్చలు, రాజకీయ చర్చలు చేయిస్తూ, అలౌకిక శక్తులకు సంబంధించిన సున్నితమయిన పీటముడి అంశాలను చాలా ఓపిగ్గా విడదీస్తూ వెళ్ళిన నవల.
పిశాచాలు, ప్రేతాలు, ప్రయోగాలు లాంటివి నమ్మాలో నమ్మకూడదో అటుంచితే, ఆ అంశం నుండి కూడా వేదాంతాలు, స్త్రీ-పురుష సంబంధాల విశ్లేషణ, రాజకీయ సామాజిక పరిస్థితులని చూపించడంలో కవి సామ్రాట్ కు సాటిలేరెవ్వరు.
నలుగురం స్నేహితులం కలిసామంటే మాటల్లో మాటల్లో దెయ్యాల కథల వైపు చర్చ సాగించడం పరిపాటి, ఆ సన్నివేశమే ఇందులో మొదలవటం ఒక నోస్టాల్జియా. ఆపై క్రింది ఉద్యోగులు తమ పై అధికారులను పరోక్షనింద చేయడమూ పరిపాటే (నాకా అలవాటు లేదనుకోండి)!

సామాజిక పరిస్థితులను అధిగమించి వేద-శాస్త్రాలను నేర్చిన వనిత, అదే సామాజిక పరిస్థితులకు తలవంచి బాల్య వివాహానికి బలి కావడం, అక్కడ మొదలు పాపపు సాంగత్యం వలన అరిషడ్వర్గాల బానిసవడం, చేయరాని పాపాలలో పాలు పంచుకోవడం, దీన స్థితికి చేరి వైద్యానికి డబ్బు లేక, డబ్బు బదులు పాపం మోసి చనిపోవడం, అక్కడితో ఆగక కామాన్ని మూటకట్టుకొని కామినీ పిశాచిగా మారటం, మారి ఒక బీద యువకుడిని పట్టి పీడించ చూసి, అతనికి దాసియై, అతనికి సర్వ విద్యల సారం అందేలా చేసి, అతని ద్వారా తన మోక్షాన్ని పొందించుకున్న పిశాచం కథే ఈ బాణావతి.

సంభాషణలు చాలా చమత్కారంగా ఉంటాయి. విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యపు మిఠాయి కొట్లో ఇందాకా నేను చదివినవన్నీ తియ్యటి పదార్ధాలయితే, కారబ్బూందీ ఈ బాణావతి.

సూక్ష్మ లోకం గురించి ఇంకొంచెం లోతుగా అర్ధం చేసుకునే అవకాశం కలిగింది. నాస్తికత్వ భావం కలవారిని కూడా తగిన రీతి పిశాచాలలోకం తీరుతెన్నులపై అవగాహన కలిగేలా చేసే కథనం.
భార్య-భర్త సంబంధం మరింత వక్కాణించి చెప్పారు కవి సామ్రాట్టు.

హైదరాబాదు పరిసర ప్రాంతాలు 60ల ప్రాంతంలో ఎలా ఉండేది అన్న విషయాన్ని కళ్ళకు కట్టినట్టు చెప్పారు.
విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయుల వెతలు వారి సంభాషణల్లోనే చదవవచ్చు. ఒక సన్నివేశంలో ఆంగ్లం వీపు మీద "అట్టు" వేయడమూ జరిగింది!
సమాజంలోని బాల్య వివాహం అనే రుగ్మత ఎలాంటి సామాజిక దారుణాలకు దారి తీస్తుందో ఒక విధంగా చెప్పకనే చెప్పారు.
ఇంతకీ పుస్తకం పూర్తి చేసినా నాకు అర్ధం కానిది శర్మ వాళ్ళ చిన్నన్నయ్య మీదకు ప్రయోగం ఎవరు చేయించారూ, అన్న విషయం!
లేక ప్రయోగం బేగంపేట లోని ఇంట్లో ఉండటానికి వచ్చిన వారి మీద జరిగిందా?
మొత్తానికి మంచి మనోరంజకం అలాగే ధర్మసూక్ష్మాలనూ తెలిపే గ్రంథం!